ముందుగా ఊహించినట్టుగానే దేశవ్యాప్త లాక్డౌన్ గడువును కేంద్రం ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్డౌన్ గడువును కేంద్రం ప్రభుత్వం మరోసారి పొడిగించింది. లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కరోనా హాట్స్పాట్స్లో నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నెలాఖరు వరకు విమాన, మెట్రో రైల్ సర్వీసులకు అనుమతి లేదని తెలిపింది.
హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు తెరిచేందుకు అనుమతించబోమని ప్రకటించింది. అయితే హోం డెలివరీ అందించేందుకు మాత్రమే రెస్టారెంట్లకు వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలను తెరుచుకోవచ్చునని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవల వరకే అనుమతిస్తామని వెల్లడించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 1 వరకు తెరవడానికి వీల్లేదని ఆదేశించింది.
కరోనా కట్టడి విషయంలో అలసత్వం వహించే రాష్ట్రాలపై చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్రాల పరస్పర అనుమతులతో బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై తుది నిర్ణయం తీసుకునే హక్కును రాష్ట్రాలకే అప్పగించింది. మే 31 వరకు.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల గుర్తింపు బాధ్యత జిల్లా అధికారులదేనని తేల్చిచెప్పింది. రాజకీయ, సామాజిక, మతపరమైన సభలపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.