- హైదరాబాద్లో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం
- పరీక్షలో నెగెటివ్ వచ్చినా చెప్పని వైనం
- నాలుగు రోజులకు మూడు లక్షల బిల్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది
- కరీంనగర్, వరంగల్లో కరోనా ఉధృతి
- ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుకు వైరస్
- కొత్తగా 1,891 మందికి.. 10 మంది మృతి
బంజారాహిల్స్, ఆగస్టు : కరోనా లేకున్నా ఓ న్యాయవాదిని కరోనాకు చికిత్స అందించే వార్డులో ఉంచి, నాలుగు రోజుల పాటు చికిత్స చేసి రూ.3 లక్షల బిల్లు వేసిందో ప్రైవేటు ఆస్పత్రి. అసలు విషయం తెలిసిన ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు. రాజధాని హైదరాబాద్లో జరిగిందీ ఘటన. నగరంలోని విజయనగర్కాలనీకి చెందిన శ్రీధర్సింగ్ అనే న్యాయవాదికి జూలై 28న స్వల్పంగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. దీంతో ఆయన సోమాజీగూడలోని డెక్కన్ ఆస్పత్రికి వెళ్లారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఆ సమయంలో ఆయన ఆధార్కార్డు తీసుకున్నారు. కానీ, నమూనా పంపేటప్పుడు.. ఆయన ఫోన్ నంబరు ఇవ్వకుండా, తమ ఉద్యోగి ఫోన్ నంబరు పెట్టారు (దీనివల్ల ఆయన ఫోన్ నంబర్కు కాకుండా ఆ ఉద్యోగి నంబర్కు రిపోర్ట్ వస్తుంది). శ్రీధర్ను కరోనా వార్డులో ఉంచారు. పరీక్ష ఫలితం నెగెటివ్గా వచ్చినా.. ఆ విషయాన్ని శ్రీధర్కు చెప్పకుండా కరోనా చికిత్స చేశారు. తన పరీక్ష ఫలితంపై శ్రీధర్ ఆస్పత్రి నిర్వాహకులను గట్టిగా నిలదీయగా రిపోర్టును అందజేశారు.
అందులో నెగెటివ్ అని ఉండడంతో.. తనకు కరోనా చికిత్స ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయినా ఆస్పత్రి నిర్వాహకులు పట్టించుకోలేదు. చివరకు ఆయన.. తన తోటి న్యాయవాదులకు ఈ విషయం చెప్పడంతో అప్రమత్తమై ఆగస్టు 1 అర్ధరాత్రి డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. మూడు లక్షల రూపాయలు బిల్లు వేసి.. ఆగస్టు 2న ఆయన ఆ బిల్లు చెల్లించాకే బయటకు పంపారు. డిశ్చార్జి సమయంలో ఆయన చేతికి అమర్చిన కాన్యులా (సెలైన్ పెట్టడానికి వీలుగా చేతికి అమర్చే పరికరం) కూడా తొలగించలేదు. ఇంటికి వచ్చిన అనంతరం ఆ న్యాయవాది.. పంజగుట్ట పోలీసులకు ఆస్పత్రి తీరుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
Courtesy Andhrajyothi