హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు ముందుండి పోరాటం చేస్తున్నారు. కోవిడ్-19 బాధితులకు సేవలు అందిస్తూ ఎంతో ఆరోగ్య సంరక్షణ కార్మికులు మృత్యువాత పడ్డారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 79 దేశాలలో కనీసం 3,000 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు కరోనా కారణంగా మరణించినట్లు తెలుస్తుంది. కరోనాతో ఈ వైరస్ కారణంగా యునైటెడ్ కింగ్డమ్లో 540 మందికి పైగా ఆరోగ్య, సామాజిక సంరక్షణ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 821 మంది ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తలు మరణించినట్టు జూలై మధ్యలో ‘గార్డియన్’ పత్రిక వెల్లడించింది. రష్యాలో కోవిడ్-19 కారణంగా దాదాపు 500 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు మృతి చెందారని ‘యూరో న్యూస్’ నివేదించింది.
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సుల(ఐసీఎన్) ప్రకారం.. 230,000 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ కార్మికులు కరోనావైరస్ బారిన పడగా, 600 మందికి పైగా నర్సులు ప్రాణాలు విడిచారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో 99 మంది వైద్యులు మరణించారు. చాలా దేశాల్లో కోవిడ్-19 కారణంగా మరణించిన ఆరోగ్య కార్యకర్తల వివరాలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించడంతో పాలక పక్షాలు విఫలం కావడం కూడా వారి మరణాలకు కారణం అవుతుందని ప్రజా సంఘాలు, హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విపరిణామాలు తప్పవని, ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరచి వైద్య సిబ్బందికి నాణ్యమైన రక్షణ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.