ఆకతాయిల వేధింపులతో యూపీ టాపర్ బలి
లక్నో : మహిళలపై ఆకతాయిల వేధింపులు కరోనా సమయంలోనూ ఆగటంలేదు. కొందరు ఆవారా గ్యాంగ్ చేసిన పనికి విద్యా కుసుమం నేలరాలింది. కరోనాతో అమెరికాలో కళాశాలకు సెలవులు ఉండటంతో.. ఇంటికి వచ్చిన ఆ యువతి ఈవ్టీజింగ్కు బలైంది.
ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. బులంద్షహర్ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్సీ క్లాస్ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్లో గల బాబ్సన్ కాలేజ్లో స్కాలర్షిప్నకు అర్హత సాధించింది. ఈ క్రమంలో అక్కడ విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్లో భారత్కు తిరిగి వచ్చింది. ఈ నెల 20న తిరిగి అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన బంధువుతో కలిసి బైక్ పై బయల్దేరింది. అయితే కొందరు ఆవారా గ్యాంగ్ వారి బైక్ను వెంబడిస్తూ రోడ్డుపై ఫీట్లు చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె ఉన్న బైక్ను ఢ కొట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది.
ఉన్నత చదువులు చదివి ఉన్నత శిక్షరాలకు చేరుకుంటుందనుకున్న కూతురు ఆకస్మిక మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నది. సుదీక్షను వేధింపులకు గురిచేసిన ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని త్వరలో అరెస్టు చేశామని చెప్పారు. కాగా, సుదీక్ష మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ #JusticeForSudeeksha హ్యాష్టాగ్తో సోషల్ మీడియాలో నెటిజనులు నినదిస్తున్నారు. దోషులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
Courtesy: NT