రెండునెలలుగా మూతబడిన ఇంటర్నెట్, మొబైల్ఫోన్ సౌకర్యాన్ని పునరుద్ధరించమంటూ గురువారం కశ్మీర్ లోయలో పాత్రికేయులు ధర్నా చేశారు. క్షేత్రస్థాయి వాస్తవాలను మిగతా ప్రపంచానికి తెలియనివ్వకుండా మీడియామీద నిర్బంధం విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక హోటల్ని మీడియా కార్యాలయంగా మార్చి, దానికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తూ అన్ని పత్రికల విలేఖరులూ అక్కడకే వచ్చి వార్తలు రాసేట్టు ప్రభుత్వం జాగ్రత్తపడుతున్నది. కశ్మీర్లో ఏ ఆంక్షలూ లేవనీ, ఇంటర్నెట్, మొబైల్ లేనంతమాత్రాన నిర్బంధం ఉన్నట్టు కాదనీ, ప్రభుత్వాన్ని విమర్శించే కొద్దిమంది మెదళ్ళలోనే నిర్బంధం ఉన్నదని అమిత్ షా ఓ వ్యాఖ్యచేశారు. క్షేత్రస్థాయి వాస్తవాన్ని కాదంటున్న ఇటువంటి మాటలు అగ్నికి ఆజ్యం పోస్తాయి. ఇటీవలే, మహిళా సామాజిక వేత్తలతో కూడిన బృందం ఒకటి అక్కడ పర్యటించి అనేక కఠినమైన నిజాలను ప్రపంచానికి తెలియచెప్పిన విషయం మరిచిపోకూడదు.
బలమైన భారత్తో ఆర్థిక, వ్యాపార ప్రయోజనాల రీత్యా చాలా దేశాలు ప్రస్తుతానికి మనకు ఎదురుచెప్పని మాట నిజం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఈ విషయంలో మోదీ బాగానే లొంగదీయగలిగారు. కానీ, ‘హౌడీ మోడీ’లో ప్రధానిని ఆకాశానికి ఎత్తిసిన మర్నాడే పాకిస్థాన్కు అనుకూలంగా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. మోదీవి దూకుడు వ్యాఖ్యలనడంతో పాటు, మధ్యవర్తిత్వానికి సంబంధించి మళ్ళీ పాతపాటే పాడారు. ట్రంప్ ఇలా తెలివిగా అడుగులు వేస్తుంటే, డెమోక్రాట్లలో అనేకులు భారత్ నిర్ణయాన్ని సమర్థించడం లేదు. అమెరికన్ కాంగ్రెస్ మానవహక్కుల కమిటీ అక్టోబర్ 22న కశ్మీర్ నిర్బంధంపై వాదనలను వినబోతున్నది. హ్యూస్టన్ నిరసన ప్రదర్శనలను తేలికగా తీసుకున్నప్పటికీ, పాకిస్థాన్కు చైనా ఎలాగూ వంతపాడుతుందని తీసిపారేస్తున్నప్పటికీ అంతా సానుకూలంగా, మనపక్షానే నడుస్తున్నదని అనుకోవడం సరికాదు. బ్రిటన్ మనపక్షాన లేదని గతంలో భద్రతామండలి జరిపిన రహస్య సమావేశంతోనే తేలిపోయింది. ఐక్యరాజ్యసమితిలో మలేషియా ప్రధాని మహాతీర్ మహ్మద్ ఘాటైన ప్రసంగం, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ తీవ్ర విమర్శలు మన వెనుక సాగుతున్న ప్రయత్నాలకు సంకేతాలు.
కశ్మీర్ ప్రజలమీద నిర్బంధాన్ని ఎత్తివేయమని భారత ప్రభుత్వానికి చెప్పండి అంటూ ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన అభ్యర్థనను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ అక్టోబర్ 2న ఘాటైన సంపాదకీయం రాసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ, భద్రతామండలి భారత్ చర్యను తప్పక ప్రశ్నించవలసిందేనని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. భారత పర్యటనకు బయలుదేరుతున్న బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకు ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి కంటిచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం ఎలా ఉన్నదని ఆరాతీశారట. ఈ సంభాషణలో ఆయన ఇంకేమి మాట్లాడారో తెలియదు కానీ, ఇమ్రాన్ ప్రధాని అయిన తరువాత హసీనాను పలుకరించడం ఇదే మొదటిసారి. భారత్కు వ్యతిరేకంగా నలుగురినీ కూడగట్టేందుకు ఇమ్రాన్ పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్టోబర్ 24 న బ్లాక్ డెవలప్మెంట్ ఎన్నికలు ప్రకటించి, జైళ్ళలో మగ్గుతున్న రాజకీయనాయకుల విడుదలకు ఉపక్రమించిన ప్రభుత్వం లోయకు చెందిన నాయకుల విషయంలో మాత్రం నీళ్ళు నములుతున్నది. మాజీ ముఖ్యమంత్రులు సహా అనేకమంది బందీలుగా ఉన్న ఈ వాతావరణాన్ని సత్వరమే మార్చకపోతే, భారతదేశం సాధించుకున్న సానుకూలత వ్యర్థమవుతుంది.
Courtesy Andhra Jyothy..