– ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ సర్కారు బాసట
– లీటర్ పై రూ. 8.36 పైసలు తగ్గిన ధర
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆర్థిక పునరుద్ధరణలో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ స్థానిక ప్రజలకు తీపి కబురు అందజేసింది. పెట్రోల్, డీజల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో డీజిల్ పై ఉన్న30 శాతం వ్యాట్ ను 16.75 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ తాజా నిర్ణయంతో లీటర్ కు రూ. 82 ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ. 73. 84 పైసలకు పడిపోయింది. వ్యాట్ తగ్గింపుతో లీటర్ పై రూ. 8.36 పైసల చొప్పున వినియోగదారులకు లబ్ది చేకూరనున్నది. దేశంలోనే అతి తక్కువ డీజిల్ ధర ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. లాక్ డౌన్ కారణంగా పడిపోయిన ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు. డీజిల్ ధరలు దిగిరావడం ఆర్థిక వ్యవస్థ లో పుంజుకోవడానికి సహకరిస్తుందని తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు వివరించారు. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు ఇబ్బందులకు గురయ్యాయరని అన్నారు. ప్రధానంగా ఆర్థిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇరత వర్గాల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో డీజీల్ ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. రెండు కోట్ల ఢిల్లీ జనాభా కలిసి గట్టుగా కరోనా పై పోరాటం చేస్తుందని అన్నారు. ఆదే దిశలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలోనూ అందరి సహకారం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే, సీఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ యువత సోషల్ మీడియాపై ఆయన నిర్ణయానికి కితాబిస్తూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశం అవుతుంది.
Courtesy: NT