వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు కరోనా వైరస్ సెగ తాకింది. కోవిడ్-19 సోకి ఇప్పటివరకు అమెరికాలో 452 మంది మృతి చెందారు. గత 24 గంటల్లోనే వంద మందిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు హాప్ కిన్స్ యూనివర్సిటీ రీసెర్చ్ లో వెల్లడైంది. అమెరికాలో ఇప్పటివరకు 34,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 795 మంది ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు అధికారిక గణాంణాలు వెల్లడిస్తున్నాయి. కరోనా బారిన పడినవారిలో ఇప్పటివరకు 178 మంది కోలుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 9,339 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.
అమెరికాలో నమోదైన కేసులో దాదాపు సగం న్యూయార్క్ లోనే వెలుగు చూడటం భయాందోళన రేపుతోంది. న్యూయార్క్ లో అత్యధికంగా 16,900 మంది కరోనా బారిన పడగా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్ లో 1,966 కోవిడ్ కేసులు నమోదు కాగా, 95 మంది మృతి చెందారు. న్యూజెర్సీలో 1,914 కరోనా కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. కాలిఫోర్నియాలో 1,77 మందికి కోవిడ్ సోకగా, 35 మంది మృత్యువాత పడ్డారు. ఇలినాయి (1,049), మిచిగాన్(1,035), ఫ్లోరిడా(1,007)ల్లో కూడా వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా, ఇటలీ తర్వాత అమెరికాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చైనాపై ట్రంప్ అసహనం
కరోనా వైరస్ ప్రభావంపై చైనా సరిగా స్పందించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. కోవిడ్-19కు సంబంధించిన సమాచారాన్ని సరైన సమయంలో తమతో చైనా పంచుకోలేదని నిందించారు. కరోనా వైరస్ గురించి తెలిసిన వెంటనే తమను అప్రమత్తం చేసివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కెంటకీ సెనేటర్ ర్యాండ్ పాల్(57) కూడా కరోనా బారిన పడ్డారు. ప్రతినిధులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరికి ఇప్పటికే కోవిడ్ సోకింది.