న్యూఢిల్లీ : పదిరోజుల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న మారణహౌమంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అల్లరిమూకలు పాల్పడిన ఈ క్రూరచర్యతో ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలే గాక దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ఈశాన్య ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలీ గ్రామంలోని ముస్లింలను అక్కడి హిందూవులు కంటికి రెప్పలా చూసుకున్నారు. వారికేం భయం లేదంటూ ధైర్యం చెప్పారు. గ్రామంలో ఉంటున్న మైనార్టీ సోదరుల కోసం నిలబడి తామంతా ఒకటేనని మతసామరస్యాన్ని చాటి చెప్పారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ‘ది వైర్’కు చెందిన ఓ విలేకరి అక్కడకు వెళ్లి ఆ పరిస్థితులను వివరించారు. దేశరాజధానికి, ఉత్తరప్రదేశ్కు సరిహద్దు గ్రామమైన ఆలీలో 70 శాతం హిందూవులు, 30 శాతం ముస్లింలు ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలో సాయుధ మూకలు గుంపులుగా విడిపోయి ఇండ్లు, మసీదులపై పడి దాడులు చేయడంతో వాటి చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తం చేశాయి. దీంతో గ్రామంలోని ముస్లింలందరూ ‘ఆ మూకలు ఇటు వైపు వస్తారేమో అనే భయంతో’ తమ ఇండ్లు, గ్రామంలో ఉన్న మసీదులోకి వెళ్లి.. బయట తాళాలు పెట్టి.. విద్యుత్ ద్వీపాలు ఆర్పి భయంభయంతో గడిపారు. కానీ, అదే సమయంలో మసీదు (బాగ్ వలీ మసీదు) దగ్గరకు వచ్చిన పలువురు హిందూవులు.. వారికేం భయం లేదని ధైర్యం చెప్పారు.
భుజం భుజం కలిపి ‘మీకు అండగా మేమున్నాం’ అని భరోసానిచ్చారు. మరోవైపు నకిలీవార్తలు ప్రబలకుండా పోలీసుల సాయంతో గ్రామ శాంతి కమిటీ నిత్యం పర్యవేక్షించింది.
మేం వేరు కాదు : బహదూర్ ఖాన్, గ్రామస్తుడు
ఢిల్లీ అల్లర్లు చోటుచేసుకున్నప్పుడు చాలామంది హిందూ సోదరులు మా వద్దకు వచ్చి మాకు ధైర్యం చెప్పారు. ఈ ఊళ్లోకి ఎవరైనా అల్లరి చేసే వాళ్లు వస్తే అప్పుడు అందరం కలిసి పోరాడదాం అని మేం చర్చించుకున్నాం. మా హిందూ సోదరులు, మేం వేరు కాదు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు సహజసిద్ధంగా జరిగినవైతే కావు. సమాజంలో అశాంతిని, ఒక వర్గంపై భయాందోళనలను రేకెత్తించడానికే అవి జరిగాయి.
ఇంటికి తాళాలేశాం : రోషన్ అరా, గ్రామస్తురాలు
అల్లర్లు జరుగుతున్నాయని తెలియగానే నేనుంటున్న ఇంటికి బయట తాళాలేసి, లోపల లైట్లు ఆపేసి భయంతో వణికిపోయాం. నా ముగ్గురు కూతుళ్లతో ఆ రోజంతా ఆందోళనకరంగా గడిపాను. కానీ, మా చుట్టు పక్కల ఉన్న వాళ్లు వచ్చి మమ్మల్ని భయపడొద్దని చెప్పారు. వారంతా మాకు అండగా ఉన్నారు.
వాళ్లొచ్చినా ఎదుర్కొనేవాళ్లం : బి. రామ్ప్రధాన్, మాజీ సర్పంచ్
ఈ ఘటనకు సంబంధించిన వార్తలు చూసి నేను బాధపడ్డా. ఇలా చేయడం తప్పు. దాడుల సందర్భంగా అక్కడ (ఘటన జరిగిన ప్రాంతంలో) మసీదులను తగులబెట్టారనీ, కొంతమంది ఇండ్లు కోల్పోయారని విన్నాం. కానీ మా గ్రామంలో ఇరు వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉంటాం. ఆ రోజు ఇక్కడి ముస్లింలూ భయానికి గురయ్యారు. కానీ అల్లరి మూకలు ఇక్కడిదాకొస్తే కలిసి పోరాడదాం అని మేం వారికి ధైర్యం చెప్పాం.
Courtesy Nava telangana