దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో కరోనా కేసులు 14,378
దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకి 43 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 14,378 మంది కోవిడ్ బారిన పడినట్టు తెలిపింది. ఇందులో 4,291 కేసులు తబ్లిగీ జమాత్కు సంబంధించినవేనని వెల్లడించింది. కాగా, 1992 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
ఉద్యోగులను తొలగించొద్దు: కేటీఆర్
లాక్డౌన్ ముగిసిన తర్వాత ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమలు, ఐటీ కంపెనీల యజమానులకు తెలంగాణ మంత్రి కేటఈఆర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులెవరూ ఉపాధి కోల్పోకుండా చూడాలని అన్నారు. ఉద్యోగులను తొలగించకుండా ఉండేందుకు కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. లాక్డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
ఏపీలో కొత్తగా 31 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 31 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణాలో 18, కర్నూలు 5, నెల్లూరు 3, ప్రకాశం 2, తూర్పు గోదావరిలో 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు ఉన్నాయి. ఇప్పటి వరకు 42 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 545. కాగా, కరోనా నివారణకు ఏపీ చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.
వలస కార్మికులపై సుప్రీంకోర్టులో పిల్
లాక్డౌన్తో దేశంలోని వివిధ నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత ఊళ్లకు తరలించాని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషన్ ఈ పిల్ వేశారు. వలస కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత స్వస్థలాలకు పంపాలని పిల్లో ఆయన కోరారు.
మన్మోహన్ నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీ
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైర్మన్గా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ఓ సంప్రదింపుల కమిటీని ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై సమాలోచనలు చేయడంతో పాటు, నిర్మాణాత్మక సలహాలను ఈ బృందం ఇస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో పార్టీ వైఖరిని కూడా ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉంటారు. దీనికి కన్వీనర్గా పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యవహరిస్తారు.
పంజాబ్లో కరోనాతో ఏసీపీ మృతి
కరోనా వైరస్ బారిన పడి పంజాబ్లోని లూథియానా ఏసీపీ (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్)అనిల్ కోహ్లి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్యుల పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. లూథియానాలోని ఎస్పీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య 202కి చేరగా ఇప్పటి వరకు 14 మంది మృత్యువాత పడ్డారు.
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపప్రిల్ 20 నుంచి లాక్డౌన్ను పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ బీ, గ్రీన్ జోన్లుగా విభజించి అక్కడ పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కాసర్గడ్, కన్నూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలను రెడ్ జోన్ కింద పరిగణిస్తూ… ఆయా చోట్ల లాక్డౌన్ నిబంధనలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఈ నాలుగు జిల్లాల్లో ఎటువంటి రంగాలకు కూడా నిబంధనల నుంచి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. హాట్స్పాట్లను సీల్ చేసి ఉంచుతామని.. కేవలం నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రెండు మార్గాలు తెరచి ఉంచుతామని పేర్కొంది.