– మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
– వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు
రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు అందజేయనుంది. శనివారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు టి. హరీశ్రావు, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు టెక్ మహీంద్రా, నిప్మర్, ఎస్ఆర్, ఎంఎన్ఆర్, గురునానక్, వాక్సన్, శ్రీనిధి, రాడ్క్లిఫ్, అమిటీ సంస్థలతోపాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి చైర్మెన్ పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన అనురాగ్ విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా దరఖాస్తు చేశాయి. నిపుణుల కమిటీ పరిశీలించి వాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్ (ఎల్వోఏ) ఆ విశ్వవిద్యాలయాల యాజమాన్యాలకు జారీ చేస్తుంది. ఆ తర్వాత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు చేపట్టే అవకాశమున్నది. ఈ దిశగా ప్రభుత్వం ఎల్వోఏ ఇవ్వనుంది. త్వరలోనే మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వానికి ఇచ్చే నివేదికపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రవేశాల్లో తెలంగాణకు చెందిన స్థానికులకు 25 శాతం సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలి.
Courtesy: NT