వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? ఎలా? వూహాన్లోని మాంసం విక్రయ శాలలోనే పుట్టి… ప్రపంచాన్ని చుట్టేసిందా? లేక…. అక్కడి ప్రయోగశాలలో ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారా? లేకపోతే… ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తూ బయటపడి మొత్తం మానవాళికి మహమ్మారిగా మారిందా? ‘చైనా మమ్మల్ని ముంచేసింది’ అని మండిపడుతున్న ట్రంప్ సర్కారు ఇప్పుడు వైరస్ మూలాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. ‘కరోనా వైరస్ పుట్టుక’పై నిఘా విభాగాల ద్వారా లోతైన దర్యాప్తు జరిపించాలని నిర్ణయించుకుంది. వూహాన్లోని ల్యాబ్ల నుంచే వైరస్ ప్రమాదవశాత్తూ బయటపడి ఉండొచ్చుననే అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులను, ఇతర నివేదికలను ఉటంకిస్తూ ‘యాహూ న్యూస్’ ఒక సుదీర్ఘ కథనాన్ని ప్రచురించింది.
కరోనా వైర్సను జీవాయుధంగా (బయో వెపన్)వాడేందుకే సృష్టించారనే వాదనను అమెరికా అధికారులు గతంలో తోసిపుచ్చారు. ఇప్పు డు.. వైరస్ చైనా మాంసవిక్రయశాల నుంచి కాకుండా, వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి పొరపాటున బయటికి వచ్చి ఉండవచ్చునని ఏకంగా 9 మంది అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. వీరిలో కొందరు ఇటీవల రిటైర్ అయ్యారు. వైరస్ మూలాలపై చైనా తగిన సమాచారం ఇవ్వకపోవడంపై అమెరికా నిఘా వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిటన్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఎందుకీ సందేహం?
వూహాన్ సీఫుడ్ మార్కెట్లో రోగగ్రస్త జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించిందని చైనా ప్రకటించింది. జనవరి 1న ఆ మార్కెట్ను మూసివేసింది. అయితే, అంతకుముందు జంతువుల్లో వైరస్ సోకిన ఉదంతాలు, లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించలేదు. పైగా.. వూహాన్లో బయటపడిన తొలి కరోనా కేసుకు, మాంసం మార్కెట్ పరిసరాలకూ సంబంధమే లేదు. అంటే.. వూహాన్ ప్రయోగశాలలో పరీక్షిస్తున్న ‘నేచురల్ వైరస్’ అక్కడి పరిశోధకుల్లో ఒకరికి ప్రమాదవశాత్తూ సోకి ఉండాలి. లేదా.. అక్కడి బయో వ్యర్థాలు, ప్రయోగాలు జరిపే జంతువుల ద్వారా బయటపడి ఉండాలనేది అమెరికా నిఘా అధికారుల బలమైన అనుమానం. వైర్సలు, అంటువ్యాధులపై ప్రయోగాలు నిర్వహించే అనేక ప్రఖ్యాత ల్యాబ్లు వూహాన్లో ఉన్నాయి. గబ్బిలాల్లో కరోనా వైర్సపై ప్రత్యేకంగా పరీక్షలు చేసే వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఈ మహా నగరమే కేంద్రం. ఈ ల్యాబ్లో కొన్ని వేల శాంపిళ్లపై పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ 2013లో గబ్బిలాలలో గుర్తించిన వైరస్ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలకు అత్యంత సమీపంగా ఉంది.
నోవల్ కరోనా వైరస్ వూహాన్లోని మాంస విక్రయ శాలల్లో పుట్టలేదని.. అక్కడి వైరాలజీ ల్యాబ్లో ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను గుర్తించేందుకు, వైరస్ మూలం ఎక్కడుందో కనిపెట్టేందుకు అమెరికా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ‘‘కరోనా వైరస్ పుట్టుకపై రకరకాల ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపైనా దృష్టి సారిస్తాం. ఉన్నతస్థాయిలో దర్యాప్తు సాగిస్తాం. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం సీరియ్సగా తీసుకుంది’’ అని రిటైర్డ్ సీనియర్ జాతీయ భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు.
ముందే హెచ్చరించినా…
అమెరికా విదేశాంగ శాఖ అధికారులు 2018లో వూహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు. ఆ తర్వాత తమ ప్రభుత్వానికి రెండుసార్లు నివేదికలు పంపించారు. ల్యాబ్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని తెలిపారు. ప్రయోగశాల నుంచే మనుషులకు వైరస్ సోకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో… వైరస్ మూలాలపై లోతైన దర్యాప్తు జరపాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోం ది. మరోవైపు, అమెరికాకే చెందిన అనేకమంది శాస్త్రవేత్తలు, సంస్థలు నోవల్ కరోనా వైరస్ వెనుక ఎలాంటి కుట్ర లేదని వాదిస్తున్నారు. అయితే, నోవల్ కరోనా వైరస్ మూ లాలు, పుట్టుకపై అన్ని రకాల పరిశోధనలను చైనా ప్రభు త్వం నిషేధం విధించడం అనుమానాలకు తావిస్తోంది.
ఖండించిన చైనా
వూహాన్లోని ప్రయోగశాల నుంచే కరోనా వైరస్ బయటపడి ఉంటుందనే వాదనలను చైనా ప్రభుత్వం కొట్టివేసింది. ఈ ఆరోపణలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్ పేర్కొన్నారు.
గబ్బిలాలకు కరోనా వైరస్ సోకినట్లు 2013లోనే గుర్తించారు. ఇప్పుడు బయటపడిన వైర్సకు కూడా మూలాలు అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే… ఈ రెండు వైర్సల జీనోమ్లో సారూప్యత ఉంది.
– రిచర్డ్ ఎబ్రైట్, మాలిక్యులర్ బయాలజిస్ట్, రట్గర్స్ యూనివర్సిటీ.
Courtesy Andhrajyothy