రామగిరి : జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాను అమరుడయ్యారు. ఆర్మీ ఉన్నతాధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ 2012లో ఆర్మీలో చేరారు. బెంగళూరులో శిక్షణ పూర్తిచేసుకుని, చండీగఢ్, రాజస్థాన్లో పనిచేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా 226 ఆర్మీ ఫీల్డ్ యూనిట్కు బదిలీ అయ్యారు. కొవిడ్ లాక్డౌన్లో సెలవులపై ఇంటికి వచ్చిన శ్రీనివాస్.. గత నెల 7న తిరిగి విధులకు వెళ్లారు. సోమవారం విధి నిర్వహణలో ఉండగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన అమరుడయ్యారని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా.. శ్రీనివా్సది నిరుపేద కుటుంబం. రెండేళ్ల క్రితమే మమత అనే యువతితో వివాహమైంది. ఆయన తండ్రి నారాయణ పశువుల కాపరి కాగా.. తమ్ముడు రాజు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రానికి మృతదేహాన్ని నాగేపల్లికి పంపుతామని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పినట్లు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Courtesy Andhrajyothi