– రూ 128 కోట్లు విడుదలకు ప్లాన్
– రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూపులు
– రూ 2వేల కోట్ల పెండింగ్
– సకాలంలో అందని సాయం
సర్కారుపై హుజూర్నగర్ ఉపఎన్నికల ఎఫెక్ట్ కనిపిస్తున్నది. ముందస్తు ఎన్నికల్లో ప్రయోగించిన రైతుబంధు ఫార్ములాను ఈ ఉపఎన్నికల్లోనూ వాడుకోవాలని భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్న రైతును కాదనీ, ముందుగా సూర్యాపేట జిల్లా రైతులకు రైతు బంధు అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్క రోజు ముందే రూ 128కోట్లు ఆర్థికశాఖ రైతుల ఖాతాలకు విడుదల చేయడం గమనార్హం. సూర్యాపేట జిల్లాలో 2.30లక్షల మంది రైతులు రైతుబంధు లబ్ధిదారులుగా ఉన్నారు. వారికి రూ 290కోట్లు అవసరం ఉన్నది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఒక లక్షా 90వేల మంది రైతులకు రూ 160 కోట్లు రైతుబంధు అందింది. ఇంకా రూ.130కోట్లు అవసరం కాగా, వాటిలో ఏకంగా రూ 128కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. వేగవంతంగా రైతులకు చేరాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో గత మూడు నాలుగు రోజులుగా సూర్యాపేట్ జిల్లాలోని 40వేల మంది రైతులకు రైతుబంధు నిధులు వేగంగా ఖాతాల్లో పడుతున్నాయి. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో లబ్ధిపొందడానికి రైతుబంధు అడ్డంపెట్టుకొని ఓట్లు కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
రైతు బంధుకు ఆలస్యమెందుకు?
జూన్ మాసంలో ఇవ్వాల్సిన రైతు బంధు ఆలస్యమవుతున్నది. ఖరీఫ్ సీజన్ కూడా ముగింపునకు వచ్చినప్పటికీ రైతులకు ఆ పథకం చేరడం లేదు. మొన్నటిదాకా బడ్జెట్ తర్వాత ఇస్తామని చెప్పుకొచ్చింది. రైతుబంధుకు బడ్జెట్లో నిధులు కేటాయించినా…విడుదల చేయకుండా కేవలం సూర్యాపేటకే పరిమితమవుతున్నది. ఆరుతడి పంటల సాగు పూర్తయింది. పంట కూడా చేతికొచ్చే పరిస్థితి ఏర్పడింది. వరి నాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుకు సర్కారు ‘సాయం’ అందడం లేదు. వానలు కురుస్తున్న ఆనందం రైతుల్లో వెల్లివిరుస్తున్నా…పెట్టుబడి సాయం ఖాతాల్లోకి చేరకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు సాయం అందని రైతులు రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మందికిపైగా ఉన్నారు. వీరికి రూ 2వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నది. రైతుబంధు కోసం రైతన్న ఎదురు చూస్తున్నారు. సాధారణంగా డబ్బులు బ్యాంకుల్లో పడగానే రైతుల ఫోన్లకు మెస్సేజ్ వస్తుంది. చాలా మంది రైతులు సంక్షిప్త సమాచారం చూసుకోవడంతోపాటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు పొలం పనులు చేసుకుంటూనే…మరోవైపు వ్యవసాయ విస్తరణాధికారులు, బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ పథకాన్ని ఆపబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటివరకు రైతుబంధుపై సర్కారు దృష్టి సారించకపోవడంతో సాయం అందుతుందా? లేదా? అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రైతుబంధుకు పరిమితి విధిస్తారన్న ప్రచారమూ జరుగుతున్నది.
Courtesy Navatelanagana..