జైల్లో నోరు విప్పిన కీలక నిందితుడు
కాపలా జవాన్ల వద్ద వెల్లడించిన కర్కోటకుడు
శంషాబాద్ సమీపంలో అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ కేసులో నిందితుల కిరాతకాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హతమార్చిన తరువాతే పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కాని ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు కీలక నిందితుడు ఆరిఫ్ చర్లపల్లి జైల్లోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులోని నలుగురు నిందితులను హైదరాబాద్ చర్లపల్లి జైలులో ప్రత్యేక నిఘాలో ఉంచారు. వారితో కొంతమంది జవాన్లు మాట కలిపినపుడు ఆరిఫ్ జంకుగొంకు లేకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు ‘ఈనాడు’కు వెల్లడించాయి. నేరం జరిగిన రోజున ఆరిఫ్ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని సమీప ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే రక్షించడంటూ ఆమె పెద్దగా కేకలు వేసింది. అవి ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో అప్పటికే తాగిన మత్తులో ఉన్న చెన్నకేశవులు వెంటనే జేబులోని సీసా తీసి అందులోని మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయంతో ఆందోళనతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే నలుగురు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. తరువాత ఆమెను లారీ మీదకు ఎక్కించారు. అక్కడా మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకవైపు మద్యం తాగించడం.. మరోవైపు పాశవికంగా అత్యాచారానికి గురవడంతో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టారు.
జ్వరంగా ఉందన్న ఆరీఫ్!
దిశ కేసు నిందితుల గదులను చర్లపల్లి జైలు జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ మంగళవారం పరిశీలించి వారితో మాట్లాడారు. దోమలు ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆరిఫ్, మరికొందరు తెలిపారు. తనకు జ్వరం వచ్చిందని ఆరిఫ్ చెప్పడంతో అతడికి వైద్యం అందించారు. మరో నిందితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతనికి కూడా వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. దిశ కేసు నిందితులు నలుగురినీ తమ గదులు దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. లోపలే బాత్రూం కూడా ఉంది. టిఫిన్, భోజనం తలుపు కింది నుంచే అందిస్తున్నారు.
(Courtesy Eenadu)