– నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
– కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సన్నిహితుడు గౌతం అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీకి మూడు ఎయిర్ పోర్టులను ధారాదత్తం చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిం చారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద జైపూర్, గౌవహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ గ్రూపునకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఎయిర్పోర్ట్లను ప్రయివేట్ డెవలపర్కు అప్పగించడం ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు రూ.1,070 కోట్లు సమకూరుతాయని చెప్పారు.
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు
కేంద్ర పరిధిలోని అన్ని ఉద్యోగాల నియామకానికి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్ఆర్ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుందన్నారు. ఆన్లైన్లో నిర్వహించే సీఈటీలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చన్నారు. ప్రస్తుత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలవుతాయన్నారు.
చెరకుకు మద్దతు ధర
కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ సిఫారసులకనుగుణంగా 2020-21 చక్కెర సీజన్ (అక్టోబర్-సెప్టెంబర్) వరకు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన చెరకు ఫైర్ అండ్ రెమ్యునిరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ)ను కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదించింది. క్వింటాల్కు ఎఫ్ఆర్పి 10 శాతం ప్రాథమిక రికవరీ రేటుకు రూ.285గా నిర్ణయించింది. కరోనా వల్ల వర్కింగ్ క్యాపిటల్ పరిమితికి మించి విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కామ్) రుణాలు విస్తరించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లకు ఒకేసారి సడలింపును ఆమోదించింది.
Courtesy: NT