హైదరాబాద్: కరోనా చికిత్సకెళ్ళిన వారిని నిలువు దోపిడి చేస్తున్నాయి కార్పోరేట్ ఆసుపత్రులు. సోమాజిగూడ దక్కన్ హాస్పిటల్లో 10 రోజులకు 17.5 లక్షల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా నిలువు దోపిడీకి పాల్పడుతున్న కార్పోరేట్ ఆసుపత్రులను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ… దొరికినంత దోచుకో అన్నట్లు అడ్డగోలుగా అమాయక ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని, ఇలా దోచుకుతింటున్న ప్రైవేటు దవాఖానాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోకోవాలన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య అధికమవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో అవుట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తున్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాలన్నారు. వారికి 4నెలల జీతం వెంటనే అందేలా చూడాలని చాడ డిమాండ్ చేశారు.