100 రోజులకు గాను 41 దినాలే పని
క్షేత్రస్థాయిలో మారని పరిస్థితులు
రోజు కూలి రూ.211లకు వచ్చేది రూ.150 లోపే..
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులకు పనిలేని సమయంలో ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యం చేరడం లేదు. ఈ పథకం కింద ఈ ఏడాది మొత్తం 49,76,111 లక్షల కుటుంబాలకు జాబ్కార్డులు ఇచ్చారు. ఈ కుటుంబాల్లోని 10,85,91,999 కోట్ల మంది కూలీలుగా నమోదయ్యారు. నిబంధనల ప్రకారం వీరందరికీ 100 రోజుల పని కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,14,132 కుటుంబాలకే 100 రోజుల పని దొరికింది. ఈ లెక్కన సగటున ఒక్కో కుటుంబానికి 41.55 రోజుల పనే వచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 54,37,638 కుటుంబాలకు జాబ్ కార్డులుండగా, 1,17,26,402 మంది కూలీలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. అప్పుడూ 2,10,983 కుటుంబాలకే 100 రోజుల పని అంటే సగటున ఒక్కో కుటుంబానికి 41 రోజుల పనే దొరికినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి
గ్రామాల్లో పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలస్థాయిలో ఏపీవోలు పూర్తిస్థాయిలో పనులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ అత్యల్పంగా 5వేల నుంచి 7500 పనిదినాలు కల్పిస్తే వేతనాలు పొందేందుకు అర్హత సాధిస్తారు. దీంతో గ్రామాల్లో 20వేల నుంచి 30వేల పనిదినాలు కల్పించే అవకాశాలు, కూలీలు ఉన్నప్పటికీ క్షేత్ర సహాయకులు 10వేల మించి పనిదినాలు కల్పించేందుకు ప్రయత్నించడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. వ్యవసాయ భూములు లేని కూలీలు ఎప్పుడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సాధారణంగా వారి గ్రూపులో ఉండే ఇతర కూలీలు ఆసక్తి చూపడం లేదు. పని చేసినా గ్రూపు మొత్తానికి చెల్లించే కూలీలో ఒక్కరికి రూ.110 నుంచి రూ.150లోపే వస్తున్నాయి. దీంతో చాలామంది వెనకడుగువేస్తున్నారు.
Courtesy Eenadu…