చెన్నై: తమిళనాడులో పరువు హత్యకు గురైన దళిత యువకుడు శంకర్ హత్య కేసులో మద్రాస్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యువతి తండ్రి చిన్నస్వామికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయనను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేసి.. వారి శిక్షను 25 సంవత్సరాల జీవిత ఖైదుకు మార్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు వెల్లడించిన ఈ తీర్పు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు పట్ల శంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్నస్వామి కుమార్తె కౌసల్య తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తూ.. న్యాయం జరిగే వరకూ తను పోరాడుతానని చెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.
తిరుప్పూర్ జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన శంకర్, అగ్ర కులానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్, కౌసల్యలు ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరిపై మార్చి 2016లో రోడ్డుపై వెళుతుండగా పట్టపగలే బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో కౌసల్యకు స్వల్ప గాయాలు కాగా.. శంకర్ తీవ్ర గాయలపాలై మరణించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. శంకర్పై దాడి చేయించింది కౌసల్య తండ్రి చిన్నస్వామినేనని ఆరోపణలు రావడంతో అతనిని, అతనితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 2017లో వీరందరికీ మరణ శిక్ష విధించింది.
Courtesy: NT