– కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె
– కామారెడ్డి జిల్లాలో నిండాముంచిన అకాల వర్షం
పిట్లం/లింగంపేట్ : అకాల పిడుగులకు అన్నదాత తల్లడిల్లుతున్నాడు. కండ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుండగా రైతు గుండె విలవిల్లాడిపోతున్నది. తడిసి ముద్దయిన ధాన్యాన్ని బరువెక్కిన హృదయంతో ఆరబెట్టిన రైతు గుండె అక్కడే ఆగిపోయింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామ కొనుగోలు కేంద్రంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మాల భూమయ్య (56)కు చెందిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టాడు. మధ్యాహ్నం పక్కనే ఉన్న చెట్టు కింద సేదతీరడానికి వచ్చి గుండెపోటుతో కుప్పకూలాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల కోసం రూ.10 వేల అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. అయితే సోమవారం రాత్రి నిజాంసాగర్, పిట్లం మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. పిట్లంలో 1065 మంది రైతులకు చెందిన 1085 ఎకరాల్లో వరి, 190 ఎకరాల్లో జొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజాంసాగర్ మండలంలో పలుగ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Courtesy: NT