- ఇంటి ఖర్చులు వెళ్లదీసేందుకు ఆర్టీసీ కార్మికుల పాట్లు
- కూలీ పనులు, అల్పాహార కేంద్రాలు నిర్వహించినా వస్తున్నది అంతంతే
సమ్మెతో ఆర్టీసీ కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు నానా కష్టాలు పడుతున్నాయి. డ్రైవర్ల నుంచి కండక్టర్ల దాకా.. మెకానిక్ల నుంచి పెయింటర్ల దాకా అందరూ ఇంటిఖర్చులు వెళ్లదీసేందుకు ఎన్నడూ చేయని పనులు చేయాల్సి వస్తోంది. చెమటోడ్చినా అంతంత మాత్రంగానే వచ్చే కూలీ డబ్బులతో ఇంటి బడ్జెట్ సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి సమ్మెకు తెరదించితే తమ కష్టాలు తీరుతాయనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
మంచాల/మంచిర్యాల/జనగామ టౌన్/జఫర్గడ్/కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్/మెదక్
మొక్కజొన్న చేనులో సంచులు మోస్తున్న వీరు కూలీలు కాదు. జీతాలు చేతికందని పరిస్థితుల్లో మంచాల మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన ఆర్టీసీ కార్మికులు సీహెచ్.శ్రీనివాస్, కాళ్లె మల్లేష్ ఇలా కూలీ పనులు చేస్తున్నారు.
రెండు నెలలుగా జీతాలు లేని ఆర్టీసీ కుటుంబాలు మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద అల్పాహార కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాయి. మహిళా కండక్టర్లే దీన్ని నిర్వహిస్తున్నారు.
జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రానికి చెందిన పట్టపూరి నాగేశ్వర్గౌడ్ ఉమ్మడి వరంగల్ 1 డిపోలో బస్సు డ్రైవర్. సమ్మె ఆయన్ను గీతకార్మికుడిగా మార్చింది. మోకు, ముస్తాదుతో తాటి వనానికి వెళ్లి కల్లు గీస్తూ ఉపాధి పొందుతున్నారు.
జనగామ పట్టణానికి చెందిన కాముని నవీన్ వరంగల్-2 డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నారు. సమ్మె కారణంగా ఆయన పట్టణంలోని వీవర్స్కాలనీలో చేనేత కూలీగా పనికి కుదిరాడు. ఉదయం ఆర్టీసీ ఆందోళనల్లో పాల్గొనడం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించడం నవీన్ దినచర్యగా మారింది.
Courtesy Andhrajyothy…