విద్య అనేది మార్పుకు చోదక శక్తి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యావిధానం విద్యా వ్యాపారాన్ని నియంత్రించదు; రిజర్వేషన్లకు చెల్లుచీటీ ఇచ్చింది; అధికార కేంద్రీకరణకు తావిస్తున్నది. సంప్రదాయాలను కాపాడే విధంగా విద్యావ్యవస్థ ఉండాలని నిర్దేశిస్తున్నది. ఏ వెల్గులకీ విద్యాప్రస్థానం?
కేంద్రప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని ప్రకటించింది. ఈ జాతీయ విద్యావిధానం భారతదేశాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దగలదని ప్రధాని మోదీ ప్రశంసించారు. నూతన విద్యావిధానాన్ని రూపొందించడంలో పార్లమెంటును ప్రక్కన పెట్టడాన్ని కాంగ్రెస్ మొదలైన పార్టీలు ఖండించాయి.
ఈ నూతన విద్యావిధానంలో భాగంగా మానవ వనరుల అభివృద్థి శాఖను తిరిగి విద్యాశాఖగా మార్పు చేస్తారు. పూర్వ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేస్తారు. సెకండరీ, హైయ్యర్ సెకండరీ విద్యలను కలిపివేసి మొత్తాన్ని సెకండరీ విద్యగా పరిగణిస్తారు. పాఠశాల విద్యను 5334 గా పునర్వ్యవస్థీకరిస్తారు. పాఠశాలలో పాఠ్య, సహపాఠ్య; ప్రకృతి, సామాజిక శాస్త్రాలు; అకడమిక్, వొకేషనల్ అనే అడ్డుగోడలను తొలగిస్తారు. ఉన్నత విద్యలో ఎం.ఫిల్ కోర్సులను రద్దు చేశారు. మల్టిపుల్ ఎగ్జిట్ను ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యా కోర్సులలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అనే విధానాన్ని ప్రవేశపెడతారు. టెక్నికల్, మెడికల్, అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయాలు వంటి అధ్యయన విషయాల వారీ విశ్వవిద్యాలయాల పద్ధతి కాక ప్రతి విశ్వవిద్యాలయంలో అన్ని అధ్యయన విషయాలు ఉండాలని, పరిశోధనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, బి.ఎడ్, ఎం.ఎడ్ కోర్సులు అనేవి బహుళ అధ్యయన విషయాలు ఉండే విశ్వవిద్యాలయాలలో మాత్రమే భాగంగా ఉండాలని కొత్త విధానం ప్రతిపాదించింది.
విశ్వవిద్యాలయాల బయట ఉన్న ప్రతి కళాశాల స్వయంప్రతిపత్తి గల కళాశాలగా మారాలని తదితర వ్యవస్థాత్మక విషయాలూ అనేకం ఈ విధానంలో ఉన్నాయి. మరి ఇవన్నీ మంచి చర్యలేనా అడిగితే ముఖ విలువను బట్టి చెప్పడం కష్టం. విద్యావ్యాపారం వర్థిల్లుతున్నప్పుడు, పాలకుల చూపు గతం వైపు ఉన్నప్పుడు చెడు విధానాలే అమలవుతాయి, మంచి విధానాలు వికటిస్తాయి. 1986లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానంలో కూడా కొన్ని మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అవి కాగితాలకే పరిమితమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ఎజెండా అయిన విద్యావ్యాపారీకరణ మాత్రం బేషుగ్గా అమలు జరిగింది. 1986 విధానం మాదిరిగానే ప్రస్తుత నూతన విధానంలో కూడా కొన్ని అనుకూల విషయాలతో పాటు పాలకుల ప్రధాన ఎజెండా కూడా ఉన్నది.
నేడు భారతదేశంలో విద్యారంగం ఎదురొంటున్న ప్రధాన సమస్య విద్యావ్యాపారం. మరి ఈ నూతన విద్యావిధానం విద్యావ్యాపారాన్ని నిషేధిస్తుందా? ఈ విషయమై కస్తూరి రంగన్ నివేదికలో ఉన్న అరకొర ప్రకటనలు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించి విడుదల చేసిన ప్రస్తుత విధాన పత్రంలో లేవు. ప్రైవేటు యాజమాన్యాలు విద్యను ఒక లాభాపేక్ష లేని వ్యవహారంగా నిర్వహించాలనే ఒక ఆదర్శాన్ని మాత్రం ఈ విధానంలో ప్రకటించారు. ఇటువంటి ఆదర్శాల ప్రకటన వలన ఎంతమాత్రం ప్రయోజం ఉండదని వేరుగా చెప్పనవసరం లేదు. విద్యావ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ గతంలో మోహినీ జైన్ వర్సస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేసులో జస్టిస్ కుల్దీప్ సింగ్ ఇచ్చిన తీర్పులో ఏమన్నారంటే ఒక సొసైటీ గానీ లేదా ఒక ట్రస్టుగాని విద్యా సంస్థను స్థాపించవచ్చు, నడుపవచ్చు కాని తాము ప్రభుత్వ బాధ్యతను పంచుకుంటున్నామని వారు అర్థం చేసుకోవాలి. ఫలానా కోర్సుకు ప్రభుత్వ విద్యాసంస్థలో ఎంత ఫీజు ఉందో అంతకంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదు. సదరు తీర్పు అర్థం ఏమిటి? విద్యలో వ్యాపారం కూడదు.
దాతృత్వ సంస్థలు తమ స్వంత నిధులతో విద్యను సుమారు ఉచితంగా అందించవచ్చనేది ఆ తీర్పు అర్థం. అయితే ప్రస్తుత నూతన విద్యా విధానంలో ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ రంగం కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. ఇక ఈ విధానం విద్యావ్యాపారాన్ని నిషేధించకపోయినా కనీసం నియంత్రిస్తుందా అంటే అదీ లేదు. పైగా ఒక పాఠశాలకు లేదా ఒక కళాశాలకు ఇంత స్థలం ఉండాలి, గదులు ఇంత విశాలంగా ఉండాలి వంటి అమలులో ఉన్న నిబంధనలు రద్దుచేయాలని నిర్దేశిస్తున్నది. ప్రైవేట్ యాజమాన్యాల వారు తమ విద్యాసంస్థల్లో ఏఏ వసతులు ఉన్నాయో వాటిని వెబ్సైట్లో పారదర్శకంగా ప్రదర్శిస్తే చాలని ఈ విధానం పేర్కొంటుంది. ఫీజు నియంత్రణకు అక్రిడిటేషన్ గ్రేడ్లు వారీగా గరిష్ఠ పరిమితులు నిర్ణయించబడతాయి అని పేర్కొనడం జరిగింది.
అంటే ఫీజు పెంచుకోవాలంటే ప్రైవేటు యాజమాన్యాలు పై స్థాయి గ్రేడ్ కొరకు ప్రయత్నించు కుంటే సరిపోతుందన్న మాట. అక్రిడిటేషన్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థలు రాబోతున్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విధానం విద్యావ్యాపారాన్ని నిషేధించడం లేదు సరికదా, పరిమితంగా ఉన్న నియంత్రణలను కూడా నీరుగారుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యాపారాన్ని తెచ్చి పెడితే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం దాతృత్వాన్ని ప్రోత్సహించాలి అనే పేరుతో దాతృత్వ సంస్థలుగా చెప్పుకునే సంస్థలకు ప్రభుత్వ నిధులను ధారాదత్తం చేయనున్నది! ఈ విధానం పేరు పబ్లిక్ ఫిలాంత్రఫిక్ పార్ట్నర్షిప్ (పి.పి.పి). పాలక పక్ష భావజాల సంస్థలకు నిధులను మళ్ళించడానికి ఈ విధానం రూపొందించబడిందనే విమర్శ వినిపిస్తుంది.
ఈ విద్యావిధానం కొంగ్రొత్త సమస్యలను ముందుకు తీసుకువస్తుంది. ఈ విద్యావిధానం రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్లకు కూడా చెల్లుచీటి ఇచ్చింది. మొత్తం విధాన పత్రంలో విద్యార్ధులకు సీట్లు కేటాయించే విషయంలో, విద్యా సంస్థల ఉద్యోగాల్లో నియామకం అన్న విషయంలో రిజర్వేషన్ అన్న పదమే లేదు. సామాజిక న్యాయం గురించి రాసారు. కాని అది ఆర్థిక సహకారానికి ఇతర సహకారాలకు కుదించబడింది. విధాన పత్రంలో రిజర్వేషన్లు ఉండవు అని రాయలేదు, కాని ఉంటాయని కూడా రాయలేదు. ప్రధానంగా ఈ మధ్యనే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు అనే ధోరణిలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వ విధానపత్రం కూడా అసందిగ్ధంగా లేకపోవడం అనేక ప్రశ్నలకు చోటిస్తున్నది. ఇక ఉపాధ్యాయుల, అధ్యాపకుల పదోన్నతుల విషయానికి వస్తే ఆ సందర్భంలో కూడా రిజర్వేషన్ల ప్రస్తావన లేకపోవడమే గాక, సీనియారిటీ గురించిన ప్రస్తావన లేదు. విద్యా సంస్థల వారీగా నియామకాల విధానాలు రూపొందించుకునే విధానం, ప్రొబేషన్ విధానం ప్రవేశపెట్టాలని నిర్దేశించబడింది. పనితీరుపై ఆధారపడి ఉద్యోగాన్ని ఖరారు చేయడం, పదోన్నతులనిచ్చే విధానం ఉండాలని నిర్దేశించబడింది.
ఈ జాతీయ విద్యావిధానం ప్రధాన లక్షణాలలో అధికార కేంద్రీకరణ ఒకటి. పాఠశాల విద్యకు వస్తే ఈ విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలను కూడా కేంద్రమే రూపొందిస్తుంది. కేంద్రం పంపిన పాఠ్య గ్రంథాలలో ఎటువంటి మార్పులు చేయకూడదు. రాష్ట్రాలు సప్లిమెంటరీలు మాత్రం ప్రచురించుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా పాఠ్య వస్తువు కేంద్రీకరణ జరుగుతుంది. ఇక ఉన్నత విద్య విభాగంలో వైద్యవిద్య, న్యాయవిద్య తప్పించి మిగిలిన వ్యవస్థను అంతటినీ నియంత్రించడానికి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. దీనిలో యన్.హెచ్.ఇ.ఆర్.సి; యన్.ఏ.సి; హెచ్.ఇ.జి.సి; జి.ఇ.సి అనే నాలుగు అంగాలు ఉంటాయి. వీటి బాధ్యతలు ఉన్నత విద్యా వ్యవస్థను నియంత్రించడం, విద్యా సంస్థలకు అక్రిడిటేషన్ ఇవ్వడం, నిధులు మంజూరు చేయడం, ఉన్నత విద్యా కోర్సులను రూపొందించడం, వాటి ప్రమాణాలను నిర్దేశించడమూనూ.
విశ్వ విద్యాలయాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల, రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా సమితుల పాత్ర నామమాత్రం చేయబడింది. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులకు భంగకరమైనది. ఈ విషయంపై ప్రాంతీయ పార్టీలు స్పందిస్తాయని ఆశిద్దాం. ఈ విధానంలో ముందు వెనుకలుగా ప్రతి యూనివర్శిటికీ ఒక బోర్డు ఆఫ్ గవర్నర్స్ను ఏర్పాటు చేస్తారు. విశ్వవిద్యాలయంపై సర్వాధికారాలు ఈ బోర్డు ఆఫ్ గవర్నర్స్కు ఉంటాయి. మరి ఈ బోర్డు ఆఫ్ గవర్నర్స్ పాలక పార్టీ వ్యక్తులతో నింపబడుతుందని విశ్వవిద్యాలయాలు పాలక పార్టీల వస్తుగత, భావజాల ప్రయోజనాలకు కేంద్రంగా మారుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా విద్య అనేది మార్పుకు చోదక శక్తిగా భావించబడుతుంది. కాని ఈ కొత్త విద్యా విధాన పత్రం విద్యావ్యవస్థ సంప్రదాయాలను కాపాడే విధంగా రూపొందించబడాలని నిర్దేశిస్తుంది. దేశ సంస్కృతిలో అంతర్ ఘర్షణను గాని, కాలాంతరంలో మార్పును గాని అలాగే స్థలాంతరంలో వైవిధ్యాన్ని కాని ఈ విధాన పత్రం నమోదుచేయలేదు. సంస్కరణోద్యమ ముందుకాలానికి చెందిన సాంఘిక దురాచారాలనే భారతీయ సంస్కృతి అని భావించి వాటిని కాపాడడం విద్యారంగ కర్తవ్యంగా ధ్రువీకరిస్తే విద్య అనేది అంధకారంవైపు ప్రయాణమవుతుంది. ఏది ఏమైనా ఈ విధానంపై ఒక లోతైన చర్చ జరగాలి.
రమేష్ పట్నాయక్
అఖిల భారత విద్యా హక్కు వేదిక