కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ పర్యావరణ ప్రభావపు అంచనా (environmental impact assessment-ఈఐఏ) 2020 యొక్క ముసాయిదాను ఇటీవల విడుదల చేసింది. పర్యావరణ రక్షణచట్టం 1986 కింద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ను మొదటిసారిగా 1994లో ప్రభుత్వం విడుదల చేసింది. 2006లో దీనికి మార్పులు, సవరణలను చేయడం జరిగింది. 2006లో చేసిన ప్రభావశీల మార్పులు తిరోగమించేట్టుగా 2020 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ముసాయిదా ప్రతిపాదనలు ఉన్నాయి. మూసాయిదా పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సమతుల్యతను దెబ్బతీసెట్టుగా ఉన్నది. పర్యావరణాన్ని రక్షించడం, దాన్ని మెరుగుపరచడం పర్యావరణ రక్షణచట్టం ప్రధాన లక్ష్యం. పరిశ్రమలు, ఇతర మౌలిక ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ముందు పర్యావరణపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతలు అమలయ్యేట్టుగా ఈఐఏ చూస్తుంది.
బొగ్గు, ఇతర ఖనిజాలు, న్యూక్లియర్, జలవిద్యుత్ శక్తి, మౌలిక వసతుల అభివద్ధి, రియల్ ఎస్టేట్, ఇతర పరిశ్రమలకు ఈఐఏ వర్తిస్తుంది. ఒకపరిశ్రమ పర్యావరణంపై చూయించే ప్రభావాన్ని నిపుణుల కమిటీతో ఆధ్యయనం చేయించి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నదాన్ని నిర్ణయిస్తారు. ఈఐఏ మార్గదర్శకాలు దీంట్లో కీలకపాత్ర పోషిస్తాయి. పర్యావరణం మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది, దుష్ప్రభావాలు ఉంటే వాటిని ఎలా నియంత్రించాలనేది ఈఐఏ చూస్తుంది. మనదేశంలో ఈఐఏ శాస్త్రీయంగా జరగదు. చాలా వరకు మొక్కుబడిగా చేయబడుతాయి. అలా అని ఇప్పుడున్న ఈఐఏ చట్టం అసలు పనికిరాదని చెప్పలేం. అయితే దాన్ని మరింత పకడ్బందీగా తయారుచేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. 2020 ముసాయిదా నోటిఫికేషన్ ఈపని చేస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు ఆశించారు. కానీ ముసాయిదా వారి ఆశలపై నీళ్ళుచల్లి వారిని నిరాశకు గురిచేసింది.
ఈఐఏ 2020 నోటిఫికేషన్పైన చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటక్షన్ ఏక్ట్ (ఈఐఏ)1986లోని పర్యావరణ అనుకూల నిభంధనలను ఈఐఏ 2020 పక్కన పెట్టిందని ప్రధానమైన ఆరోపణ.
ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణానికై ప్రజలకున్న హక్కులకు భంగం కలిగించే ప్రతిపాదనలు ఈఐఏ 2020 నోటిఫికేషన్లో ఉన్నాయని పర్యావరణవేత్తల ఆరోపణ. కార్పొరేట్లకు అనుకూలంగా, సులభతర వాణిజ్య ప్రక్రియకు తోడ్పడేట్టుగా ఈఐఏ ప్రతిపాదనలున్నాయనేది వాస్తవం. అలాగే ఈఐఏ 2020ని కోవిడ్ మహమ్మారి సమయంలో విడుదల చేయడం జరిగింది. దీన్ని ఇంకా కొన్ని రోజులు వాయిదా వేసుకొని, పరిస్థితులు చక్కబడ్డాక విడుదలచేసి, ప్రజల్లో చర్చకు పెట్టి పర్యావరణాన్ని రక్షించేచర్యలను ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ ప్రజలు భౌతికదూరం పాటిస్తున్న సమయంలో, చర్చలకు అవకాశాలను తక్కువచేసి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే పర్యావరణ చట్టాలను తీసుకవచ్చే ఉద్దేశంతో ఈఐఏ 2020 ముసాయిదాని ప్రభుత్వం విడుదలచేసిందని అనుకోవాలి.
ముసాయిదా ప్రతి విడుదలయిన తర్వాత రెండు ప్రమాదకరమైన ప్రమాదాలు పర్యావరణ చట్టాల ఉల్లంఘన వల్ల జరిగాయని చెప్పాలి. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవ్వడంవల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఆరోగ్యాలు పాడయిపోయాయి. అలాగే అసోంలోని భాగ్జాన్లో ఆయిల్ ఇండియా ప్లాంట్లో బ్లో అవుట్తో స్థానికంగా ఉన్న వేలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఈరెండు ప్లాంట్లకు కూడా ముందస్తు పర్యావరణ అనుమతులు లేవు. పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి అమలుచేయాల్సిన నిబంధనలను, అలాగే చేపట్టాల్సిన జాగ్రత్తలను ముందేతీసుకొని ఉంటే ఈప్రమాదాలు జరిగి ఉండేవి కావు. పర్యావరణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈరెండు సంఘటనలు తెలియచేస్తున్నాయి.
ఈఐఏ 2020 ముసాయిదా పర్యావరణ సంరక్షణ, ప్రజల భద్రతకై ఇదివరకు ఉన్న చట్టాలను బలహీనం చేసేట్టుగా ఉన్నది. ప్రాజెక్టు రావడానికి ముందు అది పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేదాన్ని బేరీజు వేసుకొని అనుమతులు ఇవ్వాలి. పర్యావరణానికి సంభంధించిన ఈప్రధానమైన సూత్రాన్ని క్రొత్త ఈఐఏ తుంగలో తొక్కేసింది. ఈఐఏ 2020 పోస్ట్ – ఫాక్టో అనే కొత్త అంశాన్ని ముసాయిదాలో చేర్చింది. ఈఐఏ 2020 ప్రకారం ఇంతకు ముందు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులను ఒక కమిటీ అధ్యయనం చేసి వాటిని కొనసాగించాలా లేదా అన్నదాన్ని సిఫారసు చేస్తుంది. అంటే దాదాపుగా ఇల్లీగల్ ప్రాజెక్టులన్నీ కూడా లీగల్ ప్రాజెక్టులుగా మారిపోయే అవకాశాలు ఈకొత్తచట్టం ద్వారా రాబోతున్నవి. ఇది చాలా వినాశకరమైన సిఫారసు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. పోస్ట్- ఫాక్టో వాటికి చట్టబద్దతను కలగిస్తుంది.
కొత్త ముసాయిదా పర్యావరణ రక్షణకి సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికున్న విచక్షణ అధికారాలను విపరీతంగా పెంచేసింది. ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించింది. బాధిత సముదాయాలతో సంప్రదింపుల ప్రక్రియను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రజాస్వామిక నిర్ణయాలు కాకుండా కార్పొరేట్ల ప్రయోజనాలకు పెద్దపీట వేసేట్టుగా ఈఐఏలోని అంశాలున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులు, భవననిర్మాణాలు, జాతీయ రహదారుల విస్తరణ, దేశరక్షణ, భద్రతకు సంబంధించిన ఆన్ని ప్రాజెక్టులలో ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నిర్ణయాలను తీసుకొనే హక్కులను ఈఐఏ ముసాయిదా ప్రభుత్వానికి కలిగిస్తున్నది.
అలాగే కొత్త ప్రాజెక్టు ఏదైనా ప్రారంభించబోయే ముందు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఎలాంటి ప్రాజెక్టు రాబోతుంది, పర్యావరణంపై దానిప్రభావం ఎలా ఉంటుంది, అలాగే వ్యర్థ పదార్థాలు ఏమైనా తయారవుతాయా, తయారైన వ్యర్థపదార్థాలను ఎలా నిర్మూలిస్తారు, ఇంకా ఆప్రాంతంలో నివసించే ప్రజల జీవనాలపై ఎలాంటి ప్రబావం ఉంటుంది ఇలాంటి అనేక విషయాలను ప్రజలకు తెలియచెప్పి వారి స్పందనలను, అభిప్రాయాలను నమోదుచేసుకొని ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకుటుంది. ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచెప్పడానికి ఇదివరకటి ఏక్టో 30రోజుల సమయం ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 20రోజులకు కుదించారు. 20రోజుల్లో ప్రాజెక్టు రూప స్వభావాన్ని అర్థం చేసుకొని అలాగే అందులో ఇమిడివున్న సాంకేతిక అంశాలను అధ్యయనం చేసే సామర్థ్యం సాధారణ ప్రజలకు ఉంటుందా? ప్రజలు వ్యక్తిగతంగానైనా లేదా సామూహికంగానైనా తమ అభిప్రాయాలను 20రోజుల్లో చెప్పగలుగుతారా? పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఇదివరకు ఇచ్చిన సమయాన్ని తగ్గిస్తారా?
పాత ఈఐఏ చట్టం క్రింద 20,000 చదరపు మీటర్లకన్న ఎక్కువ వైశాల్యం ఉన్న బిల్డింగ్ నిర్మాణాలకు పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దీనిని ఇప్పుడు 1,50,000 చదరపు మీటర్లకు పెంచారు. నిర్మాణరంగం అభివృద్ది చెందాలి. దానిపై ఎలాంటి వివాదంలేదు. కానీ తగు జాగ్రత్తలు తీసుకొని నిర్మాణాలు చేసుకొవాలి. మట్టి, ధూళివల్ల వాయుకాలుష్యం పెరుగుతుంది. పెద్దనిర్మాణాలు ఉద్గార వాయువులను కూడా విడుదలచేస్తాయి. వీటిని నియంత్రిస్తూ నిర్మాణాలు జరుపుకోవాలి. 1,50,000చదరపు మీటర్ల నిర్మాణాల వరకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదంటే అది పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుందో అర్థంచేసుకోవచ్చు. ఇంతకుముందు ఆరునెలల కొకసారి ఇవ్వాల్సిన పర్యావరణ కంప్లయింట్ను కొత్త ఈఐఏ క్రింద ఏడాదికొకసారి ఇస్తే సరిపోతుంది. ఇది పర్యావరణ అధికారుల బాధ్యతను తగ్గిస్తుంది. పరిశ్రమలకు అనుకూలంగా ఉండి పర్యావరణ అంశాలను వారు తేలికగా తీసుకొనే అవకాశాలను పెంచుతుంది.
స్థూలంగా కొత్త ఈఐఏ 2020 ముసాయిదా ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉన్నది. పెద్దఎత్తున జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలకు చట్టబద్దతను కలిగిస్తున్నది. ప్రజల్లో కూడా పర్యావరణ ఉల్లంఘనలపట్ల తీవ్రమైన ఆందోళన, అసంతృప్తి ఉన్నది. ఈఐఏ నోటిఫికేషన్స్పై ప్రజల స్పందన బాగానే ఉన్నది. కానీ ఇది సరిపోదు. పర్యావరణం గురించి సాధారణంగా శాస్త్రవేత్తలు లేదా పర్యావరణ కార్యకర్తలు మాత్రమే మాట్లాడుతుంటారు. సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నందున ప్రజలకు ఎన్నో విషయాలు అర్థంకావు. కాబట్టి ప్రజల అవగాహన పర్యావరణ విషయాలలో పెరగాలి. పర్యావరణం పర్యావరణ శాస్త్రవేత్తలకే పరిమితం కాకూడదు. పర్యావరణం అందరిదీ. పర్యావణానికి జరిగే నష్టం అందరిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈఐఏ నోటిఫికేషన్తో పర్యావరణంపై చర్చ ముగియకూడదు. ఈఐఏపై చర్చ మరింత ఎక్కువగా జరగాలి. పర్యావరణ శాస్త్రవేత్తలు మాత్రమే కాక సిటిజన్ గ్రూపులు దీనిపై చర్చ జరపాలి. ప్రజల్లో అవగాహనను పెంచాలి. సాంకేతిక అంశాలు అర్థమయ్యేట్టుగా సరళమైన భాషలో పర్యావరణం మీద సమాచారాన్ని అందించాలి. పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు భవిష్యత్లో మానవాళిపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజాస్పందన ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచేవిధంగా ఉండాలి.
ఈఐఏను ఒకన్యాయపరమైన, ప్రజాస్వామ్య ప్రక్రియగా చేపట్టాలి. ఏదైనా అమలు చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాన్ని లేదా ప్రాజెక్టును పర్యావరణ పరంగా క్షుణ్ణంగా పరీక్షించి సరైన అంచననాలు వేసి చివరగా శాస్త్రీయంగా ఆ ప్రాజెక్టు పర్యావరణానికి ఏలాంటి హానికలిగించదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈఐఏ క్రింద ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలి. పర్యావరణ చట్టాలుచేసి వాటిని కఠినంగా అమలు చేయాలి. ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదికలు ఉండాలి. ఒకటి సాంకేతిక నిపుణలతో శాస్త్రీయమైన అంచనా, ప్రాజెక్టు నిర్మించబడే ప్రాంతంలోని ప్రజలను భాగస్వాములుగా చేయడం. ఇది జరిగిననాడు అభివద్ధి, ప్రాజెక్టు దేశానికి నిజంగా వరప్రదాయనులుగా మారుతాయి. కానీ ఈఐఏ పేరుమీద కార్పొరేట్లకు పర్యావరణాన్ని, సహజ వనరులను అప్పగించేస్తున్నారు. వారు తమ లాభాలకోసం పర్యావరణాన్ని, సహజ వనరులను ధ్వంసంచేసి మొత్తం మానవాళి భవిష్యత్కే ప్రమాదాన్ని తెస్తున్నారు.
పర్యావరణ చట్టాల ఉల్లంఘన ప్రజలందరిపై ముఖ్యంగా పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. పర్యావరణ రక్షణకి మనకు కఠినమైన చట్టాల అవసరం ఉన్నది. రైతులు, మత్సకారులు, గిరిజనులు ప్రకృతిపై, సహజవనరులపై ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తారు. ఈఐఏలోని మార్పులు పర్యావరణంపైనేకాక వారి జీవితాలపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూస్తాయి. కాబట్టి ఈఐఏ 2020
ముసాయిదాని వ్యతిరేకించాలి.
– కె. వేణుగోపాల్