– గిరిజనులకు ‘రెవెన్యూ’ నోటీసులు
– 50 ఏండ్ల సాగు భూములను గుంజుకునే యత్నం : రవాణా శాఖ మంత్రి ఇలాఖాలో గిరిపుత్రుల గోడు
ఖమ్మం : ”చేతిలో కర్రతో కుర్చీలో కూర్చున్న ఈ వృద్ధుని పేరు బానోత్ బిక్షం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దొనబండ గ్రామం. తన నాలుగెకరాల వ్యవసాయ భూమిలో మూడెకరాలు తన కుమార్తె స్వాతికి పసుపు కుంకుమ కింద ఇచ్చాడు. ఆమె పేరున పట్టాదార్ పాసు పుస్తకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రైతుబంధూ వస్తోంది. అయితే, డెబ్బై ఏండ్లుగా సాగులో ఉన్న గిరిజనులకు ఇటీవల రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అవి అటవీ శాఖ భూములు.. మీకిచ్చిన పట్టాలు, హక్కులు రద్దు చేస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బిక్షం అల్లుడు తనకు వేరే భూమి కొనివ్వాలని ఒత్తిడి తెస్తున్నాడు..” అని బానోత్ బిక్షం ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇది ఒక్క భిక్షం పరిస్థితే కాదు. ఇలా గ్రామంలో సుమారు 50కుటుంబాల గోడు. దొనబండ గ్రామానికి చెందిన గిరిజన రైతులు సర్వే నెంబర్ 410, 411, 412లోని సుమారు 150ఎకరాల్లో డెబ్బై ఏండ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటికి సంబంధించి 2014లో తెలంగాణ ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలు జారీ చేసింది.
రెండు దఫాలుగా రైతుబంధు పైకాన్నీ తీసుకున్నారు. బ్యాంకుల్లో రుణాలు పొందారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకీ అర్హులయ్యారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా తెలంగాణ సర్కారు వీరి నుంచి భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే నోటీసులు పంపి పాసు పుస్తకాలు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఈ భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజన రైతుల్లో అలజడి మొదలైంది. తమ భూములు పోతే బతికేదెట్టా అని కన్నీరు పెట్టుకుంటున్నారు. సాక్షాత్తూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలోనిదే దొనబండ.
50ఏండ్లుగా సాగులో..సత్తి లింగమ్మ
దొనబండ సర్వే నెంబర్ 412లో 4.2ఎకరాల భూమి ఉంది. నా భర్త రామలింగయ్య, కొడుకు భద్రయ్య ఇద్దరూ ఇటీవల చనిపోయారు. నాకు దిక్కెవరూ లేరు. యాభై ఏండ్లుగా ఆ భూమిలో మేమే సాగులో ఉన్నాం. అన్ని హక్కు పత్రాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చారు.
ప్రభుత్వం పునరాలోచించాలి..
ధరావత్ జమున- సర్పంచ్
గ్రామంలో గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారందరికీ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములకు ఇచ్చిన పట్టా పాసు పుస్తకాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. రుణమాఫీ, రైతుబంధు కూడా రాదంటున్నారు. భూములు లాక్కునేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం పునరాలోచించి బాధిత రైతులందరికీ ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.
నోటీసులు పంపింది నిజమే..
నర్సింహారావు,రఘునాథపాలెం తహసీల్దార్
దొనబండలో గిరిజన రైతులంతా దశాబ్దాలుగా సాగులోనే ఉన్నారు. రుణమాఫీలు పొందిన మాట వాస్తవమే. కానీ ఇటీవల రెవెన్యూ- అటవీశాఖ జాయింట్గా జరిపిన సర్వేలో సుమారు 150ఎకరాలు అటవీ భూములుగా తేలింది. దీంతో వారికి రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు ఇచ్చాం.
Courtesy: NT