– దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి : ఆర్బీఐ మాజీ గవర్నర్ల ఆందోళన
– పేదలకు సాయమందించాలి : రాజన్
న్యూఢిల్లీ : భారత ఆర్ధిక వ్యవస్థ పట్ల ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, ఉర్జిత్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వల్ల దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నదని ఇరువురు వేరువేరుగా అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి జారిపోతున్నదని రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ స్వాతంత్య్రం తర్వాత 2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి, తీవ్రమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని హెచ్చరించారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2008-09 నాటి కంటే నేడు పరిస్థితి తీవ్రంగా ఉందంటూ.. ”ఇటీవలి కాలంలో భారతదేశం- గొప్ప సవాలు” అనే శీర్షికతో తన బ్లాగులో ఓ వ్యాసం రాశారు. ఆ వివరాలు.. 2008-09లో అదొక తీవ్రమైన డిమాండ్ షాక్. ఆ సమయంలో కార్మికులు యధావిధిగా పనులకు వెళ్లారు. భారత్కు సంబంధించి పలు సంస్థలు బలమైన వద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇపుడు కుదేలై ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడలేకపోతున్నాయి. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రాజన్ తన బ్లాగ్లో పేర్నొన్నారు. ప్రస్తుత పరిమిత ఆర్థిక వనరులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అయినా కూడా నిరుపేదల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలనీ, మానవత్వంతో వారిని ఆదుకోవాలన్నారు. యూరప్లోని కొన్ని దేశాలు రేటింగ్ ఎజెన్సీల డౌన్గ్రేడ్ భయాలను కూడా పక్కన పెట్టి జీడీపీలో 10 శాతం మేర పేదలకు కేటాయింపులు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
విపక్షాల అభిప్రాయాలూ వినాలి
కరోనా వైరస్ ప్రభావంతో మునుపెన్నడూ లేనంతగా ఆర్థికరంగం ప్రభావితమైనందు వల్ల దీని నుంచి బయటపడే మార్గాలను తెలుసుకునేందుకు నిపుణులను, విపక్ష నేతలను ఆహ్వానించాలని రఘురాం రాజన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచే ప్రతీదీ నడపాలనుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. చేయాల్సింది చాలా ఉన్నది. వివిధ రంగాల్లో నిష్ణాతులు దేశంలో అనేకమంది ఉన్నారనీ, వారే కాకుండా గతంలో ప్రపంచ ఆర్థికసంక్షోభ సమయాల్లో సేవలందించిన అనుభజ్ఞులు విపక్షాల్లోనూ ఉన్నారన్నారు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఆహ్వానించాలన్నారు.
ఆ ప్రాంతాల్లో నిషేధం తొలగించాలి
లాక్ డౌన్ పరిస్థితులను ఎక్కువ కాలం కొనసాగించలేనందున తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రారంభించాలనే దానిపై ప్రభుత్వం ఇపుడు దృష్టి పెట్టాలని రాజన్ సూచించారు. భౌతిక దూరం లాంటి కీలక జాగ్రత్తలతో ఆరోగ్యకరమైన యువతను, కార్యాలయానికి సమీపంలోని హాస్టళ్లలో ఉంచి కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నారు. తయారీదారులు తమ మొత్తం సరఫరా గొలుసును తిరిగి కొనసాగించడానికీ, త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఆవైపుగా సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు.
సూక్ష్మ గణంకాల స్థిరత్వం కీలకం : పటేల్
వచ్చే ఏడాది పాటు భారత్పై తీవ్ర ప్రభావం ఉండనున్నదని ఉర్జిత్ పటేల్ అంచనా వేశారు. సూక్ష్మ గణంకాలు స్థిరంగా కొనసాగించడంపై ఒత్తిడి పెరగొచ్చన్నారు. ముందున్న సవాళ్లను ఎదుర్కొవడానికి ఒక విధానం అవసరమన్నారు. డిమాండ్ పతనంపై అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు తీసుకుంటున్న చర్యలతో భారత్ను పోల్చుకోలేమన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశాలు తమ వద్ద ఉన్న రిజర్వు నిధులను ఉపయోగించుకోనున్నాయన్నారు. భారత్ అలా నిర్ణయం తీసుకోవడానికి వీలుండదన్నారు.
Courtesy: NT