- 9.48 గంటలకు వెటర్నరీ డాక్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్
- 10.08కి చంపేశారన్న సీపీ సజ్జనార్
- 20 నిమిషాల్లోనే కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్య!?
- నిందితులు ఆ 2:44 గంటలు ఏం చేశారు?
- జరిగింది బెంగళూరు హైవేపైనే.. మరి, హైవే పోలీస్ ఏం చేశారు?
- ఆ టైంలో 11 వాహనాలు గస్తీ తిరుగుతున్నాయంటున్న రికార్డులు
- మృతదేహాన్ని కనుగొన్నదీ పోలీసులు కాదు.. పాల రైతు చెప్పాకే జాడ
- సమాఽధానం దొరకని ప్రశ్నలు అనేకం.. పోలీసుల తీరుపై విమర్శలు
(రంగారెడ్డి జిల్లా)
వెటర్నరీ డాక్టర్ ఫోను బుధవారం రాత్రి 9.48 గంటలకు స్విచ్ఛాఫ్ అయిందని సీపీ సజ్జనార్ చెప్పారు. ఆమెను 10.08 గంటలకు చంపేశారని కూడా చెప్పారు. ఈ రెండు సమయాలకు మధ్య వ్యవధి 20 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలోనే, డాక్టర్ను బలవంతంగా తరలించడం.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడం.. ఆమెపై నలుగురు అత్యాచారం చేయడం సాధ్యమేనా!? అదే సమయంలో, డాక్టర్ను తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చంపి ఉండవచ్చని ఆమె పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, నిజంగా ఆమె ఎప్పుడు చనిపోయింది!? ఎవరు చెప్పేది నిజమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లారీలో తిరుగుతూనే రేప్ చేశారా!?
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నిందితులు వైద్యురాలిని హత్య చేసి.. 10.13 నిమిషాలకు లారీ తీసుకుని బయలుదేరారు. కానీ, సీసీ ఫుటేజ్ ప్రకారం నిందితులు పెట్రోల్ కోసం కొత్తూరులోని బంక్కు 12.57 నిమిషాలకు వెళ్లారు. పెట్రోల్ బంక్ ఉన్న ప్రాంతానికి, హత్య జరిగిన ప్రాంతానికి మధ్య 25 కిలోమీటర్లలోపే ఉంటుంది. శంషాబాద్ వద్ద రాత్రి 10.13 నిమిషాలకు బయలుదేరిన నిందితులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకునేందుకు అరగంటకు మించి సమయం పట్టదు. ఆ మూడు గంటలు వాళ్లు ఏం చేశారనేది పోలీసులు వెల్లడించలేదు. దాంతో, లారీలో ఆమెను తరలిస్తూ కూడా అకృత్యాలకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల వైఫల్యం
డాక్టర్ హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కానీ, కొన్ని అనుమానాలకు ఇంకా సమాధానాలు రాలేదు. ఫిర్యాదు స్వీకరణ, విచారణ విషయంలో పోలీసుల వైఖరిపై తీవ్ర దుమారం రేగుతోంది. నిత్యం వాహనాల రద్దీ ఉండే ఈ ప్రాంతంలో టోల్గేటు వద్ద ఓ యువతిని కిడ్నాప్ చేసి 50 మీటర్ల దూరంలోనే అత్యాచారం చేసి హత్య చేయడం చూస్తే భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేయడం కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైవే పక్కనే ఇంతా ఘోరం జరిగినా రాత్రివేళ పెట్రోలింగ్ చేసే వారు ఎవరూ గుర్తించలేదా? హత్య జరిగిన 24 గంటలకు వాహనాన్ని జేపీ దర్గా బస్స్టాండ్లో గుర్తించారు. అంత సమయం పట్టడం చూస్తే పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది.
Courtesy AndhraJyothy…