గాంధీజీ హత్యతో సావర్కర్ సంబంధం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  

           ఎ.జి.నూరానీ.

సావర్కర్ హిందూత్వతో భాజపా అనుబంధం

సావర్కర్ ని హీరోగా భావించడానికి అతని 83 ఏళ్ల జీవితంలో తాను సాధించిన విశిష్టమైన కార్యమేదైనా ఉందా? ఏ దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ జరగని విధంగా బ్రిటిష్ పాలకులకి ఆరు క్షమాపణ పత్రాలు పంపడం అనే నికృష్టమైన కార్యంతప్ప మరేంలేదు. ఇవే కాక 1909 నుంచి 1948 మధ్య కాలంలో గాంధీజీతో పాటూ నలుగురు వ్యక్తుల హత్యలకి సంబంధించిన కుట్రలలోకూడా పాలుపంచుకున్నాడు.

భారతీయ జనతా పార్టీ సావర్కర్ నీ, 1923లో ఆయన రాసిన “హిందూత్వ” అనే వ్యాసాన్నీ ఆరాధిస్తుంది‌. సావర్కర్ హిందూయిజానికి  మతపరమైన కోణానికి భిన్నమైన (జాతిపరమైన) అర్ధం ఇచ్చేలా హిందుత్వ అనే పదాన్ని సృష్టించినట్టుగా చెప్పుకున్నాడు. ఐతే 1925లో స్థాపించబడిన ఆరెస్సెస్, ఆ తదుపరి 1951లో ప్రారంభించబడిన జనసంఘ్, 1980లో ప్రారంభించబడిన భారతీయ జనతా పార్టీ లాంటి దాని రాజకీయ అనుబంధ సంస్థలు సావర్కర్ కీ, అతని హిందుత్వ భావజాలానికీ ఏ విధంగా ఆకర్షించబడ్డాయనే ప్రశ్న వేసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

బిజెపి వారు చెప్తున్నట్టు సావర్కర్ తో వారి అనుబంధం ప్రారంభంలో అయితే  లేదు. అదంతా తర్వాత కాలంలో (కాలం తెచ్చిన సంక్షోభం కారణంగా) అవకాశవాద రాజకీయాల కోసం జరిగిందే. 1980లో జనసంఘ్ ఆరెస్సెస్ తో, జనతా పార్టీతో ఏక కాలంలో ద్వంద్వ సభ్యత్వం కలిగి ఉండటం వివాదాస్పదం కావటంతో జనసంఘ్ జనతా పార్టీ నుంచి వైదొలగి భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. అలా ఏర్పడిన భాజపా సావర్కర్ హిందూత్వకి విరుద్ధమైన రెండు భావనలతో మొదలైంది. అందులో ఒకటేమో భారతీయ జనతా పార్టీ అనే పేరు. అలంటి పేరు పెట్టుకోవటంలో జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీ ఇదే అని అందరిని మభ్యపెట్టే పన్నాగం ఇమిడివుంది. ఇంకొకటేమో (గాంధేయ సోషలిస్టు రామ్ మనోహర్ లోహియాను అనుకరించేలా) గాంధేయ సోషలిజాన్ని ఎంచుకోవడం. ఈ వివరాలనుబట్టి 1977 (జనతా పార్టీ ఆవిర్భావం) నుండి 1987 వరకు దశాబ్దకాలంపాటు (వాజ్ పాయ్ ప్రతిపాదించిన) గాంధేయ సోషలిజాన్ని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ‘‘ఏకాత్మతా మానవతావాదాన్ని’’ (Integral humanism) కలగలిపిన ఊసరవెల్లి రాజకీయాలను అనుసరించింది తప్ప అప్పటికి ఇంకా హిందూత్వని ఎంచుకోలేదు. 1989-90ల్లో (కల్లోల కాల సంక్షోభంతో) మాత్రమే హిందుత్వని తమ భావజాలంగా స్వీకరించింది. 1989 జూన్ 11న ఎన్నికలకి ఒకరోజు ముందు బాబ్రీ మసీదుని స్వాధీనపరచుకోవడమనే లక్ష్యంతో పాలంపూర్ తీర్మానం చేసారు. 1990 సెప్టెంబర్ 25న ఎల్.కే.అద్వానీ తన రథయాత్రని ప్రారంభించారు. ఐతే అద్వానీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది మాత్రం 2002 మే 4న అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ లో మాత్రమే. సావర్కర్  హిందుత్వని తమ భావజాలంగా ప్రకటించుకోవడంలో ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం ద్వారా తన గురువుగా సావర్కర్ లాంటి ఓ వినాశకరమైన వ్యక్తిని పరోక్షంగా అంగీకరించాడు. 1998 ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రమే బిజెపి హిందుత్వని పూర్తిగా స్వీకరించింది. భారతీయ అస్తిత్వంలో శ్రీరాముడు ఒక ముఖ్య భాగమని (జైహింద్ తో జై శ్రీరామ్ నినాదాన్ని జోడించి) తనది హిందూత్వ సాంస్కృతిక జాతీయవాదమని ప్రకటించింది. 1996 లో కూడా ఇంత స్పష్టత బిజెపి నుంచి లేదు. అద్వానీకి ఆ భావజాలాన్ని స్వీకరించడానికి అంత సమయం ఎందుకు పట్టిందో పరిశీలించటం అవసరం.

స్వాతంత్ర్య సమరయోధులెవరూ స్వాతంత్ర్యోద్యమంలో సావర్కర్ పాత్రని ఎక్కడా (ఉదాహరణకు భగత్ సింగ్ లాగా) ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. సంఘ్ హీరో సావర్కర్ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఎప్పుడైనా భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకి ఆహ్వానించబడ్డాడా అని ప్రశ్నించుకుంటే లేదనే చెప్పాలి. స్వాతంత్ర్య సమరయోధుడిగా  లాలా లజపతిరాయ్ కాంగ్రెస్, హిందూ మహాసభ రెండింట్లోనూ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పాండిత్యం సావర్కర్ తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటుంది.  లజపతిరాయ్ 1918లో  రాసిన ‘‘జాతీయ విద్యా విధానం సమస్య’’ (The problem of national education) పుస్తకంలో ‘‘ఆధునిక భారతీయులు ఓ ఠాగూర్, రాయ్, హరిశ్చంద్రలని చూసి ఎలా గర్వపడతారో అలాగే ఓ హాలీ, ఇక్బాల్, మొహానీల విషయంలో కూడా గర్వించొచ్చు అంటారు. రామ్మోహన్ రాయ్, దయానందలని ఎంత గౌరవించగలమో సయ్యద్అహ్మద్ ఖాన్ ని కూడా అంతే గౌరవించగలం. చదువుకున్న హిందువులు తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ లాంటి కట్టడాలని భారతీయ శిల్పకళా వైభవంగానే భావిస్తారు గానీ ముస్లింలకి చెందినదిగా కాదు’’ అని రాసినట్లు స్కాలర్ వన్యా వైదేహి భార్గవ్ చెబుతారు.

1883 మే 28 న జన్మించిన సావర్కర్ భారత జాతీయవాదిగా తన ప్రస్థానం ఆరంభించి హిందూ జాతీయవాదిగా ముగించాడు. ఆయన రాసిన మొదటి పుస్తకం “ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం- 1857” (The First Indian war of independence 1857) లో ఏవిధమైన పరమత విద్వేషం లేదు. ఇందులో ఓచోట “స్వధర్మ,స్వరాజ్యం అత్యున్నతమైన భావనలు. ఇవి ప్రమాదంలో పడినప్పుడు ఢిల్లీలోని మసీదు నుంచి మార్మోగే మౌల్వీలూ, బెనారస్ లోని గుడినుండి బ్రాహ్మణులు పఠించే మంత్రోచ్ఛరణలే ఈ దేశాన్ని రక్షిస్తున్నాయి” అని రాసారు. ఈ పుస్తకంలో సావర్కర్ హిందూస్థాన్ అనే పదాన్ని మహమ్మద్ ఇక్బాల్ సుప్రసిద్ధ “సారే జహాసే అచ్ఛా హిందూస్థాన్ హమారా” గేయంలో వాడిన (ప్రపంచంలోకెల్లా మా హిందూస్థాన్ గొప్పది) అని అర్థం ధ్వనించే విధంగానే వాడారు కూడా.

అంతేకాదు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ని పొగుడుతూ “ఆ దేశభక్త మౌల్వీ అహ్మద్ షా మరణవార్త బ్రిటిష్ వారికి చేరగానే తమ శత్రువుల్లో అత్యంత కఠినుడైన వ్యక్తి మరణించినందుకు ఊపిరి పీల్చుకున్నారు” అని రాశాడు. థామస్ రైస్ హోమ్స్ రాసిన “ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ” పుస్తకంలోని సోర్సెస్ ని ఇక్కడ ఉదహరించారు. హైదర్ ఆలీ,టిప్పు సుల్తాన్ లని కూడా ప్రశంసించారు‌. ఈ పుస్తకంలోని 13,14 పేజీల్లో “దేశ స్వాతంత్య్రానికి వచ్చిన ముప్పును ముందుగా పూనా నానా ఫడ్నవిస్,మైసూర్ హైదర్ సాహిబ్ లు పసిగట్టారు” అని రాశాడు.

“ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం- 1857” అనే పుస్తకం రాసిన సావర్కర్ తన మత, సాంస్కృతిక పరమైన వారసత్వాన్నీ,మహారాష్ట్ర చరిత్రనీ గుండెలో నింపుకున్నపటికి, ప్రాంతీయ అస్తిత్వాలని జాతీయంగా ఏకం చేయాలనే (అఖండ భారత్, ఏక్తా భారత్) ఏకాత్మత ఆశయం అప్పటికే ఆయనలో గూడుకట్టుకొని ఉన్నట్టు అర్థమౌతుంది. అందులో అయోధ్య(రామజన్మభూమి)గురించి కూడా ఓ అధ్యాయం ఉంది ఐతే అందులో ఆయన రాజకీయ వారసులు ఉపయోగించుకున్న (జైశ్రీరామ్) భావాలేమీ లేవు.  ఆ పుస్తకం మొత్తం భారత జాతీయ సమైక్యత గురించి మాత్రమే రాయబడింది. అందులో ఇంకా ఇలాఉంది – హిందూ, ముస్లింల మధ్య ఉన్న విద్వేష భావాన్ని గతంలోకి వదిలేయాలి. ఇప్పుడు వారు పాలకులు-పాలితులుగా కాక అన్నదమ్ముల్లా మెలగాలి. ఒక్క మతపరమైన తేడా తప్పిస్తే ఇద్దరూ వేరే పేర్లతో ఉన్న ఒకే తల్లి బిడ్డలు,హిందూస్థాన్ ముద్దుబిడ్డలు. 1857 లో కూడా నానా సాహిబ్, బహదూర్ షా,మౌల్వీ అహ్మద్ షా,ఖాన్ బహదూర్ ఖాన్ లాంటి పాలకులు కూడా హిందూ,ముస్లిం విభేదాలు పక్కనపెట్టి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నానా సాహిబ్,అజీముల్లా కూడా దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారతీయ పాలకుల పరిపాలనలోనే ఉండాలని భావించారు”.

హిందూ,ముస్లిం ఐక్యతకి సంబంధించిన అంశాలపై సావర్కర్ ఈ పుస్తకంలో. “ఈ ఐదు రోజులూ హిందూస్థాన్ చరిత్రలో మరువలేని రోజులుగా మిగిలిపోతాయి. హిందూ,ముస్లింలు కలసికట్టుగా అన్నాదమ్ముల్లా పోరాడే తెలివి తెచ్చుకున్నారు‌. శివాజీ,ప్రతాప్ సింగ్, ప్రతాపాదిత్య, గురుగోబింద్ లాంటి  ముస్లింపాలకుల నుంచి విముక్తి కోసం పోరాడిన లౌకికత్వంతో ఈ రోజు నుంచీ మీరిద్దరూ సోదరభావంతో మెలగాలనే ఆదేశాన్నిచ్చింది భారతమాత.  ఆ ఐదు రోజులూ ఢిల్లీలో హిందువులూ,ముస్లిములూ ఇండియా తమ స్వరాజ్యమనీ,తామంతా సోదరులమనీ బిగ్గరగా నినాదాలు చేసారు. ఇవి హిందూస్థాన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజులు” (పేజీ 99-100). “బహదూర్ షా సింహాసనాన్ని అధిష్టించడం ద్వారా హిందువులు,ముస్లింల మధ్య ఎప్పట్నుంచో కొనసాగుతోన్న యుద్ధం ముగిసింది. ఇక హిందువులూ,ముస్లింలు ఇరువురూ కలిసి 1857 మే 11 న మన చక్రవర్తిని ఆహ్వానిస్తూ జయజయధ్వానాలు పలకడానికి సిద్ధంగా ఉండాలి” (పేజీ 225-26). కేవలం ముస్లిం పాలకులనే కాదు సావర్కర్ ప్రజలని కూడా ప్రశంశిస్తూ. “పట్టణంలో ఉన్న ముస్లిం జనాభాలో అందరూ తమ దేశం కోసం పోరాడడానికి మతాన్ని సైతం లెక్కచేయకుండా ముల్లాల పిలుపు కోసం ఎదురుచూడసాగారు” అని రాశాడు.

సావర్కర్ ఇక్కడ గతం గురించే రాసినా ఆ సమయానికి సరిపోయేటువంటి హెచ్చరికలూ చేసారు. బ్రిటిష్ పాలకులు (తమ విభజించి పాలించే విధానంతో) హిందువులు,ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లాభపడాలని చూస్తారని కూడా చెప్పారు.  ఆ దృక్కోణంలో “ముస్లింలారా మీరు గనక గోమాతనీ,హిందువులనీ గౌరవిస్తున్నట్లైతే విభేదాలని పక్కనపెట్టి ఇండియా నుంచి బ్రిటిషర్లని తరిమేసే ఈ యుద్ధంలో పాలు పంచుకోండి. ఈ యుద్ధంలో ముస్లింలతోపాటు హిందువులు కూడా పాల్గొనాలంటే వారి దేశభక్తికి బహుమానంగా గోవులని చంపటం ఆపివేయబడుతుందని  అని హామీ ఇవ్వండి” అని రాశాడు (పేజీ 140-41). ఐతే ఆనాటి సావర్కర్ అభిప్రాయాలతో బిజెపి ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం.

విచ్చిన్నకర విభిన్న ‘చరిత్ర’:
తన చివరి రోజుల్లో మాత్రం సావర్కర్ ఇంకో చరిత్రని లిఖించాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే భావనకి ప్రాధాన్యం కల్పిస్తూ టిప్పు సుల్తాన్ ని మహా క్రూరుడిగా చిత్రీకరించాడు.

1910 జులై 8 న సావర్కర్ ఎస్‌.ఎస్.మోరియా ఓడ నుంచి తప్పించుకోవడం ‘ఆయన ఫ్రెంచి గడ్డపై’ అడుగుపెట్టగానే పట్టుబడడం ఆయన్నొక యోధుడిగా మార్చివేసింది‌. జులై 22 న ఆయన్ని ముంబైకి తీసుకొచ్చి బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ బాసిల్ స్కాట్,చంద్రావర్కర్,జాన్ హీటన్ ట్రైబ్యునల్ ముందు హాజరుపరిచారు‌. డిఫెన్స్ టీముకి జోసెఫ్ బాప్టిస్టా నేతృత్వం వహించారు. మొత్తం మూడు విచారణలు జరిగాయి.  మొదటి విచారణ సెప్టెంబర్ 15,1910 న జరిగింది‌. ఇందులో సావర్కర్ తో పాటూ 38 మంది నిందితులుగా ఉన్నారు. రెండో విచారణలో గోపాల్ రావు పట్నాకర్ అనే ఇంకొకతనితో కలిసి,మూడో విచారణలో సావర్కర్ ఒక్కరే నిందితుడిగా ఉన్నారు‌.

69 రోజులు జరిగిన విచారణలో 1910 డిసెంబర్ 24 న సావర్కర్ ఆస్తులన్నీ జప్తు చేసి జీవితఖైదు శిక్ష విధించింది కోర్టు. 1911 జనవరి 23 న ఎ.ఎమ్.టి. జాక్సన్ హత్య కేసు విచారణ మొదలైంది ‌ ఈ కేసులో మరో 50 ఏళ్ల జైలు శిక్ష అండమాన్ దీవుల్లో అనుభవించాల్సిందిగా తీర్పు వచ్చింది. 1911 జులై 4 న సావర్కర్ ని అండమాన్ లోని పోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలుకి తీసుకొచ్చారు. 1966 లో ఆయన చనిపోయారు‌. ఈ మధ్యలో 55 ఏళ్లలో కథ మొత్తం మారింది‌‌. 1948 ఏప్రిల్ 3 న అప్పటి బాంబే హోం మంత్రి మురార్జీ దేశాయ్ “గతంలో చేసిన సేవలని ఇప్పటి ద్రోహాలు చెరిపివేసాయి” అని విధాన సభలో మాట్లాడుతూ అన్నారు.

ఆరు క్షమాపణ లేఖలు.
సావర్కర్ ని 1911 జులై 4 న అండమాన్ కి తీసుకొచ్చారు. ఆరు నెలల వ్యవధిలో బ్రిటిష్ వారిని క్షమాపణ కోరుతూ ఓ లేఖ రాసారు. ఈ లేఖ లభించకపోయినప్పటికీ 1913 లో రాసిన లేఖలో ఈ లేఖ గురించీ ప్రస్తావించారు.
  1. 1913 నవంబర్ 14 న రాసిన పిటిషన్లో “నేను క్షమాభిక్షని అభ్యర్థిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు హింసాయుతమైన కార్యకలాపాలకి తావు లేకుండా న్యాయబద్ధంగా పాలన సాగించెలా ఉన్నాయని నేను గ్రహించాను. కాబట్టి మీరు దయ తలచి నన్ను విడుదల చేస్తే ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అంతేగాక నన్ను తమ గురువుగా భావించిన యువకులందరి నుంచి కూడా మీకు ఎలాంటి ప్రతిఘటనా ఎదురు కాదు. బ్రిటిష్ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ దాసులుగా ఉంటాము. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను కాబట్టి నన్ను విడుదల చేస్తే ప్రభుత్వానికి ఏ విధమైన సేవ కావాలంటే ఆవిధమైనసేవ చేస్తానని విన్నవించుకుంటున్నాను.
  2. 1924 జనవరి 5 న బాంబే ప్రభుత్వం విడుదల ఆర్డరు “1.వినాయక్ దామోదర్ సావర్కర్ అనబడే ఇతను బాంబే ప్రభుత్వ ఆధీనంలోని రత్నగిరి ప్రాంతం దాటి ప్రభుత్వ అనుమతి లేకుండా గానీ,డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కి తెలీకుండా గానీ వెళ్లకూడదు‌‌. ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ ఐదేళ్ల పాటూ ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.

సావర్కర్ అప్పటికే ఈ షరతులకి ఒప్పుకున్న మీదటనే విడుదల చేయడం జరిగింది. అంతే కాక తాను అంతకుముందు అవలంబించిన హింసాత్మక విధానాల పట్ల పశ్చాత్తాపం పొందాననీ,ప్రభుత్వ చట్టాలపై గౌరవంతో నడుచుకుంటూ ఇకపై బాధ్యతాయుత పౌరుడిగా మెలుగుతానని కూడా ఒప్పుకున్నారు. (సావర్కర్ మరియు గాంధీ,ఫ్రంట్ లైన్ మార్చి 28,2003).

  1. 1948 జనవరి 30 న గాంధీ హత్య చేయబడిన తర్వాత ఫిబ్రవరి 22 వ తేదీన పోలీసు కమిషనర్ కి ఇచ్చిన లేఖ. “నా మీద ఉన్న అన్ని అనుమానాలని నివృత్తి చేయడానికి ప్రభుత్వం నాకు అప్పగించే ఏ బాధ్యతనైనా నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాక నన్ను విడుదల చేస్తే ఏ విధమైన రాజకీయ,మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొననని కూడా తెలియజేసుకుంటున్నాను.
  2. 1950 ఏప్రిల్ 4 న సావర్కర్ తో పాటు కొంతమంది హిందూ మహాసభ నాయకుల్ని అరెస్ట్ చేసారు. ఏప్రిల్ 26 న తనని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా కోరుతూ రాసిన లేఖలో “షరతులు లేకుండా నా విడుదలకి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే నేను ఏవిధమైన రాజకీయ పోరాటాల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి వరకూ పాల్గొనననే షరతుపైనైనా విడుదల చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇప్పటికే రాజకీయాల నుంచి రిటైర్ కావాలని నిర్ణయం తీసుకున్న విషయం జనాలందరికీ తెలిసిందే’’.

బాంబే హైకోర్టు సావర్కర్ ప్రతిపాదనని నిరాకరించింది. సావర్కర్ కొడుకు విశ్వాస్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసారు. చీఫ్ జస్టిస్ ఎం.సి.ఛాగ్లా,జస్టిస్ పి.సి,గజేంద్రగడ్కర్,అడ్వకేట్ జనరల్ సి.కె‌.దప్తరీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. జులై 13 న సావర్కర్ ని బాంబేలోని తన ఇంట్లోనే ఉంటూ,ఓ సంవత్సరం దాకా(లేదా ఇండియాలో ఏదైనా యుద్ధం మొదలయ్యే దాకా) ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదనే షరతుపై విడుదల చేసింది‌. 1950 జులై 20 న తనపై ఉన్న ఆంక్షల కారణంగా సావర్కర్ తన హిందూ మహాసభ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించాడు.

  1. 1939 అక్టోబరు 9 న సావర్కర్ ఇండియా వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ని కలిసి బ్రిటిష్ వారితో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. లార్డ్ లిన్లిత్గో తరవాత లార్డ్ జెట్లాండ్ కి పంపిన రిపోర్టులో “సావర్కర్ చెప్పిన ప్రకారం బ్రిటిష్ వారు హిందువులతో వైరం పెంచుకోకూడదు. వారిరువురి లక్ష్యాలూ,ఉమ్మడి ప్రయోజనాలూ ఒకటే కాబట్టి గతంలో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి హిందువులు,బ్రిటిష్ వారితో కలిసి పనిచేస్తే బాగుంటుంది” అని పేర్కొన్నారు.

మొత్తం మానవజాతి చరిత్రలో శతృదేశానికి మోకరిల్లేలా ఉన్న  ఇంతకన్నా హేయమైన క్షమాపణ గురించి ఎక్కడైనా విన్నారా?. ఇన్నిసార్లు బతిమిలాడుకోవడం ఎప్పుడైనా చూసారా?.

నాలుగు హత్యలు.
సావర్కర్ తుపాకీ తన చేత్తో పట్టుకోలేదు. తన అనుచరుడిచేత్తోపట్టించారు.
  1. 1909 లో లండన్ లోని ఇండియా ఆఫీసులో పనిచేసే కల్నల్ సర్ విలియమ్ కర్జన్ వైలీ ని జులై 1 రాత్రి సావర్కర్ అనుచరుడు మదన్ లాల్ దింగ్రా అనే వ్యక్తి చంపాడు‌. వైలీని కాపాడటానికి ప్రయత్నించిన డాక్టర్ కవాస్ లల్కాకా ని కూడా చంపాడు. సావర్కర్ చనిపోయిన తర్వాత రచయిత ధనుంజయ్ కీర్, “ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ మహాత్మా గాంధీ” పుస్తక రచయిత రాబర్ట్ పేన్ తో ఇలా చెప్పారు. “1909 లోనే తన అనుచరుడితో చెప్పి కర్జన్ వైలీని చంపించేంత దారుణానికి సావర్కర్ ఒడిగట్టాడు‌. మదన్ లాల్ కి తుపాకీ ఇచ్చి శత్రువుని చంపకపోతే నీ మొహం కూడా నాకు చూపించకు అని తానే రెచ్చగొట్టి మరీ హత్య చేయించాడు. ఈ హత్యా తను చేయించినట్లు సావర్కర్ నాతో ఒప్పుకున్నారు’’. ఐతే ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో లండన్ పోలీసులు సావర్కర్ ని అరెస్ట్ చేయలేకపోయారు. కానీ నాసిక్ కుట్రకేసు విచారణలో జాక్సన్ ని హత్య చేసినందుకు గానూ సావర్కర్ కి జీవితఖైదు శిక్ష విధించబడింది.

2.1909లోనే నాసిక్ జిల్లా కలెక్టరు ఎ.ఎం.టి. జాక్సన్ ని ఓ థియేటర్ దగ్గర అనంత్ కన్హేరే అనే హంతకుడు కాల్చి చంపాడు. ఐతే ఈ కేసులో సావర్కర్ సోదరుడు గణేష్ సావర్కర్ విచారణని ఎదుర్కోలేదు. డాక్టర్ ఎం.ఆర్. జయకర్ ఈ కేసు గురించి మాట్లాడుతూ “కలెక్టర్ జాక్సన్ సంస్కృత భాషాభిమాని,భారతీయ సంస్కృతి అన్నా,జనాలన్నా చాలా అభిమానం చూపించేవారు” అని పేర్కొన్నారు‌.

  1. 1931 జులై 22 న పూనాలోని ఫెర్గ్యుసన్ కాలేజీకి తాత్కాలిక గవర్నర్ ఎర్నెస్ట్ హాట్సన్ వచ్చినప్పుడు వసుదేవ్ బల్వంత్ దేవ్ గోగాటే అనే విద్యార్థి ఆయనపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐతే ఈ ఘటనలో ఎర్నెస్ట్ హాట్సన్ గారు ప్రాణాలతో బయటపడ్డారు. తన పుస్తకం రెండో ఎడిషన్లో ధనంజయ్ కీర్ “సావర్కర్ కి గోగాటే వీరాభిమాని అనీ,హాట్సన్ పై కాల్పులు జరిపిన కొద్ది రోజుల ముందే రత్నగిరిలో సావర్కర్ ని గోగాటే కలిసాడని” వివరించారు.

కాంగ్రెస్ నేత,బాంబే ప్రెసిడెన్సీ హోం మినిస్టర్ కె.ఎం.మున్షి కి ఆరెస్సెస్ తో,హిందూ మహాసభతో సత్సంబంధాలు ఉన్నాయి‌. ఆయన గోగాటే గురించి మాట్లాడుతూ “సావర్కర్ శిష్యుడైన గోగాటే అనే ఓ విద్యార్థి విడుదల విషయంలో గవర్నర్ కి ఇష్టం లేకపోయినా నా డిమాండ్ కి ఒప్పుకున్నారు‌‌. గవర్నర్ బ్రాబోర్న్ సాక్షాత్తూ గవర్నర్ పైనే హత్యా ప్రయత్నం చేయడం చాలా తీవ్రమైన విషయంగా పరిగణించారు. ఐతే నేను వెంటనే నాకు మంచి మిత్రుడైన ఎర్నెస్ట్ హాట్సన్ కి లేఖ రాసి గోగాటేని విడుదల చేయాల్సిందిగా కోరాను”. విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మున్షీ ఇంత చొరవ తీసుకుని గోగాటే విడుదల కోసం ప్రయత్నించడంలో మరి ఆశ్చర్యమేమీ లేదు,ముస్లిం టెర్రరిస్టుల విషయంలో ఆయన నుంచి అలాంటి స్పందన ఆశించలేము.

  1. 1948 లో గాంధీ హత్య.
    హిందూ మహాసభ సభ్యుడు పి.ఎల్.ఇనామ్దార్ తన “ది స్టోరీ ఆఫ్ ది రెడ్ ఫోర్ట్ ట్రయల్ 1948-49” పుస్తకంలో సావర్కర్,అతని పట్ల సానుకూలంగా వ్యవహరించిన జడ్జి గురించి ఇలా రాసుకున్నారు “విచారణ జరిగినంత కాలం సావర్కర్ తన పక్కనే కూర్చున్న నాథూరామ్ ముఖం వైపు కూడా చూడలేదు. మిగతా నిందితులంతా తమలో తాము సంభాషించుకుంటూ ఉన్నా సావర్కర్ మాత్రం అవేం పట్టినట్టు వ్యవహరించాడు”.

నాథూరామ్ తో నేను మాట్లాడిన ప్రతిసారీ అతను ఈ విషయం గురించి చాలా బాధపడ్డాడు. సావర్కర్ తనవైపు కనీసం చూడడం కూడా చేయకపోవడంతో ఆ జైలు గోడల మధ్య తనెంతో ఒంటరితనం అనుభవించినట్టు నేను చివరిసారి సిమ్లా హైకోర్టులో అతన్ని కలిసినప్పుడు కూడా అతను చెప్పాడు.

1948 సెప్టెంబర్ రెండో వారంలో నా సీనియర్ భోపాత్కర్ తో నన్ను కలవాలని ఉందని సావర్కర్ సమాచారం పంపించారు. జైలులో నన్ను కలవడానికి  కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నారు.

నేను ఆయన రాగానే కాళ్లకి నమస్కరించాను. సావర్కర్ కూర్చొని “ఇనామ్ దార్ గారూ, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది” అన్నారు. తర్వాత తను వచ్చిన పనేంటో వివరించే క్రమంలో తనకి విచారణ సందర్బంగా నాతీరు  ఎంతగానో నచ్చిందని చెప్పారు. తనకి ఓ విషయంలో నా సహాయం కావాలని కూడా అడిగారు‌.

నేను తప్పకుండా చేస్తానని ఆయనతో చెప్పాను. సుమారు మూడు గంటల పాటూ కేసు గురించి నాతో చర్చించారు. సావర్కర్ కి న్యాయ సంబంధ విషయాలపై అపారమైన జ్ఞానం ఉంది. ఐతే ఆయన కేవలం తనపై కేసు గురించి మాత్రమే మాట్లాడారు. నా క్లయింట్స్ ఐన డాక్టర్ పర్చూరే,గోపాల్ గాడ్సే,నాథూరామ్ లాంటి వాళ్లకి సంబంధించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు‌. తిరిగి ఆయన వెళ్లేటప్పుడు మరొకసారి ఆయన కాళ్లకి నమస్కరించాను.

1949 జనవరి 10 న తీర్పు వెలువడింది. నాథూరామ్,ఆప్టేలకి ఉరి శిక్ష,కర్కరే,మదన్ లాల్,శంకర్ కిష్టయ్య,గోపాల్ గాడ్సే,డాక్టర్ పర్చూరే కి జీవితఖైదు విధించింది కోర్టు. ఐతే ఈ రోజుకీ సావర్కర్ ని నిర్దోషిగా ప్రకటించిన విషయం ఆత్మా చరణ్ ఎప్పుడు,ఎలా చదివాడన్నది మాత్రం నాకు గుర్తు లేదు. నేను ఆత్మా చరణ్ కళ్లలోకి చూస్తూ అనుకున్నా ఈ ఆత్మా చరణ్ “మీరు కేసుకి పూర్తి న్యాయం చేస్తానని వాగ్దానం చేసిన ఆత్మా చరణ్” ఒక్కరేనా అని!

ఇనామ్దార్ కి సంబంధించినంత వరకూ సావర్కర్ ని నిర్దోషిగా ప్రకటించడం చాలా తప్పు. 2019 మే 31 న ఎన్నికల ఫలితాలు వెలువడిన కాసేపటికి నరేంద్ర మోడీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఎవరూ కూడా సెక్యులరిజం అనే మాట కూడా వాడలేదని అన్నారు.

గత పదిహేను రోజులుగా ఈ దేశయువత మొత్తం అదే సెక్యులరిజానికి మద్దతుగా చేసిన నిరసనలు ఆయన లాంటి రాజకీయ నాయకులకి ఓ గుణపాఠం అవ్వాలి. సెక్యులరిజం నశించిపోలేదు, గాంధీజీ మరణం వృధా కాలేదు. అలాగే నెహ్రూ కృషి కూడా. వారు ప్రవచించిన సెక్యులరిజం దేశం అంతటా మళ్లీ పుంజుకుంటోంది.

ఆరెస్సెస్,బిజెపి గాంధేయవాదాన్ని ఆచరిస్తున్నట్టు నటిస్తున్నాయి. అద్వానీ గాంధీ చిత్రపటం ముందు ఆయన్ని చంపటానికి కుట్ర పన్నిన సావర్కర్ చిత్రాన్ని ఉంచారు. ఇప్పుడిక హిందుత్వ చివరి దశలో కొట్టుమిట్టాడుతోంది. సెక్యులరిజం కోసం పోరాటం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది. లౌకికవాద కాగడా నేడిప్పుడు వారిచేతిలో ధగధగాలడుతుంది.

సావర్కర్ సంబంధంపై మరిన్ని సాక్ష్యాలు
గాంధీ హత్య కేసులో వి.డి,సావర్కర్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తి అప్రూవర్ గా మారిన దిగంబర్ బడ్గే. సావర్కర్ ఇంటికి వెళ్లానని ఆయన చెప్పిన వివరాలని ఇంకో ఇద్దరు సాక్షులు కూడా బలపరిచారు. జడ్జి ఆత్మా చరణ్ కి కూడా బడ్గే నిజం మాత్రమే చెబుతున్నాడని అనిపించింది‌. పంజాబ్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దిగంబర్ వర్షన్ ని బలపరిచే సాక్ష్యాలు కూడా లభించాయి. కానీ 1948 జనవరి 14 నుంచి 17 వరకూ నాథూరామ్ గాడ్సే,అతని అనుచరుడు నారాయణ్ ఆప్టే సావర్కర్ ఇంటికి వచ్చారా,లేదా అనే విషయంపై 6న బంధ సాక్ష్యాలు కోర్టులో ప్రవేశాపట్టలేదు.  రెండోసారి సావర్కర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన గాడ్సే,ఆప్టేలతో “విజయం సాధించి,తిరిగిరండి” అనడం దిగంబర్ విన్నాడు‌. ఐతే ఆ ఇద్దరు సాక్షులు మాత్రం తాము సావర్కర్ ఇంటి ముందు మాత్రమే దిగామని,ఇంటి లోపల ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని చూసామని చెప్పారు. చట్టప్రకారం అప్రూవర్ చెప్పే సాక్ష్యాలని స్వతంత్ర సాక్ష్యులు బలపరచనందువల్ల సావర్కర్ ని 1872,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 133 ఆధారంగా నిర్దోషిగా ప్రకటించారు.

సావర్కర్ చనిపోయిన ఓ రెండేళ్లకి అతని అంగరక్షకుడు రామచంద్ర కసార్ ఆప్టే,సెక్రెటరీ గజానన్ విష్ణు దామ్లే కపూర్ కమిషన్ ముందు పై ప్రాతిపదికలోపాన్ని ఈ వెర్షన్ లో ఉన్న ఉన్న లూప్ హోల్స్ ని ఎత్తిచూపారు. “ఇద్దరు సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం బాంబేలోని సావర్కర్ ఇంటికి ఆప్టే,గాడ్సే పలుసార్లు వచ్చారని తెలుస్తోంది. కర్కారే కూడా సావర్కర్ కి చాలా బాగా తెలుసనీ,ఆయన ఇంటికి క్రమం తప్పకుండా వెళ్లేవాడు. బడ్గే,డాక్టర్ పర్చూరే కూడా సావర్కర్ ని సంప్రదించేవారు”. ఇదంతా గమనిస్తే గాంధీ హత్యలో ప్రధాన నిందితులంతా బాంబేలోని సావర్కర్ సదన్లో ముందస్తుగానే కలిసి సావర్కర్ తో చర్చించినట్టుగా అర్థమౌతుంది. కర్కారే,మదన్ లాల్ కూడా ఢిల్లీ వెళ్లే ముందు సావర్కర్ ని కలిసారు. గాంధీని హత్య చేసే ముందు కూడా సావర్కర్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు గాడ్సే మరియు ఆప్టే. 1946 నుంచి 1948 వరకూ సావర్కర్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పబ్లిక్ సమావేశాలలో కూడా వీరిద్దరూ ఆయనతోనే ఉన్నారు, 6వ కమీషన్ నమోదు చేసింది. వీరు గనక కోర్టులో సాక్ష్యం చెప్పి ఉంటే సావర్కర్ కి శిక్ష పడి ఉండేది. 1948 జనవరి 14 నుంచి 17 వరకూ సావర్కర్ ఇంటికి గాడ్సే,ఆప్టే వెళ్లారనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. సావర్కర్ అంగరక్షకుడు కసార్ జనవరి 23,24 తేదీల్లో గాడ్సే ఆప్టేలు బాబు పేలుడు ఉందనటం తరువాత సావర్కర్ ని కలిసినట్టుగా చెప్పారు. సావర్కర్ సెక్రెటరీ దామ్లే కూడా జనవరి మధ్య కాలంలో గాడ్సే,ఆప్టే సావర్కర్ ఇంటి తోటలో గార్డెన్లో ముచ్చటిస్తుండగా చూసినట్టు చెప్పారు.

బాంబే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జంషెడ్ నగర్వాలా తన క్రైమ్ రిపోర్టులో “ఈ కుట్రలో సావర్కర్ హస్తం ఉంది,అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా అతను నటించాడు” అని పేర్కొన్నారు. 1948 జనవరి 31 న అంటే గాంధీజీ హత్య జరిగిన తర్వాత రోజు నగర్వాలా రాసిన లేఖలో ఢిల్లీకి వెళ్లే ముందు గాడ్సే,ఆప్టే సావర్కర్ ని కలిసి నలభై నిమిషాలు చర్చించినట్లుగా కూడా తన రిపోర్ట్ లో రాసారు. కసార్,దామ్లే తనకి చెప్పిన వివరాల ప్రకారం గాడ్సే,ఆప్టే ఇద్దరికీ సావర్కర్ ఇంటికి వెళ్లడం ఓ దినచర్య లాంటిదని తనకి అర్థమైనట్టు రాసారు. బడ్గే లేకుండా కూడా ఓసారి గాడ్సే,ఆప్టే సావర్కర్ ని రహస్యంగా కలిసారు. ఐతే వీరిద్దరినీ కోర్టులో సాక్షులుగా ఎందుకు ప్రవేశపెట్టలేదనే విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలిపోయింది.

1948 ఫిబ్రవరి 27 న వల్లభభాయ్ పటేల్ నెహ్రూకి రాసిన లేఖలో “గాంధీజీ హత్య కేసుకి సంబంధించిన పరిణామాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. సావర్కర్ నేతృత్వంలోనే హిందూ మహా సభలోని ఓ అతివాద మూక గాంధీజీ హత్యకి కుట్ర పన్నింది” అని రాసారు. హిందూ మహాసభ సభ్యుడు పి.ఎల్.ఇనామ్దార్ తన వాదన పట్టికను ఉపయోగించి గాంధీజీ హత్య కేసులో ఓ కుట్రదారుడైన డాక్టర్ డి.ఎస్,పర్చూరేని విడుదల చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించడం కూడా ఈ వాదనకి బలం చేకూరుస్తోంది. ఇనర్ధర్ ‘ప్రతిభ “ దఫ్తారీ జుడ్జి అత్మచరణ్ సావర్కర్ల మొప్పు పొందింది.

    17 జనవరి 2020 ఫ్రంట్‌లైన్‌ సౌజన్యంతో

RELATED ARTICLES

Latest Updates