తమకు కేటాయించిన ఏరియాలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఉరుకులు పరుగులే. 24 గంటలు బాలింతలు, గర్భవతులు, పసిపిల్లలకు అందబాటులో వుండాలి. పేరుకే మాతాశిశు సంరక్షణ. ఆచరణలో ఆరోగ్యానికి సంబంధం లేని పనులు కూడా చేయాల్సిందే. పై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ యంత్రాల్లా పని చేయాలి. కరోనా విధులు నిర్వహిస్తూ రాష్ట్రంలో 20 మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వాలకు మాత్రం కనికరం లేదు.
రాష్ట్రంలో 14 ఏళ్లుగా పని చేస్తున్న 40 వేల మంది ఆశాలకు చట్టబద్ధ సౌకర్యాలు లేవు. పేరుకి ఆరోగ్య రంగం అయినా ప్రసూతి సౌకర్యం లేదు. కార్మికులుగా గుర్తించకుండా ప్రభుత్వాలు ఆశాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి. ప్రాణాలకు తెగించి కరోనా డ్యూటీలు చేస్తున్నా రక్షణ పరికరాలు అందించలేదు. ఇంటింటికి తిప్పి 6 విడతలుగా సర్వేల మీద సర్వేలు చేయించారు. ఆసుపత్రుల్లో వ్యర్ధాలను తొలగించే పని, బ్లీచింగ్ చల్లించటం, క్వారంటైన్ డ్యూటీలు లాంటి ఆదనపు పనులు చేయించారు. గత 6 నెలలుగా ఒక్క రోజు కూడా సెలవు లేదు. అనారోగ్యంతో ఉన్నవారికి సహితం సెలవు ఇవ్వకుండా ఊడిగం చేయించారు. ఆశా వర్కర్లు అందరికీ కోవిడ్ టెస్టులు చేయలేదు. టెస్టులు చేయించుకున్న వారికి రిపోర్టులు రాకముందే బెదిరించి పని చేయిస్తున్నారు. అనుమానిత కేసుల వెంట టెస్టులకు పంపించటం, వెంట ఉన్న వాళ్ళకి పాజిటివ్ వచ్చినా ఆశాలకు టెస్టులు చేయక పోవటంతో కోవిడ్ బారిన పడుతున్న ఆశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వివిధ జిల్లాలలో ఆశాలను కరోనా బలితీసుకుంది.
కోవిడ్ డ్యూటీలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు ‘వారియర్స్’ అనే ముద్దు పేరు పెట్టారు. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా చప్పట్లు కొట్టి పూలు చల్లించారు. ఆగస్టు 15వ తేదీన శాలువాలు కప్పి ఆర్భాటంగా సన్మానాలు చేయించారు. విధి నిర్వహణలో చనిపోయిన వారికి 50 లక్షల బీమా నేటికీ అందలేదు. కోవిడ్ డ్యూటీలో ఉన్న ఆశాలకు నెలకు రూ. 1000 చెల్లించాలని కేంద్రం చెప్పినా మన రాష్ట్రంలో నేటికీ చెల్లించలేదు.
ఎన్హెచ్ఎమ్ నిబంధనల ప్రకారం ప్రతి 1000-1200 జనాభాకు ఒక ఆశా, గిరిజన ప్రాంతాల్లో హేబిటేషన్కు ఒకరు ఉండాలి. ఆ ఊరి కోడలు లేదా కూతురై ఉండాలి. స్థానికంగా నివాసం ఉండాలి. ఈ నిబంధనలకు పాతరేసి ఆశాలను సచివాలయాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివలన పట్టణాల్లో 2 నుండి 8 వేల జనాభాకు ఒక్కరే పని చేయాలి. వెయ్యి కంటే తక్కువ జనాభా ఉంటే తొలగించబడుతున్నారు. రాజన్న రాజ్యంలో ఆశాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
ఎన్హెచ్ఎమ్ నిబంధనల ప్రకారం ఖాళీగా వున్న ఆశా పోస్టులను భర్తీ చేస్తే 10 వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించవచ్చు. ఆశాలకు పని భారాన్ని తగ్గించవచ్చు. ఎఎన్ఎం లుగా శిక్షణ పొందిన వారికి ప్రమోషన్ సౌకర్యం కల్పించడంలేదు. మూడేళ్లుగా యూనిఫామ్ ఇవ్వలేదు. ఒంటి మీద చీర, దండెం మీద మరొక చీరతో గత 7 నెలలుగా రోజూ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. యూనిఫామ్ ధరించకపోతే జీతాలలో కోతలు తప్పవని…స్మార్ట్ ఫోన్లు కొని తద్వారా పని చేయాలనే బెదిరింపులు పెరిగాయి. ప్రభుత్వమే ఫోన్, సిమ్ ఇవ్వాలని ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు.
దేశం యావత్తు కరోనాతో విలవిల్లాడుతుంటే ఇదే అదనుగా మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు నైవేద్యంగా పెడుతుంది. కరోనా బారిన పడిన వారి రక్త మాంసాలను కార్పొరేట్ హాస్పిటళ్లు జలగల్లా పీల్చేస్తుంటే పాలకులు గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నారు. దేశంలో ఖాళీగా వున్న డాక్టర్ల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల 2000 పిహెచ్సి లు మూతబడ్డాయి. మందుల ధరలకు రెక్కలొచ్చాయి. కరోనా విధ్వంసం ప్రభుత్వ వైద్యం ప్రాధాన్యతను తెలియజేసినా జిడిపి లో ప్రజారోగ్యానికి 3 శాతం నిధులు కేటాయించటానికి మోడీ ప్రభుత్వం సుముఖంగా లేదు. మోడీ కార్పొరేట్ విధానాలకు మన రాష్ట్ర ప్రభుత్వం డూడూ బసవన్నలా తలాడిస్తున్నది.
ఉద్యోగులుగా గుర్తించకుండానే 60 ఏళ్లు నిండాయని బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నది. చట్టబద్ధ సౌకర్యాలు అమలవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సహితం రిటైర్మెంట్ అయిన తరువాత, పెద్ద మొత్తంలో పెన్షన్ పొందుతూ మరలా అదే ఆఫీసులో కాంట్రాక్టు/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతూ ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నారు. కనీస వేతనం కూడా లేని ఆశా వర్కర్లను ఏ విధమైన రిటైర్మెంట్ బెనిఫిట్లు లేకుండా ఇంటికి సాగనంపుతున్నారు. భర్త తాలూకా పెన్షన్దారులుంటే విధుల నుండి తొలగిస్తున్నారు.
ప్రభుత్వ రికార్డులలో ఉద్యోగులుగా చూపడంతో సంక్షేమ పథకాలు ఆశాలకు అందటం లేదు. ప్రభుత్వం నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నది. కనీస వేతనం కూడా కాదు. రేషన్ కార్డుదారులందరూ సంక్షేమ పథకాలకు అర్హులని చెప్తున్న ప్రభుత్వం ఆశాలను మాత్రం అనర్హులుగా ప్రకటించటం అన్యాయం. ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని రికార్డుల నుండి తొలగించి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని గత 15 నెలలుగా పోరాడుతూనే వున్నారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యనైనా 15 రోజుల్లో పరిష్కరిస్తామని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి గారికి…15 నెలలుగా గొడ్డు చాకిరీ చేస్తూ తమ కష్టాలను తీర్చమని గొంతెత్తి నినదిస్తున్నా ఎందుకు చెవికెక్కడం లేదు? తమ సమస్యల పరిష్కారానికి ఆశాలు సంఘటిత పోరాటాలకు సన్నద్ధం అవుతున్నారు. వారి న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు అండదండలు ఇవ్వాలి.
– కె.ధనలక్ష్మి (వ్యాసకర్త ఎ.పి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి)