– ఆర్థిక సామ్రాజ్యాల విస్తరణలో మోడీ సన్నిహితుడు
– గుజరాతీఖాతాలో ముంబయి విమానాశ్రయం
దేశవ్యాప్తంగా ప్రయివేటు కంపెనీలు కోవిడ్ నేపథ్యంలో దివాలా అంచున ఉంటే రిలయన్స్, అదానీ కంపెనీలు మాత్రం తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిస్తు న్నాయి. రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడులు, ఫేస్బుక్లో బీజేపీ అనుకూల విద్వేషపూరిత ప్రచారాన్ని తొలగించటానికి యాజమాన్యం తిరస్కరించటం వంటి విషయాలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రిలయన్స్ ఆర్థిక సామ్రాజ్యం విస్తరణ గురించి మీడియాలో వచ్చినంతగా అదానీ గురించి రావటం లేదు. గత ఏడాది ఎన్నికల ముందు వరకు అదానీ కంపెనీ ప్రధానంగా రేవుపట్టణాల నిర్మాణం, నిర్వహణ, విద్యుత్, బొగ్గు గనులు, జాతీయ రహదారులకే పరిమితమైంది. కానీ 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్వహించిన విమానాశ్రయాల వేలంలో ఏకంగా 8 విమానాశ్రయాలు సొంతం చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది అదానీ కంపెనీ. అతను ముచ్చటపడితే దేన్నేనా తన వశం చేసుకునేలా మోడీ సర్కార్ అండగా నిలుస్తున్నదనటానికి తాజా పరిణామాలేనని స్పష్టమ వుతున్నది. ఇపుడు ఆకాశమార్గాన్ని తన చెప్పుచేత ల్లోకి తెచ్చుకోవాలని స్కెచ్ వేశాడు. అదానీకి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంపై ముచ్చటేసింది. గత కొంత కాలంగా ఈ విమానాశ్రాయాన్ని నడుపుతున్న జీవీకే గ్రూప్తో వాటాలు కొనుగోలు విషయమై చర్చలు జరిగాయి. తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయివేట్ లిమిటెడ్లో 74 శాతం వాటాను అదానీ కంపెనీ సొంతం చేసుకోనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. లాభార్జన కోసం జీవీకే అమ్ముకుంటే అది మార్కెట్ నీతే కదా అని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ వార్తకు ముందు వచ్చిన కొన్ని వార్తలు కూడా పరిశీలిస్తే పారిశ్రామిక వర్గాల్లో నెలకొన్న ఆందోళన తీవ్రత అర్థమవుతుంది.
సుమారు 15 వేల కోట్ల రూపాయలతో ముంబయి విమానాశ్రయం కంపెనీలో 74శాతం వాటా కొనుగోలు చేయటానికి ఒప్పందం ఖరారైందన్న వార్తతో అదానీ షేర్ విలువ 9శాతం పెరిగిందని షేర్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ముంబయి విమానాశ్రయం కంపెనీలో జీవీకేకు 50శాతం వాటాలు, బిడ్వెస్ట్ అనేక విదేశీ కంపెనీకి 13.5శాతం, దక్షిణాఫ్రికా విమానయాన కంపెనీకి 10 శాతం వాటాలున్నాయి. మిగిలిన 26 శాతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో ఉంది. శుక్రవారం ఉదయానికి మార్కెట్ వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం ఎయిర్ పోర్ట్ అథారిటీ వాటా తప్ప మిగిలిన అన్ని వాటాలూ అదానీ కంపెనీ కొనుగోలు చేయటానికి జీవీకే కంపెనీ సూత్రప్రాయంగా అంగీకరించింది.
కేంద్ర ప్రభుత్వానికి, జీవీకేకు కుదిరిన రాయితీ ఒప్పందం ప్రకారం ముంబయి విమానాశ్రయంలో ఎవరు వాటా అమ్మాలన్నా ముందు జీవీకేను అడగాలి. కానీ ప్రస్తుతం అలా జరక్కపోవటం పట్ల కార్పొరేట్ దిగ్గజాలు విస్మయం చెందుతున్నాయి. తొలిసారి 2019 మార్చిలో బిడ్వెస్ట్కు చెందిన వాటాను 1248 కోట్లకు కొనుగోలు చేయటానికి అదానీ ఆసక్తి చూపాడు. కానీ రాయితీ ఒప్పందంపై నమ్మకంతో ఉన్న జీవీకే సంస్థ ఆ రేటుకు తామే కొనుగోలు చేస్తామని ప్రతిపాదించింది. అదానీ మనసు పడ్డాక రాయితీ ఒప్పందం అడ్డుపడుతుందా… అదానీ కంపెనీ ముంబయి హైకోర్టులో కేసు వేసింది. ముంబయి హైకోర్టు 2019 నవంబరు కల్లా కొనుగోలు విషయం తేల్చాలని జీవీకేను ఆదేశించింది.
కరోనా నేపథ్యంలో పేరుకున్న బకాయిలు వదిలించుకోవటానికి జీవీకే ఎయిర్పోర్ట్ హౌల్డింగ్స్లో 74 శాతం వాటాను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, కెనడా పెన్షన్ ఫండ్, దుబాయి విమానాశ్రయ కంపెనీల కన్సార్టియానికి అమ్మజూపింది. జనవరి 2020 నాటికి బిడ్వెస్ట్ కంపెనీ వాటా కొనుగోలు ప్రయత్నాలు నిలిపివేయాలని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ జీవీకేను ఆదేశించింది. అప్పటి వరకు కథ బాగానే సాగింది. కానీ జులైలో జీవీకే అదృష్టానికి చెదలు పట్టాయి. ముంబయి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సుమారు 705 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ జీవీకే సంస్థ అధినేత జి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కొడుకు సంజరు రెడ్డి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి కేసు నమోదు చేసింది. ఇదే విషయమై జులైలో సీబీఐ కూడా ఓ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది.
ఈ మొత్తం వ్యవహారాలు పరిశీలించిన మార్కెట్ విశ్లేషకులు ముంబయి విమానాశ్రయంపై అదానీ మనసు పడటానికి, జీవీకే హౌల్డింగ్స్పై సీబీఐ కేసుకు మధ్య సంబంధం ఉందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉంటే విమానాశ్రయాల్లో ముంబయి విమానాశ్రయం ఒకటి. దాని స్వాధీనంలో సుమారు 200 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. అదానీ ప్రేమ విమానాశ్రయం మీదనా దాని స్వాధీనంలో ఉన్న భూముల మీదనా అన్నది రానున్న కాలంలో వెల్లడికానుంది.
కొండూరి వీరయ్య