ఖమ్మం: ప్రజల అవసరాల కోసం ఆర్టీసీ బస్సును పచారీ కొట్టుగా మార్చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు నిత్యవసర సరుకులు అందించేందుకు తెలంగాణ ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ప్రజల కోసం దీన్ని వినియోగిస్తున్నారు. పెద్దతండాలో ఒకరు కోవిడ్-19 బారిన పడటంతో ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్జోన్గా ప్రకటించింది. దీంతో పెద్ద తండాను పూర్తి మూసివేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం పెద్దతండాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు గోడు వెళ్లబోసుకున్నారు. నిత్యవసర సరుకులు తెచ్చుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెప్పడంతో మంత్రి స్పందించారు. ఇంటి వద్దకు తీసుకెళ్లి సరుకులు అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సును పచారీ కొట్టుగా మార్చి మంత్రికి చూపించడంతో ఆలోచన బాగుందని ఆయన మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అందరికీ పరీక్షలు చేస్తున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు, అలాగే ఒక్కో వ్యక్తికి 12 కేజీల బియ్యం ఇస్తున్నట్టు తెలిపారు. లాక్డౌన్ ముగిసేవరకు ప్రజలకు ఇదేవిధంగా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.