లాక్డౌన్ పొడిగించే చాన్స్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేయడం కుదరదని చెప్పారు. పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. లాక్డౌన్ తొలగింపుపై ముఖ్యమంత్రులతో త్వరలో చర్చలు జరుపుతానని తెలిపారు.
దేశంలో 5,194 మందికి కరోనా
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 5,194 కరోనా కేసులు నమోదు కాగా, 149 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 32 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు మొత్తం 402 మంది కోలుకున్నారు.
ఏపీలో మరో 15 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 329కు చేరింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
కరోనా మహమ్మారి నివారణకు మరింత నిబద్ధతతో పనిచేయాలని అధికార యంత్రాగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. బుధవారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మాట మార్చిన ట్రంప్
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మర్చారు. కరోనా నివారణలో సమవర్థవంతం పనిచేస్తున్న హైడ్రాక్వీక్లోరోక్విన్ను తమకు సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ట్రంప్ గళం మార్చి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత్కు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ అవసరం ఉన్నందు వల్లే ఎగుమతులు నిలిపివేశారన్న విషయం తమకు తెలుసునని అన్నారు.
యూపీ పోలీసులకు బీమా
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో సేవలు అందిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు యూపీ సర్కారు నజరానా ప్రకటించింది. పోలీసు సిబ్బంది రూ. 50 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు యూపీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీని అమలుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనున్నట్టు తెలిపింది.