మధు ప్రసాద్
ప్రపంచబ్యాంకు 1994 నుండీ కార్పొరేట్ జాబ్ మార్కెట్కు ఎటువంటివారు అవసరమో వారిని తయారు చేయడమే లక్ష్యంగా విద్యా రంగంలో జోక్యం చేసుకుంటోంది. దానికి తోడు ప్రైవేటీకరణ, విద్యా వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ లక్ష్యాలు. ఈ నమూనాలో పిల్లలను చదివించుకునే బాధ్యత తల్లిదండ్రులది అవుతుందే తప్ప ప్రభుత్వానిది కాదు. ఆ తల్లిదండ్రులు వినిమయదారులు. ఆ వినిమయదారులలో స్తోమత ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం విద్యా వ్యాపారుల మార్కెట్ వ్యూహం. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్థులపై పట్టు పెంచుకోవడం అందులో భాగం. ఇక ఫీజు రీఇంబర్స్మెంట్, నగదు బదిలీ వంటి ప్రభుత్వ పథకాలన్నీ వీరి మార్కెట్ను మరింత విస్తృతపరచడానికి తోడ్పడతాయి.
ఈ వ్యూహాన్ని అమలుచేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం వైపు నుండి కొన్ని చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభుత్వ విద్యారంగానికి నిధుల కేటాయింపులో కోత పెట్టడం, పిల్లలు తక్కువ ఉన్నారన్న నెపంతో స్కూళ్ళను మూసేయడం లేదా విలీనం చేయడం, ఉపాధ్యాయుల పోస్టుల రేషనలైజేషన్ వంటివి ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ చర్యలను నూతన విద్యా విధానం-2020 (ఎన్ఇపి) సమర్ధించింది. కొనసాగించాలని చెప్పింది.
జనాభాలో 85 శాతంగా ఉన్న దళిత, ఒబిసి, ముస్లిం, గిరిజన, ట్రాన్స్జెండర్లు, బాలికలు-వీరంతా ఈ చర్యల ఫలితంగా చదువుకు దూరమౌతారు. వీరికోసం సంక్షేమ నిధులు కేటాయించినా అందువలన వీరి పరిస్థితిలో మార్పు ఇంతవరకూ రాలేదు, ఈ ఎన్ఇపి పుణ్యమా అని ఇక ముందూ రాదు.
కార్పొరేట్ జాబ్ మార్కెట్ కోసం ఈ విద్యా వ్యాపారం చేపట్టి రెండు విధాలా లాభం పొందాలనేది పాలక వర్గాల వ్యూహం. ఇందులో నాణ్యత కల విద్య అన్నదానికి చోటు లేదు. ఈ ఎన్ఇపి ప్రస్తుతం ఉన్న సిలబస్ చాలా భారంగా ఉందని, ఎక్కువ విజ్ఞానం నేర్చుకోవడం కన్నా ఎక్కువ నైపుణ్యం నేర్చుకోవడం మంచిదని వాదించడం ఇందుకోసమే. వర్తమాన ప్రపంచం గురించి, ప్రజాస్వామ్యం వంటి విలువల గురించి, చరిత్ర గురించి, ఉద్యమాల వారసత్వం గురించి తెలుసుకోవడం అనవసరమని ఎన్ఇపి భావిస్తోంది. చదువు ముగిశాక చేయబోయే పనిలో అవసరమైన నైపుణ్యాన్ని ఎంత నేర్చుకున్నాడనేదే ముఖ్యమైన అంశంగా ఎన్ఇపి భావిస్తోంది.
ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి మధ్య 3,5,8 తరగతుల వద్ద పరీక్షలను నిర్వహించాలని ఎన్ఇపి నిర్దేశించింది. ఈ పరీక్షలలో పాసు కాకుంటే వారిని పక్కకు తప్పించి వారికి గల నైపుణ్యానికి తగిన వృత్తి విద్య శిక్షణ గరుపుతారు. విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన లక్ష్యానికి భిన్నమైన దిశలో ఇది వుంది. 14వ ఏడు వరకూ అందరు విద్యార్థులూ వారి ఆర్థిక. సామాజిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా కనీస స్థాయి వరకైనా ఒకే తరహా విద్యను పొందగలిగి వుండాలని, సృజనాత్మకతను, సామాజిక అవగాహనను, సమాజంలో జరిగే అన్యాయాల పట్ల, వివక్షత పట్ల వారిలో వ్యతిరేకత ఏర్పడాలని, అందరూ సమానమేనన్న భావన కలగాలని విద్యా హక్కు చట్టం చెప్పింది. కాని ఇప్పుడు 3వ క్లాసు తర్వాత నుంచే కొందరు పిల్లలను పక్కకు తప్పించి వృత్తి విద్యల వైపు మళ్ళించడం ఒక పెద్ద కుట్ర.
ఉన్నత విద్యా రంగాన్ని యావత్తూ అదుపు చేసే కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని కార్పొరేట్ రంగం చాలా కాలం నుంచీ డిమాండ్ చేస్తోంది. దానికి ఎన్ఇపి అంగీకరించింది. ఫలితంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి, ఉన్నత విద్యా సంస్థలలో నెలకొన్న ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తింటాయి. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యం లోని యూనివర్సిటీలకు ఇంతవరకూ అందుతున్న ఆర్థిక తోడ్పాటు ఇక ముందు కొనసాగదు. నిలదొక్కుకోవాలంటే అవి ప్రభుత్వం నుంచి విడగొట్టుకుని విద్యా వ్యాపారానికి పూనుకోవలసిందే. ఇదొక చేదు నిజం.
భారతీయత
‘తాము భారతీయులం అయినందుకు గర్వించేలా, మనసా, వాచా, కర్మణా ఆ విలువల గురించి లోతైన అవగాహన ప్రతీ విద్యార్థికీ కల్పించాలి. మానవ హక్కులకు, పర్యావరణ హిత అభివృద్ధికి, విశ్వ శ్రేయస్సుకు కట్టుబడి వుండే విశ్వ మానవులుగా ఎదగాలి’. ఇది ఎన్ఇసి-2020 తన దార్శనికతగా పేర్కొంది. దీనికనుగుణంగా మొదటి దశ నుండే బోధనాంశాలలో, బోధనా పద్ధతుల్లో పూర్తి మార్పులు అవసరం అని ప్రకటించింది.
అయితే ఈ భారతీయత గురించి పదే పదే చెప్పడం జరిగిందే తప్ప ఈ దేశంలోగల భిన్నత్వం, వైవిధ్యం అనేవి ఆ భారతీయతలో అంతర్భాగమని, వాటిని పరిరక్షించుకోవాలని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. మొదటి నుంచీ మన దేశం ప్రపంచంలో గల అన్ని తాత్విక, మత, సాంస్కృతిక, సాంకేతిక విజ్ఞానాలనూ స్వాగతిస్తూ వచ్చింది. కాని ఎన్ఇపి 2020 పత్రంలో అటువంటి ప్రస్తావన ఏమీ లేదు కాని మన ప్రాచీన విజ్ఞానం నుంచి ఆధునిక భారతదేశం నేర్చుకోవలసినది అంతా విద్యా బోధనలో భాగం కావాలని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాచీన విజ్ఞానం ఆధారంగా భవిష్యత్తులో మన లక్ష్యాలను నిర్ణయించుకోవాలని నిర్దేశం చేశారు.
ఆ ప్రాచీన కాల విజ్ఞానం నుండి ఒక్కసారి, కొన్ని శతాబ్దాలను వదిలిపెట్టి ఒక్క గంతులో ఆధునిక కాలానికి రావడం వలన నడుమ యుగాల అనుభవాలన్నీ కోల్పోతారు. అసంఖ్యాకంగా ఉన్న గిరిజన తెగల జీవితాలలో వస్తున్న మార్పులు, కులతత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన సిద్ధాంతాలు, సాంస్కృతిక ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు, హిందూ సమాజం లోని భిన్న తాత్విక ధోరణులు, మధ్య ఆసియా దేశాలతో ఏర్పడిన సంపర్కం వలన కలిగిన అనుభవాలు, ఇస్లాం మతం దేశంలోకి వచ్చాక ఈ దేశంలో వివిధ మతాల నడుమ పెంపొందిన సంబంధాలు, పరస్పరం సంపద్వంతం చేసుకున్న తీరు, పర్యవసానంగా జరిగిన సామాజిక, సాంస్కృతిక, మేధోపరమైన అభివృద్ధి-వీటి అనుభవాలన్నీ కోల్పోతారు.
వలస పాలన, దాని ప్రభావం, దశాబ్దాల తరబడి ప్రజలు సాగించిన పోరాటాలు, ఒకే దేశంగా యావన్మంది ప్రజలూ ఏకమైన తీరు, దేశ విభజన విషాదపు పరిణామాలు, దానిని తట్టుకుని ప్రజలు ఐక్యతను కాపాడుకున్న తీరు, స్వతంత్ర దేశంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, ఇదంతా ఎంతో విలువైన అనుభవం.
ఎన్ఇపి 2020 ప్రతిపాదిస్తున్న సంస్కృతం ఆధార విజ్ఞానం అంతా కలిపినా ఈ అనుభవం ముందు దిగదుడుపే. మన ఉపఖండపు చరిత్ర, సంస్కృతి, తరాల అనుభవాలు ఎంత విలువైనవో ఎన్ఇపి 2020 గ్రహించడంలో పూర్తిగా విఫలమైంది. ఇక నిజమైన భారతీయత గురించి నవతరాలకు ఏ విధంగా బోధించగలుగుతుంది? గతాన్ని సంపూర్ణంగా అర్థం చేసేకోవడం చేతకాని విద్యా విధానం వలన నవతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది.