కరోనా కాటుతో ఎగుమతుల్లేక పాలిస్టర్ ఉత్పత్తులు పేరుకుపోవడం.. యారన్ దిగుమతి లేక బతుకమ్మ ఆర్డరూ సగం సాంచెలపైనే నడుస్తున్న దరిమిలా మరో నెలరోజుల్లో సిరిసిల్ల మగ్గాలు మూగబోనున్నాయి. మూణ్నెల్లుగా పాలిస్టర్ ఉత్పత్తి మొత్తమే లేక, ప్రభుత్వ ఆర్డరూ రాక సాంచెల చప్పుళ్లూ పూర్తిగా ఆగిపోనున్నాయి. సంక్షోభ కాలంలో ఏడాది పొడవునా నేతలకు పని కల్పిస్తున్నామని చెబుతున్న మాటలు ఉత్తవేనని తేలిపోతున్నాయి. ఇక భవిష్యత్ ప్రశ్నార్థకమవుతున్న వస్త్ర పరిశ్రమ ఆధారిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాయి.
– ఇక నెల రోజులే సిరిసిల్ల మగ్గాలు
– కొత్త ఆర్డర్లు, ఉత్పత్తుల్లేక దిక్కులుచూస్తున్న కార్మికులు
– బతుకమ్మ చీరెల ఆర్డర్తో 60 రోజులే పని
– లాక్డౌన్తో ఇప్పటికే రెణ్నెల్లు కోల్పోయిన కార్మికులు
– మార్కెట్లేక కోట్ల మీటర్లలో పాలిస్టర్ నిల్వలు
సిరిసిల్ల నుంచి బండోజు శ్రీకాంత్,
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో పాలిస్టర్ ఉత్పత్తి అయ్యే 26వేల మరమగ్గాలపై సుమారు 16వేల మంది కార్మికులు ‘ఉపాధి’ పొందు తున్నారు. పెట్టికోట్స్, ఇతర వస్త్రాలకు సంబంధిం చిన కాటన్ ఉత్పత్తి అయ్యేమగ్గాలు మరో 2వేల వర కు ఉన్నాయి. యజమానులు, ఆసాములు, కార్మికులు కలిపి మూడెంచల వ్యవస్థగా ఉండేసిరిసిల్లలో మాక్స్ సొసైటీ కింద100, చిన్నతరహా పరిశ్రమల కింద120 గ్రూపులుగా కార్మికులు నమోద య్యారు. పాలిస్టర్ ఉత్పత్తులపైనే ఆధారపడే వారందరికీ మార్కెట్ ఆధారితంగానే పనులు దొరికేవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలుగేండ్లుగా ఇస్తున్న బతుకమ్మ చీరెల ఆర్డర్లకు తోడు ప్రయివేటుగా పాలిస్టర్ ఉత్పత్తులతో కొంత ఉపాధి దొరికేది.
సగం మగ్గాలపైనే ‘బతుకమ్మ’
ఈ ఏడాది రూ.330కోట్ల ఆర్డర్తో 6కోట్లా 20లక్షల మీటర్ల బతుకమ్మ చీరెల ఉత్పత్తి ఆర్డర్ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అప్పగించింది. ఇక్కడి పరిశ్రమలోని 26వేల మగ్గాల్లో ఒక్కో మగ్గంపై రోజుకు 50మీటర్ల చీర ఉత్పత్తి అవు తుండగా రోజుకు 13లక్షల మీటర్ల గుడ్డ తయారవుతుంది. ఈ లెక్కన 6కోట్లా 20లక్షల మీటర్ల చీరెల ఉత్పత్తికి 50రోజులు పడుతుంది. సెలవు దినాలు సహా సర్కారిచ్చిన చీరెల ఆర్డర్కు 60రోజుల(రెండు నెలలు) పనిమాత్రమే కార్మికులకు దొరుకుతుంది. జనవరిలో ఆర్డర్ ఇవ్వగా పనులు మొదలయ్యేసరికి మార్చి వచ్చింది. ఈలోపు కరోనా వైరస్ వ్యాప్తితో వచ్చిన లాక్డౌన్ కారణంగా రెన్నెళ్లకుపైగా మగ్గాలు నిలిచిపోయాయి. లాక్డౌన్ సడలింపులతో అరకొరగా వచ్చిన యారన్ దిగుమతులతో సగం మగ్గాలపైనే ఒక షిప్టు పద్ధతిలోనే పనులు నడుస్తున్నాయి.
‘ఏడాది ఉపాధి’ ఉత్తిమాటే..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కరోనా దెబ్బకు పాలిస్టర్ ఉత్పత్తికి పూర్తిగా బ్రేక్ పడింది. మార్కెట్లో ఎగుమతుల్లేక ఇప్పటికే కొన్ని కోట్ల మీటర్ల పాలిస్టర్ వస్త్రం యజమానులు, ఆసాముల వద్ద నిల్వలు ఉండిపోయాయి. ఫిబ్రవరి చివరి నుంచి కొత్తగా పాలిస్టర్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మిగిలిన బతుకమ్మ ఆర్డర్కు సైతం యారన్ దిగుమతి సరిగా లేక 26వేల మగ్గాలకుగాను 12వేల మగ్గాలపైనే ఉత్పత్తి సాగుతోంది. మిగతా సగం మగ్గాలపై ఆధారపడ్డ కార్మికులు మూన్నెళ్లుగా పస్తులుంటున్నారు. మరోవైపు ‘బతుకమ్మ’ ఆర్డర్పై ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యజమానులు సైతం ఇక్కడ 3వేల మగ్గాలు ఏర్పాటు చేశారు. వారికి సొసైటీలో సభ్యత్వంలేక బతుకమ్మ ఆర్డర్లు రాలేదు. దీంతో వీటిపై ఆధారపడ్డ 600మందికి పని లేకుండా పోయింది. ‘బతుకమ్మ’ ఆర్డర్ సైతం మరో నెల రోజుల్లో పూర్తికానుండటంతో సిరిసిల్లలోని మరమగ్గాలన్నీ ఆర్డర్లు, ఉత్పత్తుల్లేక పూర్తిగా మూగబోనున్నాయి.
పేరుగొప్ప ఊరుదిబ్బ : ఆడెపు మోహన్, ఆసామి, సిరిసిల్ల
కార్మికులకు ఏడాది పొడవునా ‘ఉపాధి’ కల్పిస్తున్నామని ఇచ్చిన బతుకమ్మ ఆర్డర్ ఒక షిప్టు పద్ధతిలో సగం మగ్గాలపైనే నడుస్తోంది. అదీ నెలరోజుల్లో ఆర్డర్ పూర్తవుతుంది. ప్రభుత్వం చెబుతున్న మాటలు పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్టుగా ఉంది.
వారానికి రూ.1500 దాటడం లేదు : కృష్ణ, నేతకార్మికుడు, సిరిసిల్ల
బతుకమ్మ ఆర్డర్తో వారానికి రూ.4వేలు సంపాదించ వచ్చని ఆశపడ్డా. అటు పాలిస్టర్ ఉత్పత్తిలేక, ఇటు ప్రభుత్వ ఆర్డర్ సరిగా అందక వారానికి రూ.1500 కూడా గిట్టుబాటు అయితలేదు. సాంచెలన్నీ నడిస్తేనే మాకు చేతినిండా పనిదొరికేది.
మరిన్ని ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలె : మూషం రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, రాజన్నసిరిసిల్ల
బతుకమ్మ చీరెలకు తోడు ప్రభుత్వ స్కూళ్ల యూనిఫాంలతో పాటు ప్రయివేటు పాఠశాలల ఆర్డర్లూ ఇప్పించాలే. నిర్దిష్టంగా చేతినిండా పని ఉండేలా అన్ని రంగాల వస్త్ర ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలె. కార్మికుల ఖాతాల్లో యారన్ సబ్సిడీ వెంటనే జమ చేయాలి.
కార్మికుల ఖాతాల్లోకి రాని యారన్ సబ్సిడీ..
కరోనాతో పరిశ్రమ విలవిల్లాడుతున్న సమయంలో పనిలేక పస్తులుంటున్న కార్మికుల ఖాతాల్లో యారన్ సబ్సిడీ అయినా ప్రభుత్వం వేయాలి. 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఏడాదికి రూ.9కోట్ల చొప్పున రూ.18కోట్ల నిధులు కార్మికుల ఖాతాలో జమకావాల్సి ఉంది. ఈ నిధులే జమఅయితే ఒక్కో కార్మికుని ఖాతాలో రూ.50వేల వరకు జమకానున్నాయి.
Courtesy: NT