వైద్య విద్యను ప్రయివేటీకరించేందుకు కేంద్రం ఎత్తులు : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ
కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) ఎంపీ కేకే రాగేష్ అన్నారు. కేంద్రం వైద్య విద్య ప్రతిష్టను మసకబార్చేందుకు, ఆ రంగాన్ని పూర్తిగా ప్రయివేటు శక్తులకు అప్పజేప్పేందుకు కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో ఎన్ఎంసీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీపీఐ(ఎం) తరఫున కేకే రాగేష్ మాట్లాడారు. వైద్య విద్యకు కేంద్రం నీట్ వంటి ఏక ప్రవేశ పరీక్ష నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ఆయా వర్సిటీ పరిధిలోని కాలేజీలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం యూనివర్సిటీల బాధ్యతని కేంద్ర ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. ఈ విధంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాల అధికారాలను కాలరాసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే… ఫీజులు ఎవరు నిర్ధారిస్తారన్న అంశాన్ని రాగేష్ లేవనెత్తారు. విద్య అనేది రాష్ట్రాల జాబితాలో ఉన్నదనీ… దీనితో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురువుతాయని చెప్పారు. అటువంటి ఇబ్బందులకు ఎవరు సమాధానం చెబుతారని అన్నారు. ఈ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే యూనివర్సిటీలు కేవలం సర్టిఫికెట్ ఇచ్చే కేంద్రాలు మారుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. దేశంలో వైద్య విద్య నాణ్యత, ప్రామాణాలు, ప్రతిష్టతను కాపాడటంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలి:ఢిల్లీ డాక్టర్స్ అసోసియేషన్
మెడికల్ కమిషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఢిల్లీలోని డాక్టర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో నిరాహార దీక్షకు సైతం వెనకాడబోమని మోడీ సర్కారుకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎయిమ్స్, వర్దమాన్ మహావీర్, ఆర్ఎం ఎల్ ఆస్పత్రులకు చెందినవైద్యులు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు.
(Courtacy Nava Telangana)