ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ వరకు
ప్రతి కళాశాలలో పది మంది సభ్యుల బృందం
హైదరాబాద్: కళాశాలల్లో కానీ, బయట కానీ వేధింపులు ఎదురైతే పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి? పోలీస్ స్టేషన్కు వెళితే ఎవరేమనుకుంటారో? కళాశాలలోనే ఫిర్యాదు చేసే ఏర్పాట్లు ఉంటే బాగుంటుంది కదా. కొంతమంది విద్యార్థినుల భావన ఇది. వారికోసం త్వరలోనే విద్యా సంస్థల్లో షీ బృందాలు రాబోతున్నాయి. ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ వంటి వృత్తి విద్యా కళాశాలల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో పది మంది స్వచ్ఛంద వాలంటీర్ల బృందాలను నియమించనున్నారు. బాధితులకు, పోలీసుల ఆధ్వర్యంలోని షీ బృందాలకు వీళ్లు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. కొత్త సంవత్సరంలో వీటి ఏర్పాటుకు మహిళా భద్రత విభాగం దీనిపై కసరత్తు చేస్తోంది.
హెచ్చరిక.. కౌన్సెలింగ్.. కేసు
విద్యార్థినులు తమకు ఎదురైన వేధింపుల గురించి ఈ బృందాలతో చెప్పుకోవచ్చు. కొందరు బాధితులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదుల్ని పంపిస్తున్నా, ఇకపై ఆ అవసరం లేకుండా తమ కళాశాలల్లోని వాలంటీర్ల బృందానికే చెప్పుకునే వీలుంటుంది. వారిచ్చిన సమాచారంతో షీ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అంచనా వేస్తాయి. వేధింపుల తీరును బట్టి వారిని మొదట హెచ్చరిస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పటికీ దారిలోకి రాకుంటే కేసు పెట్టి జైలుకు పంపిస్తారు.
కళాశాలలకే ఎంపిక బాధ్యత
కళాశాలల్లో వలంటీర్ల ఎంపిక బాధ్యతను యాజమాన్యాలకే అప్పగించనున్నారు. సామాజిక అంశాలపై చొరవ చూపే గుణమున్న విద్యార్థులనే ఈ బృందాల్లోకి ఎంపిక చేస్తారు.
విద్యార్థినులకు సాంత్వన : కళాశాలల్లోనే వాలంటీర్ల బృందాలు ఏర్పాటు కానుండటంతో బాధిత విద్యార్థినులకు చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి. ఫిర్యాదును బట్టి షీ బృందాలు రహస్యంగా దర్యాప్తు చేసి బాధితులకు సాంత్వన చేకూర్చుతాయి. కొత్త సంవత్సరంలో ఈ బృందాలు అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాం.
Courtesy Eenadu