- ‘కార్పొరేట్’ను వేధిస్తున్న కొరత…
- లాక్డౌన్ సమయంలో తగ్గిన రోగులు
- అప్పుడు జీతాలివ్వలేక తొలగింపు…
- నేడు కొవిడ్తో ఆస్పత్రులు కిటకిట
- సరిపోని నర్సులు…
- తిరిగి రావాలని అడుగుతున్నా రాని వైనం
- సీనియర్లకు 70-90 వేల వరకు వేతనం…
- కొత్తవారికి రూ.20 వేలు
- కొవిడ్ డ్యూటీ చేస్తే భారీ ప్యాకేజీ ఆఫర్…
- అయినా ముందుకురాని పరిస్థితి
హైదరాబాద్లో అదొక కార్పొరేట్ ఆస్పత్రి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల పాటు ఆస్పత్రికి రోగులు రాకపోవడంతో ఉన్న నర్సులను బలవంతంగా ఉద్యోగాల నుంచి తీసేశారు. ఇప్పుడు కరోనా తీవ్రత పెరగడం, భారీగా కేసులు నమోదు కావడంతో పెద్దసంఖ్యలో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. అయితే, సేవలందించేదుకు నర్సులు సరిపోవడంలేదు. గతంలో పనిచేసిన వాళ్లను రమ్మన్నా రాని పరిస్థితి.
హైదరాబాద్ : రాష్ట్రంలోని కార్పొరేట్ ఆస్పత్రులు నర్సుల కొరతతో సతమతమవుతున్నాయి. కరోనా రాకతో చాలామంది నర్సులు ఉద్యోగాలను వదిలేసి వెళ్లిపోయారు. ఉన్నవాళ్లు సరిపోవడం లేదు. దాంతో అన్ని ఆస్పత్రుల్లోనూ నర్సులకు డిమాండ్ పెరిగింది. జీతాలు భారీగా ఇస్తామంటున్నా ఎవరూ రాని పరిస్థితులు నెలకొన్నాయి. లాక్డౌన్కు ముందు నర్సుల జీతం, జీవితం దుర్భరంగా ఉండేది. వారితో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు గొడ్డుచాకిరీ చేయించుకునేవి. సగటున రూ.15-17 వేలు ఇచ్చేవి. అయితే, ఇప్పుడు నర్సులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఫ్రెషర్స్కు కూడా రూ.20 వేలు ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. అనుభవమున్న నర్సులకు ఆస్పత్రి స్థాయిని బట్టి రూ.70 వేల వరకు ఇస్తామంటున్నాయి. అయితే, కొవిడ్ డ్యూటీలు చేసే వారికే ఈ స్థాయిలో వేతనాలిస్తామని చెబుతున్నాయి.
ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల మానవ వనరుల విభాగాలు నర్సుల నియామకాలను చేపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఎంతైనా జీతం ఇచ్చి తీసుకోవాలనుకుంటున్నాయి. అందుకే తమకు తెలిసిన నర్సింగ్ కాలేజీలను సంప్రదిస్తున్నాయి. వైరస్ ఉధృతి పెరుగుతుండడంతో చాలామంది నర్సులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు వచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికితోడు లాక్డౌన్ ప్రకటించాక చాలా ఆస్పత్రులు నర్సింగ్ సిబ్బందిని తొలగించాయి. వీరిలో చాలామంది ఊళ్లకు వెళ్లి పోయారు. లౌక్డౌన్ సమయంలో ఇళ్లకు వెళ్లిన వారిలో చాలామంది తిరిగి రావడం లేదు. అక్కడే ఏదో ఒక పనిజేసుకుంటున్నారు.
లక్ష మంది నర్సులు అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 2000 మంది జనాభాకు ఇద్దరు వైద్యులు, ఐదుగురు నర్సులు అవసరం. మన దగ్గర 400 మందికి ఒక నర్సు ఉండాల్సివుంటే ప్రస్తుతం 600 మందికి ఒకరున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేల మంది నర్సులు ఉండాల్సి వుండగా సుమారు 7 వేల మంది మాత్రమే ఉన్నారు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను కలిపి ప్రస్తుత అవసరాలకు మరో లక్ష మంది వరకు అవసరం ఉంది.
నర్సింగ్పై తగ్గిన ఆసక్తి
ఒకవైపు.. ఉన్న నర్సులే ఉద్యోగాలు మానేస్తుండగా మరోవైపు.. కొత్తగావచ్చేవాళ్లు కూడా తగ్గిపోతున్నారు. తక్కువ జీతాలుండటం, నర్సింగ్ అంటే సమాజంలో చిన్నచూపు ఉండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇక పెళ్లి చేసుకున్న తరువాత 10 శాతం మంది నర్సింగ్ వృత్తిని వదిలేస్తున్నారు. డ్యూటీలకు తోడు నైట్ షిఫ్టులను కారణంగా చెబుతున్నారు.
90 వేలు ఇస్తామన్నా వెళ్లలేదు
నేను హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో పనిజేశా. నర్సింగ్ వృత్తిలో పదేళ్ల అనుభవం ఉంది. వైరస్ ఉధృతి పెరగడంతో ఇటీవల ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చా. ఇప్పుడు వేరే ఆస్పత్రుల నుంచి భారీ ఆఫర్ వచ్చింది. కొవిడ్ వార్డుల్లో డ్యూటీ చేస్తే రూ.90 వేల వేతనం ఇస్తామంటున్నారు. కానీ భయంతో నేనే వెళ్లడం లేదు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ నర్సు
పని భారంతో ఉద్యోగం మానేశా
నేను చాదర్ఘాట్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సీనియర్ నర్స్గా పనిచేశా. అక్కడ 100 పడకలుంటే నర్సులు తక్కువమందే ఉన్నారు. కొవిడ్ రోగులను చేర్చుకోవడంతో పని పెరిగిపోయింది. రోజుకు 12-18 గంటల పాటు డ్యూటీ చేయాల్సివస్తోంది. పని భారం పెరిగిపోవడంతో మానేశా.
ఓ కేరళ నర్స్. హైదరాబాద్.
బీమా సౌకర్యం కల్పించాలి
ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ డ్యూటీలు చేసే నర్సింగ్ సిబ్బందికి బీమా సౌకర్యం ఉండాలి. ఎవరైనా కరోనా బారినపడితే యాజమాన్యాలే చికిత్స అందించాలి. భవిష్యత్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంటుంది. సర్కారు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. శాంక్షన్డ్ పోస్టులను భర్తీ చేస్తే ప్రస్తుతం ఉన్న వారిపై పనిభారం తగ్గేది.
రూఢావత్ లక్ష్మణ్,
నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్.
నర్సింగ్కు సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
- హైదరాబాద్లో పనిజేసే కేరళ నర్స్లలో 70 శాతం మంది ఇటీవలే వెళ్లిపోయారు. ఆ రాష్ట్రం నుంచి బ్రిటన్, కెనడా, ఐర్లాండ్ దేశాలకు నర్సులను పంపుతున్నారు. జీతం రూ.2 లక్షల వరకు ఉండటంతో చాలా మంది వెళ్లిపోయారు.
- నాంపల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఏడుగురు నర్స్లకు కరోనా సోకితే వారికి క్వారంటైన్ సమయంలో జీతం ఇవ్వలేదు. ఆ సంఘటనతో చాలా మంది ఉద్యోగాలు మానేశారు.
- గచ్చిబౌలీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నలుగురు నర్సులు ఉద్యోగాలు వదలి వెళ్లిపోయారు. దాంతో ఆ నలుగురు పరారయ్యారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో నర్సులు అత్యవసరం కావడంతో రూ.2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వేరే ఏజెన్సీ నుంచి నలుగురు నర్సులను తీసుకున్నారు. వచ్చిన తర్వాత వారికి కరోనా వార్డులో డ్యూటీ వేశారు. తమకు కొవిడ్ డ్యూటీ అని చెప్పకుండా తీసుకొచ్చారని ఆ నర్సులు యాజమాన్యంతో గొడవపడి వెళ్లిపోయారు.
Courtesy Andhrajyothi