హాంగ్కాంగ్ సిటీ: ఆదివారం జరిగిన హాంగ్కాంగ్ స్థానిక ఎన్నికల్లో ప్రొ డెమొక్రసీ శక్తులు విజయం సాధించాయి. హాంగ్కాంగ్ జిల్లా కౌన్సిళ్ల కు చెందిన మొత్తం 452 స్థానాల్లో వెయ్యి మందికిపైగా అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో హాంగ్కాంగ్ ప్రభుత్వ అనుకూల పార్టీల నుంచి 320 మంది పోటీ చేయగా, ప్రొ డెమక్రసీ గ్రూపుల నుంచి 390 మంది తలపడ్డారు. 370 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లగా బరిలోకి దిగారు. మిగతా కొందరు తాము ఏ పార్టీకి చెందనివారమని చెప్పుకున్నారు. కడపటి వార్తలందే సరికి ప్రొ డెమొక్రసీ అభ్యర్థులు 387 స్థానాలను చేజిక్కించుకోగా, ప్రభుత్వ అనుకూల గ్రూపులు 61 స్థానాల్లో గెలుపొందినట్లు హాంగ్కాంగ్కు చెందిన టెలివిజన్ కేబుల్ న్యూస్ చానెల్ వెల్లడించింది. ప్రొ డెమొక్రసీ గ్రూపుల విజయం హింసకు, అరాచకశక్తులకు అనుకూలంగా వచ్చిన తీర్పుగా కొందరు వాదిస్తున్నారు. ప్రొ డెమొక్రాట్లు విజయం అసాధారణమైనదేమీ కాదని, వీరి విజయంతో హాంగ్ కాంగ్లో ఆందోళనలు ఆగిపోతాయని అనుకోలేమని హాంగ్కాంగ్, మకావులపై ప్రత్యేక అధ్యయనం చేసిన చైనీస్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడు తాంగ్ ఫెయి చెప్పారు. అల్లర్లు, అరాచకాలకు స్వస్తి పలకాలని హాంగ్ కాంగ్ ప్రజల ప్రగాఢ ఆకాంక్ష. దీనిని ప్రొ డెమొక్రసీ గ్రూపులు ఏమేరకు పాటిస్తాయన్నదే ప్రశ్న. ఎన్నికైన జిల్లా కౌన్సిల్ సభ్యులు పక్షపాతంతో వ్యవహరిస్తారా? అందరిని కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తారా అన్నది చూడాలి.
Courtesy Prajasakti…