జామియాలో టీనేజర్ కాల్పులు
ఓ విద్యార్థికి గాయాలు
హిందూ-అనుకూలవాదిగా చెప్పుకొన్న ఆగంతుకుడు
ఫేస్బుక్లో లైవ్స్ట్రీమింగ్
అతడిని వదిలేది లేదన్న షా
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ సమీపంలో సీఏఏ వ్యతిరేక ఆందోళన హింసాత్మకంగా మారింది. ఓ ఆగంతకు డు పిస్తోలుతో ఆందోళనకారులపై కాల్పులు జరపగా షాదాప్ ఫరూక్ అనే విద్యార్థి చేతిలోకి బుల్లెట్ దూసు కెళ్లింది. ‘ఏ లో ఆజాదీ’ (ఇదిగో.. తీసుకోండి స్వాతం త్య్రం) అంటూ టీనేజ్ కుర్రాడు పిస్తోలు పేల్చాడు. పోలీసులు నిందితుడి పిస్తోలు లాక్కుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తరువాత జేఎన్యూ సహా పలు కాలేజీల నుంచి విద్యార్థులు తరలివచ్చి 7గంటల పాటు ఆందోళన చేశారు. రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వానికి, సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎలా మొదలైంది..?
గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు జామియా విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ఘాట్వైపు ఊరేగింపుగా బయల్దేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడే సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి వారి వద్దకొచ్చి పిస్తోలుతో బెదిరించాడు. ‘తొందరపడకు, వెనక్కి వెళ్లు..’ అంటూ విద్యార్థి షాదాబ్ వారించబోయాడు. అయితే నిందితుడు వినకుండా ఓ రౌండ్ పేల్చేశాడు. షాదాబ్ గాయంతోనే బ్యారికేడ్లు ఎక్కి ‘హెల్ప్.. హెల్ప్’ అని అరుస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని అతడి స్నేహితురాలు ఆమ్నా ఆసిఫ్ మీడియాకు తెలిపారు. చేతి నుంచి రక్తం ధారగా కారుతుండగా షాదాబ్ను ఎయిమ్స్కు తరలించి సర్జరీ ద్వారా బుల్లెట్ను తీసేశారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్న ట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటన రెప్పపాటు కాలంలో జరిగిందని పోలీసులు చెప్పుకొచ్చారు.
ముందే ఫేస్బుక్లో పోస్టులు
కాల్పులు జరిపిన వ్యక్తి యూపీకి చెందిన హిందూ అనుకూలవాది అని అతని ఫేస్బుక్ పోస్టులు చెబుతున్నాయి. పెద్ద తుపాకీ పట్టుకుని ఓ కుర్చీని తిప్పి కూ ర్చున్న ప్రొఫైల్ ఫోటోతో ఆ అకౌంట్ ఉంది. కాల్పులకు ముందే అతను లైవ్స్ట్రీమింగ్ మొదలెట్టాడు. ‘షాహీన్..! భాగో.. ఖేల్ ఖతమ్’(షాహీన్.. పరిగెత్తు.. నీ పని సరి!) అని ఒక పోస్టు, ఆజాదీ దే రహా హూ అని మరో పోస్టు పెట్టాడు. ‘నేను పోయాక, నా మృతదేహంపై ఓ కాషాయ వస్త్రం కప్పండి.. జై శ్రీరామ్ అని నినదించండి’ అని ఒకటి, మేరే ఘర్కా ఖయాల్ రఖ్నా(మా వాళ్లను చూసుకోండి) అని మరొకటి, చందన్ భాయ్.. ఏ బదలా ఆప్ కే లియే’ అని ఇంకో పోస్టు పెట్టాడు. నిందితుడి గురించి తెలియగానే అతని ఫేస్బుక్ను వేలాది మంది చూశారు. అయితే సాయంత్రానికి అతని అకౌంట్ను ఫేస్బుక్ డిలీట్ చేసింది. గాంధీ వర్ధంతి రోజు గాడ్సే మళ్లీ పుట్టాడని పోస్టులు పెట్టారు.
స్పెషల్ కమిషనర్ దర్యాప్తు: షా
దోషులను వదిలేది లేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ ఢిల్లీ పోలీసుల నుంచి వివరాలు తెలు సుకున్నారు. కాగా, బీజేపీ నేతలు, మంత్రులు ప్రజలను రెచ్చగొట్టేట్లు ప్రసంగాలు చేస్తున్నారు. హింస వైపా, విధ్వంసం వైపా? ఎటువైపు ఉన్నారో ప్రధాని స్పష్టం చేయాలి’’ అని ప్రియాంక చెప్పారు.
మా అబ్బాయికి 17 ఏళ్లే: కుటుంబసభ్యులు
కాల్పులు జరిపిన కుర్రాడి వయసు 19 ఏళ్లు కాదనీ, 17 ఏళ్లేననీ అతని కుటుంబసభ్యులు అన్నారు. పోలీసు లు కూడా అతణ్ని బాలుడిగానే(జువెనైల్) ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అతని ముఖం చూపరాదన్నారు. కాగా, టీనేజర్ పిస్తోలుతో హల్చల్ చేస్తున్నా పోలీసు లు ప్రేక్షకపాత్ర వహించారని జామియా వర్సిటీ వీసీ నజ్మా అఖ్తర్ తప్పుబట్టారు. విద్యార్థులు సంయమనంతో వ్యవహరించారన్నారు.
ఆర్నాబ్ చానెల్ తప్పటడుగు!
అర్నాబ్ గోస్వామి చీఫ్గా ఉన్న రిపబ్లిక్ టీవీ జామి యా కాల్పులపై తప్పుడు రిపోర్టింగ్ జరిపినట్లు విమర్శ లొచ్చాయి. కాల్పులు జరిపిన వ్యక్తి సీఏఏ ఆందోళన కారుల్లోని వ్యక్తేనంటూ చాలాసేపు ఆ ఛానెల్ రిపోర్టర్లు ఊదరగొట్టారు. ‘‘ప్రొటెస్టర్ టర్న్స్ వయెలెంట్’’ అని ఆ షూటర్ను ఓ వృత్తంలో పదే పదే చూపింది.
చూస్తూ నిలబడ్డ పోలీసులు!
వీడియో ఫుటేజి పరిశీలిస్తే కాల్పులకు ముందు పిస్తోలు పట్టుకుని దుండగుడు వెనక్కి నడుస్తూ, ఆందోళనకారులను బెదిరిస్తున్నట్లు స్పష్టంగా ఉంది. వెనక రోడ్డంతా ఖాళీగా ఉంది. వెనక ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారే తప్ప అతను కాల్పులు జరిపేదాకా కల్పించుకోనే లేదు. కాల్పులు జరిపాక, ఓ అధికారి అతని దగ్గరికొచ్చి పిస్తోలు లాక్కున్నారు. మరికొందరు అతని చేతులు కట్టి లాక్కుపోయారు.
Courtesy Andharajyothi