కొత్తగా ఏ వ్యాధి సోకినా.. దానికి ఔషధం కనిపెట్టేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగుతారు. తమ ఔషధం పనితీరును తెలుసుకోవడానికి మొదట జంతువులపై ప్రయోగాలు చేస్తారు. కానీ… పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు తమ మీద తాము ప్రయోగాలు చేసుకొని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నారు. అలాంటి కొందరు సాహసుల ప్రయోగాలు, వాటి ఫలితాలూ..
ఎల్లో ఫీవర్కు బలి
దోమకాటుతోనే ప్రాణాంతక ఎల్లో ఫీవర్ వస్తుందని 1881లో డాక్టర్ కార్లోస్ తేల్చారు. దాన్ని నిరూపించేందుకు అమెరికా సైన్యానికి చెందిన వైద్యులు సాహసం చేశారు. ఎల్లోఫీవర్పై 1900లో వాల్టర్ రీడ్ అనే వైద్య శాస్త్రవేత్త సారథ్యంలో వైద్యులు జేమ్స్ కరోల్, అరిస్టైడ్స్ అగ్రామోంటె, జెస్సీ లేజర్ పరిశోధనలు చేసేవారు. ఈ క్రమంలో కరోల్, లేజర్లు దోమలతో కాటు వేయించుకున్నారు. వారిద్దరికీ ఎల్లో ఫీవర్ వచ్చింది. కొన్ని రోజులకే లేజర్ మృతి చెందగా… కరోల్ కోలుకున్నారు. కానీ ఏడేళ్ల తర్వాత అదే వ్యాధితో కన్నుమూశారు. వారి త్యాగం వల్లే ఎల్లో ఫీవర్ నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆధారం లభించింది.
స్వయంగా శస్త్రచికిత్సలు
అప్పట్లో శస్త్రచికిత్స చేయాలంటే శరీరం మొత్తానికి మత్తు ఇచ్చేవారు. ఇలా చేయాల్సిన అవసరం లేదని నిరూపించారో గొప్ప వైద్యుడు. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన డాక్టర్ ఒనీల్ కేన్ శస్త్రచికిత్సల విధానంలో సంస్కరణలు తేవాలనుకున్నారు. ఇన్ఫెక్షన్ వచ్చిన వేలుకు దగ్గర్లో మాత్రమే మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత 1921 ఫిబ్రవరి 15న కడుపు వద్ద మత్తు ఇచ్చుకొని అపెండిక్స్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసుకున్నారు. అప్పుడాయనకు 60 ఏళ్లు. పదేళ్ల తర్వాత మూడోసారి శస్త్రచికిత్స చేసుకొని 36 గంటల్లోనే మళ్లీ విధుల్లో చేరారు. ఆయన సాహసం… లోకల్ అనెస్థీషియాను లోకమంతా నమ్మేలా చేసింది.
పునరుజ్జీవనం చేయబోయి..
రష్యాకు చెందిన అలెగ్జాండర్ బొగ్డానొవ్ అనే వైద్యుడు… శాస్త్రవేత్త, ఆర్థిక, రాజకీయవేత్త, రచయితగానూ రాణించారు. ఆయనకో చిత్రమైన ఆలోచన వచ్చింది. ముసలివారికి యువకుల రక్తం ఎక్కించి పునరుజ్జీవనం కల్పించాలనుకున్నారు. తనకుతాను ప్రయోగం చేసుకోవడానికి 1924లో ఒక యువకుడి నుంచి సేకరించిన రక్తాన్ని అలెగ్జాండర్ ఎక్కుంచుకొని ప్రాణాలు కోల్పోయారు. రక్తదాతకు మలేరియా, టీబీ ఉండటం వల్లే ఇలా జరిగినట్లు తేలింది.
బ్యాక్టీరియాను తాగిన శాస్త్రవేత్త
విబ్రియో కలరా అనే బ్యాక్టీరియాతోనే కలరా సోకుతుందని జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ కనుగొన్నారు. ఇది తప్పని నిరూపించేందుకు బవేరియా రసాయన శాస్త్రవేత్త మ్యాక్స్ జోసెఫ్ వొన్ పెట్టెంకొఫర్ ఓ ప్రయోగం చేశారు. రాబర్ట్కోచ్ ముందే విబ్రియో కలరా బ్యాక్టీరియాని రసంలో కలుపుకొని తాగేశారు. అనంతరం కలరా లక్షణాలతో ఆసుపత్రిలో చేరి, వారం రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు.
అల్సర్లు, క్యాన్సర్లు గుర్తించేందుకు..
ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుడు బెర్రీ మార్షల్… రాయల్ పెర్త్ ఆస్పత్రిలో పనిచేశారు. 1984లో తోటి వైద్యుడు రాబిన్ వారెన్తో కలిసి కడుపులో అల్సర్లు, క్యాన్సర్కు హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా కారణమని తెలిపారు. అయితే కడుపులో విడుదలయ్యే రసాయనాలకు బ్యాక్టీరియా బతికే అవకాశమే లేదని ఇతర శాస్త్రవేత్తలు, వైద్యులు కొట్టిపారేశారు. బెర్రీ మార్షల్.. సంబంధిత బ్యాక్టీరియాను కలిపిన రసాన్ని తాగేశారు. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరీక్షించగా… కడుపులో బాక్టీరియా స్థిరపడటంతో అల్సర్ వచ్చినట్లు గుర్తించారు. యాంటీ బ్యాక్టీరియా మందులతో బెర్రీ కోలుకున్నారు. ఈ ప్రయోగంతో కడుపులో అల్సర్లు, క్యాన్సర్లకు బ్యాక్టీరియా కారణమని తేలింది. వారి కృషికి గుర్తింపుగా బెర్రీతోపాటు వారెన్కు సైతం 2005లో నోబెల్ బహుమతి లభించింది.
Courtesy Eenadu