- మూడు స్కూళ్లలో 19 మందికి అస్వస్థత
- మాత్రలేసిన అంగన్వాడీ టీచర్
- ఘటనపై మంత్రి ఈటల ఆగ్రహం
జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆల్బెండజోల్ మాత్రలు వికటించి ఏడేళ్ల బాలిక మృతి చెందింది. మరో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. ధర్మపురి పట్టణంలోని కేరళ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 2వ తరగతి చదువుతున్న తిప్పర్తి సహస్రను సోమవారం పాఠశాలలో దించేందుకు తల్లి రజిత తీసుకెళ్లింది. సమీపంలోని అంగన్వాడీ టీచర్ వచ్చి సహస్రకు ఆల్బెండజోల్ మాత్ర వేసింది. పాపను బడిలో దించి తల్లి ఇంటికి వెళ్లగా.. కొద్ది సేపటికే పాప కళ్లు తిరిగి కింద పడిపోయిందని సమాచారం వచ్చింది. సహస్రను వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మరో రెండు పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. జైనా గ్రామంలోనూ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన అనంతరం వాంతులు చేసుకోగా ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి జగిత్యాల ఆస్పత్రికి వచ్చి వైద్యుల తీరుపై మండిపడ్డారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక పంపాలని డీఎంహెచ్వోను ఆదేశించారు.
Courtesy Andhrajyothi