– నాయకుల అరెస్ట్
– శాంపిల్స్ కోసమేనంటున్న కేంద్ర బృందం
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల అడవిలో మళ్లీ యురేనియం కలకలం రేపింది. మంగళవారం సర్వేకు వచ్చిన సీపీఎఫ్, యూసీఐఎల్ కేంద్ర బృందాలను సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గోపాల్, ఇతర ప్రజా సంఘాల నాయకులు అడ్డుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. తాము కేవలం శాంపిల్స్ కోసం మాత్రమే వచ్చామంటూ కేంద్ర బృందం చెబుతోంది.నల్లమలలో యురేనియం తవ్వకాల సర్వే ప్రజాందోళనల నేపథ్యంలో కొంతకాలం ఆగినట్టే ఆగినా.. కేంద్ర ప్రభుత్వం చాపకింద నీరులా మొదలుపెట్టింది. గతంలో యూసీఐఎల్ వారు మాత్రమే సర్వేకు వచ్చేవారు. ప్రస్తుతం యూసీఐఎల్తో పాటు అటవీ శాఖ, సీసీఎఫ్ అధికారులు గతంలో వేసిన బోరు బావుల గుర్తులను పరిశీలించేందుకు వచ్చారు. అయితే, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లల్లో ఉండగా.. అటవీ ప్రాంతంలో విస్తృతంగా రహదారులు వేసి యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రతినిధి బృందం అమ్రాబాద్ చేరుకోగానే ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆ బృందాన్ని అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం తవ్వకాలను చేపట్టనీయబోమని తెగేసి చెప్పారు. దాంతో సర్వేను అడ్డుకున్న సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గోపాల్, నాసరయ్య, బాలకిష్టయ్య, శంకర్ నాయక్, లక్ష్మినారాయణ, నగేష్, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, గతంలో వేసిన బోరు బావుల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు మాత్రమే వచ్చినట్టు కేంద్రం బృందం సభ్యులు చెప్పడం, అటవీ ప్రాంతంలో మరికొన్ని పాయింట్లను పరిశీలించేందుకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Courtesy: NT