- వేర్వేరు చోట్ల నలుగురు రైతుల మృతి
- అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం
- కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం
ఈఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి.. పంటలు బాగా పండాయి అనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట చేతికొచ్చే సమయాల్లో అకాల వర్షాలు అన్నదాతలను తీరని వేదనకు గురి చేస్తున్నాయి. వరి నేలవాలడంతో పాటు గింజ రాలిపోవడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వాన నీటిలో కొట్టుకుపోగా కొన్ని చోట్ల తడిసిపోయింది. ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు రైతులు మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2791 ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 613 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో 270 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలోని ఐదు మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉండటంతో వరి చేళ్లలో నీళ్లు నిలిచాయి. మెదక్ జిల్లా పరిధిలో వెల్దుర్తి, టేక్మాల్, చేగుంట మండలాల్లో వాన కురిసింది. దీంతో జిల్లాలో 1,534 క్వింటాళ్ల మేర ధాన్యం తడిసిందని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలో ఈదురుగాలులతో 150 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్ యార్డు ఆవరణలో 2 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నాగల్గిద్ద మండలం గౌడ్గామ్జనవాడలో వడగళ్ల వర్షానికి జొన్న, ఉల్లి, తెల్లకుసుమల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుమురం భీం జిల్లాలోని కాగజ్నగర్, పెంచికల్పేట, బెజ్జూరు, ఆసిఫాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా పంటపొలాల్లోనే ధాన్యం నేల రాలింది. కొన్ని చోట్ల కల్లాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసింది.
పిడుగులు పడి..
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు. వీరిలో ఓ మహిళారైతు ఉన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం కలాన్కు చెందిన కుర్మ లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. కోత దశకు వచ్చిన పంటకు కాపలాగా వారం రోజుల నుంచి కుటుంబంతో చేను వద్దే తాత్కాలికంగా గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో వారి గుడిసెపై పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మెట్టుమర్రి తండాకు చెందిన కేతావత్ పంతులు, ఆయన భార్య షీలా(42) వర్షం పడుతుండడంతో పొలం నుంచి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పిడుగుపడి ఆమె మృతిచెందింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్కు చెందిన మట్టా బుచ్చిరెడ్డి(35) పొలం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టాడు. తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం వస్తుండటంతో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ కవర్ తీసుకెళ్లి కప్పేందుకు ప్రయత్నిస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలోని ధాన్యం కోనుగోలు కేంద్రంలో వర్షం పడుతుండడంతో ధాన్యం కుప్పలు తడవకుండా ఉండేందుకు రైతు పల్లె శ్రీనివాస్(49) టార్పలిన్ కవర్ కప్పుతుండగా పిడుగుపడి మృతిచెందాడు.
నేడు, రేపు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: తమిళనాడు నుంచి మరఠ్వాడ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని 75 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న జిల్లా అవునూరులో 2.5, మల్లారంలో 2, నామాపూర్లో 1.8, చేగుంట(మెదక్)లో 2.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5 డిగ్రీల వరకు తగ్గడంతో ఎండ తీవ్రత తగ్గింది.
Courtesy Eenadu