శిక్షణా కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. వారి రోజువారీ దినచర్య ఎలా ఉంటుందన్నది గంటలు నిముషాలతో సహా శంకర్రెడ్డి వివరంగా నమోదు చేశారు. ఉదయం 4.45కు మేల్కొలుపు ఉంటే, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ‘ఏకాత్మతా సూత్రం’ శ్లోకపఠనం ఉంటుంది. ధృతువ్యాయామం, సూర్య నమస్కారం వగైరా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలకు గీత్, సుభాషితం, అమృత వచనం.. వంటి అందమైన శీర్షికలుంటాయి. అయితే అందులో ”గజ్జల మలారే, గజ్జెల మలారే – బాంబు పెట్టి లేపుతం కొడుకో – బాబ్రీ మసీదు” వంటి పాటలు పాడేవారు. అందరూ అందులో తప్పనిసరిగా గొంతుకలపాల్సిందే! ఆ తర్వాత ఉదయం 5.50 నుంచి 7.50 మధ్య రెండు గంటల సేపు కరాటే, కర్రసాము వగైరా చేయిస్తారు. ఇందులో ముస్లిం ముక్కుమీద కొడుతున్నట్టు ఊహించుకోమంటారు. లేదా క్రైస్తవుల్ని కర్రతో తలమీద కొడుతున్నట్టు అనుకోమంటారు. ముస్లిం గుండె పగిలి రక్తం బయటికి రావాలని, క్రైస్తవుడి తల పగలాలని విద్వేష-విషం ఎక్కిస్తారు. శిక్షణ పొందేవారంతా యువరక్తంతో ఉడికిపోయేవారు గనక, అలాంటి ఆదేశాలకు వారు సులభంగా ఆకర్షితులవుతారు. అలాగే పాటిస్తారు కూడా! ”మిమ్మల్ని మీరు శివాజీ అనుకోండి. శివాజీ ముస్లింలపై యుద్ధం చేస్తున్నాడని అనుకోండి. లేదా మీరు చర్చ్లపై దాడి చేస్తున్నట్టు భావించుకోండి. అదే దేశభక్తి. దాని ద్వారానే మీరు భగవంతుణ్ణి చేరుకుంటారు” అని బోధిస్తారు. పగలు 12.15 నుంచి 2.30 మధ్య భోజనం ముగుస్తుంది. కొంత విశ్రాంతి నిస్తారు. మళ్లీ పగలు 3.30 నుంచి 4.30 మధ్య ‘బౌద్ధిక్’ కార్యక్రమం ఉంటుంది. ఇందులో చరిత్ర బోధిస్తారు. అదేమిచరిత్రా? ముస్లిం రాజులు హిందూ రాజుల్ని చంపిన చరిత్ర. 4.45కు ఉపాహారం (స్నాక్) ఉంటుంది. ఆ తర్వాత 5.15 నుంచి 7.00 మధ్య కాలంలో శారీరక్ కార్యక్రమం – ఇందులో వ్యాయామం, యోగ వగైరా చేయాల్సి ఉంటుంది. అరగంట విరామం తర్వాత రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శివాజీ, రాణా ప్రతాప్సింగ్, గురుగోవింద్ సింగ్ మొదలైన వారంతా ముస్లింలపై చేసిన యుద్ధాల గురించి బోధన ఉంటుంది. రాత్రి 9.10 మధ్య భోజనం చేసి, రాత్రి 10.15కు నిద్రపోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి విచిత్రమైన బొమ్మలాటలాడిస్తారు.
శిక్షణకోసం శాఖకు వచ్చేవారిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. కొందరిని హిందువులుగా, మరికొందరిని ముస్లింలుగా ఎదురెదురుగా నిలబెడతారు. హిందూ పాత్రధారులు కత్తులు పట్టుకుని నిలబడతారు. ముస్లిం పాత్రధారులు ప్లాస్టిక్ సంచుల్లో ఎర్రరంగు నింపుకుని ఒంటికి కట్టుకుంటారు. ఉత్తుత్తి కొట్లాట జరుగుతుంది. హిందూ పాత్రధారులు కత్తులతో ఎదురుగా ఉన్న ముస్లింపై పాత్రధారులతో తలపడతారు. వారి ఒంటిమీద ఉన్న రంగు నింపిన సంచులు పగలగొడతారు. అంటే హిందువులు ముస్లింలపై దాడి చేసినట్టు, ముస్లింలు రక్తం కార్చుకుని గాయపడ్డట్టు, మరణించినట్టూ అక్కడ ఒక కృత్రిమ అసహజ దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. ఇతర మతాల వారిని ఎంతగా ద్వేషించాలో అలా ప్రాయోగికంగా నేర్పిస్తారన్న మాట! దీనికే ‘సాహసకేళి’ అని ఒక ముద్దుపేరు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గాంధీజీ పటానికి ఎరుపురంగు నింపి సంచి కట్టి, అధికార పార్టీ వారు పిస్టల్ పేల్చి ఎరుపురంగు సంచి పగులగొట్టడం చూస్తూనే ఉన్నాం. అంటే గాంధీజీని హత్య చేయడం ఒక మహౌన్నతమైన దేశభక్తి చర్యగా, చిత్రీకరించుకోవడం బహిరంగంగా దేశ ప్రజలకు కనిపిస్తూనే ఉంది కదా? ఇక వారి శిక్షణా కార్యక్రమాలలో యువకులకు ఇలాంటివి నేర్పించడంలో ఆశ్చర్యమేముందీ? ఆర్.ఎస్.ఎస్.లో అందరూ సమానులే అని చెప్పేవారు. కానీ, అలా నడుచుకునేవారు కాదు. అగ్రవర్ణాలవారు నిమ్నజాతుల వారిని మానసికంగా, శారీరకంగా హింసించేవారు. భోజనం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. మధ్యమధ్యలో 1947 నాటి దేశవిభజన సినిమా చూపించేవారు. గాడ్సే గాంధీజీని చంపిన విధానం వివరించి, గాడ్సే నిజమైన దేశభక్తుడు అని మళ్లీమళ్లీ చెప్పేవారు.
ముస్లిం రాజులు పాలిస్తున్న కాలంలో హిందూ స్త్రీలపై విరివిగా అఘాయిత్యాలు జరుగుతుండేవని, అప్పుడు హిందూ స్త్రీలు, హిందూపురుషులకు ”అన్నయ్యా! నువ్వు నన్ను కాపాడాలి” అనే ఉద్దేశంతో రాఖీ కట్టే వారని – అదే ‘రక్షా బంధన్’ పర్వదినమైందని చెప్పేవారు. దాన్ని ఒక దేశభక్తి కార్యక్రమంగా ప్రచారం చేసేవారు. అగ్రవర్ణాలవారు ఆర్.ఎస్.ఎస్.ని ఉపయోగించుకుని ఎలా బాగుపడ్డారో, దళిత బహుజనులు నక్సలైట్లతో తలపడి ఎలా ప్రాణత్యాగం చేశారో ఆధారాలతో సహా వివరించారు. బ్రాహ్మణ ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు నిమ్నజాతి మహిళల్ని లైంగికంగా వాడుకుని వదిలేసినా, తానేమీ చేయలేని స్థితిలో ఉన్నానేమని కుమిలిపోయేవారట పోరెడ్డి. స్వదేశీ వస్తువులే వాడండని జనానికి ఉపన్యాసాలు చెప్పే ధనిక ఆర్.ఎస్.ఎస్. పెద్దలు.. తాము మాత్రం విదేశీ వస్తువుల్నే వాడేవారట. ఆదివాసీ యువకుల్ని బలవంతంగా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మలుచుకునేవారని, వారికి విద్యనందించడం కన్నా, వారిలో మత ద్వేషం పెంచడమే ముఖ్యమనుకునే వారని శంకర్రెడ్డి రాశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు కాలేజీ యాజమాన్యాలను బెదిరించి, అక్రమంగా కోట్లడబ్బు కొల్లగొట్టడం ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆ డబ్బుతో కొందరు తెలంగాణలో అధికార పక్షంతో దోస్తీ చేసి, రాజకీయంగా ఎదిగిన వివరాలు తన దగ్గరున్నాయని మాజీ ప్రచారక్ చెపుతున్నారు. అంతే కాదు ఆయన ఒక 40 నిమిషాల వీడియో చిత్రించి విడుదల చేశారు కూడా! అందులో ఆరెస్సెస్ మోసాలు కొన్ని నమోదయి ఉన్నాయి. ఇవి కాక, ఆరెస్సెస్ విధానాల్ని వ్యతిరేకించిన తన లాంటి కార్యకర్తలు వరుసగా ఎందుకు చనిపోయారూ? అనే ప్రశ్న లేవనెత్తారు. ఒకరు కడప లాడ్జిలో, మరొకరు అక్కడే రైలు కింద, ఇంకొకరు వరంగల్ కార్యాలయంలో నిప్పంటించుకుని ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారూ? బేధాభిప్రాయాలుంటే ఏదో రకంగా చంపించడమే పరిష్కారమా? అని ఆయన ఆవేదన చెందారు. దేశాన్ని ప్రేమించమంటారు కానీ, ఇది దేశభక్తి సంస్థ కాదు. దేవుణ్ణి నమ్మమంటారు. కానీ, ఇది ధార్మిక సంస్థ కాదు. రాజకీయం చేస్తారు కానీ ఇది రాజకీయ సంస్థ కాదు. తామే సైన్యమని చెప్పుకుంటారు. కానీ ఆరెస్సెస్ చీఫ్ జడ్ కేటగిరి భద్రతా వలయంలో ఉంటారు. అంటే వీరు చెప్పే నిజం ఒకటైనా ఉందా? ఇదేం దేశభక్తీ? ఇదేం భారతీయ సంస్కృతీ? ఇవి ఏ కొందరి ప్రశ్నలో కాదు. ఇప్పుడు దేశంలో అత్యధికులు సంధిస్తున్న ప్రశ్నలు.
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీ వేత్త, బయాలజీ ప్రొఫెసర్.
– డాక్టర్ దేవరాజు మహారాజు