– రాష్ట్రం గట్టిగా అడగదు… కేంద్రం హామీ ఇవ్వదు
– కీలకం కానున్న బయ్యారం, కాళేశ్వరం, యురేనియం
– ప్రధానితో భేటీలోనైనా చర్చకు వచ్చేనా..?
రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలాడుతున్నాయి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ప్రారంభించటం, కాళేశ్వరానికి జాతీయ హోదా వ్యవహారం గత ఐదేండ్లుగా నలుగుతుండగా తాజాగా యురేనియం వివాదం కూడా ఈ జాబితాలో చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అతి ముఖ్యమైన ఈ మూడు అంశాల గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి లేక పోవటంతోనే కేంద్రం కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పే అంశాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ దీనిపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ఉక్కు కర్మాగారానికి అవసరమైన 200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం అందుబాటులో లేక పోవటంతో ఇది ప్రారంభించటం సాధ్యం కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడేండ్ల క్రితమే కేంద్రానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యా లను పరిశీలించటానికి కేంద్రం ఒక టాస్క్ ఫోర్స్ నియమిం చగా టాస్క్ ఫోర్స్ కూడా దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట లేదు. టాస్క్ ఫోర్స్ సమావేశానికి గతంలో హాజరైన రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.
బయ్యారం ఉక్కు కర్మాగారానికి అవసరమైన ఇనుప ఖనిజం లభ్యం కాకపోతే చత్తీస్గఢ్లోని బైలడిల్లా నుంచి ఖనిజాన్ని తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఇనుప ఖనిజం తరలించటానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరం రైలు మార్గాన్ని నిర్మిస్తే సరిపోతుం దని ఆయన ప్రతిపాదించారు. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన ఇప్పటి వరకూ రాలేదు.
ఆశలపై నీళ్లు చల్లిన కేంద్ర మంత్రి….
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ మం త్రి ధర్మేంద్ర ప్రధాన్ బయ్యారం ఉక్కు కర్మాగారం విషయం లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉక్కు కర్మాగారాన్ని నేరు గా కేంద్రం నెలకొల్పే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్మాగారం ప్రారంభించాలనుకుంటే కేంద్రం పరోక్ష సహకారం అందిస్తుందన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తామని మాత్రమే పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని, స్పష్టమైన హామీ ఇవ్వలేదని అన్నారు. కేంద్ర మంత్రి ఈ ప్రక టన చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.
కాళేశ్వరం జాతీయ హోదాపైనా…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి కేంద్రంతో మాట్లాడ తారంటూ టీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదనలూ అందలేదని కేం ద్రం ఇటీవల పునరుద్ఘాటించింది. రాష్ట్ర పునర్విభజన సంద ర్భంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి దీని నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని నిర్ణయించారు. పునర్విభజన చట్టంలో కూడా దీనిని పొందుపరచారు. అదే సందర్భంలో తెలంగాణలోని ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నేతలు కోరారు. ఇది కేవలం ప్రకటనగా మిగిలిపోయిందే తప్ప కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలనూ నీటి పారుదల శాఖ ప్రత్యేకంగా పంపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రికి లేఖ రాశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదని, కేంద్రంతో పోరాడి దీనిని సాధిం చుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాళేశ్వరం జాతీయ హోదా వ్యవహారాన్ని కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం చేశారనే విమర్శలను అధికార పార్టీ ఎదుర్కొంటు న్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు, బ్యాంకుల నుంచి రుణాల సేకర ణతో ఈ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టును కేంద్రం చేతిలో పెడితే ఇక్కడ కాంట్రాక్టు పనులపై తమకు పూర్తి అధికారం ఉండదనే కారణంతోనే జాతీయ హోదా గురించి కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి చేయటం లేదనే విమర్శలు కూడా పెల్లుబికాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న బీజేపీ నేతలు..విచారణకు మాత్రం కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. ప్రకటనలకే పరిమితమయ్యారు. జాతీయహోదా గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదు.
యురేనియం చిక్కుముడి వీడేనా…
నల్లమల అడవులకు, అక్కడ నివసించే చెంచులకు, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుందని భావిస్తున్న యురేనియం తవ్వకాల విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని ఇటీవల పరిణామా లు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలతో పాటూ నల్లమల ప్రాంత ప్రజలు ఆందోళన బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఈ తీర్మానం తమకు అందిందో లేదో కేంద్రం ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. యురేనియం వ్యవహారంలో తాము ముందుకే పోతామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఇటీవల ప్రకటించారు. యురేనియం తవ్వకాల కోసం రాష్ఠ్ర వన్యప్రాణి బోర్డు సహా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఇప్పటి వరకూ ఉపసంహరించుకోక పోవటంపై పర్యావరణ వాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలు ఆపాలంటే కేంద్రంపై పూర్తి స్థాయి పోరాటం చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రధాన మంత్రి వద్దకు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కూడా తీసుకువెళ్లాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. యురేనియం అంశంపై సీఎం ప్రధాన మంత్రి నుంచి స్పష్టమైన హామీ తీసుకుంటారా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
Courtesy Navatelangana