- సీరియస్ కేసులకు ఈ చికిత్సను అందిస్తాం
- కొవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది
- గాంధీలో సౌకర్యాలు, ఆహారంపై దుష్ప్రచారం
- విపక్షాల స్పందన సరికాదు
- వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: ఈటల
హైదరాబాద్ : కరోనా సోకిన వారికి ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీరియస్ కొవిడ్ కేసులకు ప్లాస్మా థెరపీ విధానం ద్వారా చికిత్స అందిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ అనేక కట్టడి చర్యలను చేపట్టామన్నారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఇప్పటికే ఉన్నతస్థాయి బృందం పర్యటించి సీఎంకు నివేదిక సమర్పించిందన్నారు.
ఈ జిల్లాల్లో త్వరలోనే కేసులు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఇప్పటివరకు 262 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం 667 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వదంతులపై విపక్షాలు స్పందించడం సరికాదన్నారు. చికిత్స పొందుతున్న వారికి చాలా మంచి భోజనం పెడుతున్నామని చెప్పారు. వైద్యులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈటల పాల్గొన్నారు. రాష్ట్రంలో 9 ల్యాబ్ల్లో రోజుకు 1,600 పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వైద్య పరికరాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. దేశీయంగా కొనుగోలు చేసే యంత్రాలపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని హర్షవర్ధన్ అభినందించినట్లు ఈటల చెప్పారు.
Courtesy Andhrajyothi