– కరోనాను ఎదుర్కొనే సంసిద్ధత భారత్కు లేదు
– కేంద్రం నివేదిక గణాంకాలతో స్పష్టం
న్యూఢిల్లీ : దేశంలో గురువారం నాటికి నిర్ధారణ అయిన కేసులు 2069. అందులో 156 మంది కోలుకున్నారు. 56 మంది చనిపోయారు. ఐదు రోజుల కాలంలో కేసులు రెండింతలయి.. అందులో 20 శాతం మంది ఆస్పత్రులలో చేరాలన్న సందర్భంలో దేశం కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ఎంత సంసిద్ధత కలిగి ఉన్నదని అర్థం చేసుకోవడానికి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ విడుదల చేసిన రిపోర్టును చూస్తే అర్థమవుతుంది.
ఈ సర్వే 34 రాష్ట్రాలకు సంబంధించిన 410 జిల్లాలలో 266 మంది కలెక్టర్లను సంప్రదించి రూపొందించినది. దీని ప్రకారం.. దేశం మొత్తం మీద 16,651 వెంటిలేటర్స్ కరోనా వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించబడ్డాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1000 వెంటిలేటర్స్ ఉండే పన్నా అనే జిల్లాలో ఒక వెంటిలేటర్ మాత్రమే ఉన్నది. అసోంలోని దీమాహసో, నల్లబారీ, ఉదలగూడీ అనే మూడు జిల్లాల్లో కనీసం ఒక ఐసీయూ కానీ, వెంటిలేటర్ కానీ లేవు.
అత్యవసర చికిత్స గది (ఐసీయూ) కేసుల కోసం వినియోగించే పడకలు దేశం మొత్తంలో 31,900 ఉన్నట్టు తేలింది. దేశంలో ఆరోగ్య కార్యకర్తలు 22 లక్షల మంది ఉంటే వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) 4.12 లక్షలు, మాస్కులు 15 లక్షలు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సామాగ్రి ఏ మూలకూ సరిపోదు. వీటిని ఎనిమిది గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరీక్ష కిట్లు, పడకలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవడానికి ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉన్న ప్రత్యేక సందర్భం ఇది.
నేషనల్ హెల్త్ అథారిటీ కరోనా పరీక్షలు, చికిత్సలను పీఎం జన్ ఆరోగ్య యోజన కిందకు తీసుకురావాలని ప్రతిపాదనపెట్టినా.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం కరోనా పరీక్షలకు రూ.4500 మత్రమే ఫీజు అని నిబంధన పెట్టింది. ఈ మొత్తం కూడా చాలా మంది కట్టలేరు. కావున ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, మందులు సరఫరా చేయించాలి.
స్పెయిన్ దేశంలో ప్రభుత్వం ప్రయివేటు ఆస్పత్రులను కొంతకాలం వరకు ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటన్లో ఉన్న 570 ప్రయివేటు ఆస్పత్రులలోని 8000 పడకలను ప్రభుత్వ వినియోగానికి అప్పగించాలని అక్కడి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారతదేశంలో అనేక ఇన్సురెన్స్ స్కీంల ద్వారా ప్రభుత్వం.. ప్రయివేటు ఆస్పత్రులలో జరుగుతున్న చికిత్సల కోసం వేలకోట్ల రూపాయలు చెల్లిస్తున్నది. దీని ద్వారా లాభపడిన కార్పొరేట్ ఆస్పత్రులు.. ఈ అత్యవసర సమయంలో ఉచిత సేవకు ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి. పేద ప్రజలలో కొంత మందికి కొన్ని ప్రభుత్వ స్కీంల ద్వారా సేవలు అందిచొచ్చు. మిగతా పేదల సంగతేంటి? మధ్యతరగతిలోని చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి మీదా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. మరి వారిని కూడా ఆదుకోవాలి కదా.
ఈ సంక్షోభ సమయంలో అన్ని అవకాశాలనూ, అనుభవాలను కూడదీసుకొని ప్రభుత్వం శాస్త్రీయ పరిష్కారాలను అమలు జరపాలి.
Courtesy: NT