న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభి స్తున్న సమయంలోనూ మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)కు జూన్ నెలలో 2,043 ఫిర్యాదులు అందాయి. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధికం. జాతీయ మహిళా కమిషన్ గణాంకాల ప్రకారం.. మొత్తం 2043 కేసుల్లో గృహ హింసకు సంబంధించి జూన్లో 452 ఫిర్యాదులు అందాయి. 603 మానసిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపులకు సంబంధించి 252, సైబర్ నేరాలకు సంబంధించి 100, లైంగికదాడి, లైంగికదాడి యత్నానికి సంబంధించి 78, లైంగిక వేధింపులకు సంబంధించి 38, పరువు హత్యలు, నేరాల కింద 45, ఇతర ఫిర్యాదులు అందినట్టు ఎన్సీడబ్ల్యూ చైర్మెన్ రేఖా శర్మ తెలిపారు. ఎన్సీడబ్ల్యూ డేటా ప్రకారం… జనవరిలో 1,462, ఫిబ్రవరిలో 1,424, మార్చిలో 1,347, ఏప్రిల్లో 800, మేలో 1,500 ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై కమిషన్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయనీ, ఫిర్యాదులు పెరగటానికి ఇది ప్రధాన కారణమని రేఖా శర్మ తెలిపారు. వాట్సాప్ నెంబర్ ద్వారా సైతం ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఇటువంటి సదుపాయాలు ఉండేవి కాదన్నారు. మహిళల శ్రేయస్సు, సాధికారత కోసం ఎన్సీడబ్ల్యూ పనిచేస్తున్నదనీ, బాధితులు ఎప్పుడైనా, ఏ రోజైనా తమని సంప్రదించవచ్చని రేఖా శర్మ తెలిపారు. కాగా, వాస్తవానికి నేరాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందనీ, కమిషన్ గురించి తెలుసుకొనీ, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండటం ఒకటైతే, అది తెలుసుకొని ఫిర్యాదులు చేసే వారి సంఖ్య ఇంకా తక్కువేనని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
Courtesy: NT