- ప్రపంచవ్యాప్తంగా ఏటా 38 లక్షల మంది మృత్యువాత
- 45% గుండె, 8% ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు
- బాధితుల్లో మహిళలు, బాలికలే ఎక్కువ: డబ్ల్యూహెచ్వో
హైదరాబాద్: మనుషులు జీవించేందుకు గాలి, నీరు, భూమి అత్యంత ప్రధానం. ఇందులో ఏదిలేకున్నా జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నది. గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వాయుకాలుష్య ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అధ్యయనం చేయగా సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో 70 లక్షల మం దికిపైగా వాయుకాలుష్యం కారణం గా మృతి చెందుతున్నారని, వీరిలో 38 లక్షలమంది ప్రజలు ఇండ్లలో ఉపయోగించే కట్టెల పొయ్యి, కిరోసిన్ వంటి ఇంధనాల కారణంగా అర్ధంతరంగా మరణిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది.
ఇప్పటికీ కట్టెల పొయ్యిమీదే వంట!
ప్రపంచవ్యాప్తంగా పేద, మధ్య దేశాల్లోని 300 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ కట్టెలు, కిరోసిన్, పశువులపేడ, బొగ్గులనే వంట వండుకోవడానికి ఉపయోగిస్తున్నారని తేలింది. వీటి వాడకంతో అనేక వ్యాధుల బారినపడి ఆరోగ్యం దెబ్బతింటున్నది. బహిరంగ ప్రదేశాల్లో మంట ద్వారా జరిగే వాయుకాలుష్యంతో కంటే.. ఇండ్లలో వంటకు ఉపయోగించే మంట ద్వారా వచ్చే వాయు కాలుష్యంతోనే వంద రెట్లు ఎక్కువగా వ్యాధులకు గురవుతున్నారని అధ్యయనంలో స్పష్టమైంది. ఇండ్లలో సరైన వాయుప్రసరణ (వెంటిలేషన్) లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది. గృహవాయు కాలుష్యంతో వ్యాధులబారిన పడుతున్నవారిలో మహిళలు, బాలికలే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నది.
ఎదురవుతున్న ప్రమాదాలు
గృహ వాయు కాలుష్యంతో మరణించినవారిలో 27 శాతం మంది న్యుమోనియా బాధితులున్నారు. గృహ వాయుకాలుష్య ప్రభావం పిల్లలపై ఎక్కుగా ఉంటుంది. న్యుమోనియా బారినపడి మరణించేవారిలో 45 శాతం ఐదేండ్లలోపు పిల్లలే ఉంటున్నారు. 20 శాతం మంది ప్రజలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్తో మరణించడానికి ఈ వాయు కాలుష్యమే కారణమవుతున్నది. గృహ వాయుకాలుష్యానికి మహిళలే ఎక్కువగా గురవుతున్నారు. వంటల కోసం వినియోగించే ఘన ఇంధనాల కారణంగా మృతిచెందేవారిలో 12 శాతం మంది గుండెపోటు బాధితులున్నారు. 27 శాతం గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. 8శాతం మంది ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురై మరణిస్తుండగా మృతుల్లో 17 శాతం యువత ఉండటం విశేషం.
మరణాల తీరు
27% మందికి న్యుమోనియా
18% మందికి గుండెపోటు
27% గుండె సంబంధిత వ్యాధులు
20% క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
8 శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్
Courtesy Namasthe Telangana