– యూపీ పోలీసుల బుల్లెట్లకు మరణించిన అభాగ్యులు
– సీఏఏ నిరసన ఉద్యమంలో పాల్గొన్నారన్న కోపంతో..
– మృతులలో దినసరి కూలీలు, ఆటో రిక్షా డ్రైవర్లే అధికం
– ముగ్గురివే పోస్టుమార్టం నివేదికలు అందజేత
లక్నో : మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ఇప్పటివరకూ 23 మంది అమాయకులు పోలీసుల బుల్లెట్లు తాకి మరణించారు. ఫిరోజాబాద్, కాన్పూర్, మీరట్, ముజఫర్నగర్, సంభాల్, వారణాసి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఖాకీల కాఠిన్యానికి బాధితులైనవారు 23 మంది. చనిపోయినవారిలో ఫిరోజా బాద్ నుంచి ఏడుగురు.. మీరట్ నుంచి ఐదుగురు.. కాన్పూర్ నుంచి ముగ్గురు.. బిజ్నోర్, సంభాల్ నుంచి ఇద్దరు.. లక్నో, ముజఫర్నగర్, రాంపూర్, ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. కాగా, వీరందరూ నిరుపేద ముస్లిం యువకులే. రెక్కాడితే గానీ డొక్కాడని అభాగ్యులు. కానీ యోగి సర్కారు ఆదేశాలతో ఖాకీల కాఠిన్యానికి బలైపోయారు. మృతుల్లో ముగ్గురి పోస్టుమార్టం నివేదికలను మాత్రమే అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. మిగిలిన ఇరవై మందికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ధృవపత్రాలు అందజేయలేదని మృతుల తరఫు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన బిజ్నోర్కు చెందిన మహ్మద్ అనాస్, మహ్మద్ సులేమాన్, లక్నోకు చెందిన మహ్మద్ వకీల్లు బుల్లెట్లు తాకి మరణించారని తేలింది. అయితే నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు మాటమారుస్తుండటం గమనార్హం.
మరికొంతమంది మృతికి సంబంధించి వారి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరోజాబాద్లో ఓ గ్లాస్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న రషీద్.. డిసెంబర్ 20న సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొనగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో తలకు గాయమై మరణించాడు. రాంపూర్లో ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్న ఫయాజ్ ఖాన్.. గొంతులో బుల్లెట్ తగిలి మరణించగా.. కాన్పూర్లోని తోలు పరిశ్రమలో పనిచేస్తూ బతుకునీడుస్తున్న జహీర్కు తలపై, మేస్త్రిగా పనిచేస్తున్న అఫ్తాబ్ ఆలంకు ఛాతిపై, సంభాల్కు చెందిన ట్రక్ డైవర్ షాహ్రాజ్ కడుపులో బుల్లెట్ దిగడంతో చనిపో యాడని కుటుంబసభ్యులు తెలిపారు. బిజ్నోర్కు చెందిన సులేమాన్.. సివిల్స్కు సిద్ధమవుతున్నాడు. ఓ పనికోసం బయటకు వచ్చిన అతడిని పోలీసులు నిరసన కారుడని అన్యాయంగా కాల్చివేశారని సులేమాన్ తండ్రి వాపోతు న్నాడు. మరోవైపు నిరసనకారుల మరణాలపై పౌర హక్కుల సంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు, సామాజి కవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై స్వతంత్ర విచార ణ చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వం లోని బీజేపీ సర్కారును డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఢిల్లీలో ఉన్న పీపుల్స్ ట్రిబ్యూనల్లో పిటిషన్ దాఖలు చేశారు. నిజనిర్ధారణ కమిటీలు సైతం చనిపోయిన వారం తా బుల్లెట్లు తాకే మరణించారని నివేదికలు వెల్లడి స్తుంటే.. సర్కారు మాత్రం నిరసనకారులపై ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదనడం విడ్డూరం. సర్కారు, పోలీసులపై భయంతో బాధితకుటుంబాలు ఈ మరణాలకు బాధ్యులైనవారిపై కనీసం కేసు పెట్టడానికి కూడా వెనుకాడుతున్నారని పౌర హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
దహన సంస్కారాలకూ అనుమతివ్వలేదు
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని మరణించిన తమ వారికి కనీసం దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతినివ్వలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతమందిని కనీసం వారి కుటుంబాలకు తెలియకుండానే దహనం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పిల్లల మృతదేహాలనైనా మాకు అప్పగించాలని పోలీసులను చేతులెత్తి వేడుకున్నాం. అయినా వాళ్లు వినలేదు. మా ఇంటిదగ్గర వారి దహనసంస్కారాలు చేస్తామని చెప్పినా వారు పట్టించుకోలేదు. అలా చేస్తే మతపరమైన గొడవలు జరుగుతాయనీ, కనీసం వారి చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహాలను కాల్చివేశారు’ అని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నిజాలు బయటకొస్తాయనే సుభాషిణి అలీ, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో మెంబర్
ఇది చాలా విషాదకరం. చనిపోయినవారిలో అత్యధికులు నిరుపేద ముస్లిం యువకులే. పొట్టకూటికోసం ఏదో ఓ పనిచేసుకుని బతుకుతున్నారు. వీరందరూ పోలీసుల బుల్లెట్లు తాకి మరణించారు. అయినా ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ దీనిని అంగీకరించడంలేదు. ముగ్గురి పోస్టుమార్టం నివేదికలే ఇందుకు సాక్ష్యం. మృతులకు నష్టపరిహారం కూడా అందించడం లేదు. మిగిలినవారి రిపోర్టులు పోలీసులు కావాలనే దాస్తున్నారు. అవి వెల్లడిస్తే వాస్తవాలు బయటకొస్తాయనే భయంతోనే వాటిని దాస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం.
(Coutesy Nava Telangana)