- విదేశాల నుంచి వచ్చిన ఆమెకు కరోనా లక్షణాలు
- 68 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్లోకి..
- మధ్యప్రదేశ్లో నలుగురు ఐఏఎ్సలు సహా
- 89 మంది వైద్య శాఖ సిబ్బందికి కరోనా
- ‘మహా’లో మూడు వేలు దాటిన పాజిటివ్లు
- ముంబైలో 6 రోజుల్లోనే వెయ్యి కేసుల నమోదు
- ఎంపీ, గుజరాత్ రాష్ట్రాల్లో వందేసి కేసులు
- దేశంలో కొత్తగా 826 మందికి కరోనా
- దేశంలో కరోనా కేసులు 12,759.. 420కి చేరిన మృతులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 12,759కి పెరిగింది. ఇందులో 826 కేసులు కొత్తగా నమోదైనవి. మహమ్మారి బారినపడిన మరో 28 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 420కి చేరింది. ఈ వివరాలను గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 165 కేసులు నమోదవడంతో మొత్తం 3,081కు ఎగబాకాయి. తాజా కేసుల్లో 107 ముంబైలోనే బయటపడ్డాయి. దీంతో వాణిజ్య రాజధానిలో మొత్తం కేసులు 2,043కు పెరిగాయి. కేవలం ఆరు రోజుల్లోనే ఈ నగరంలో 1,000 కేసులు వెలుగు చూడడం గమనార్హం. ఈ నెల 11న వెయ్యి మార్కు దాటగా గురువారానికి రెండు వేలకు మించిపోయాయి. ముంబైలోని ధారావి ప్రాంతంలో పరిస్థితి కలవరపరుస్తోంది.
అక్కడ కొత్తగా 26 కేసులు నమోదవగా మొత్తం 86కు పెరిగాయి. మధ్యప్రదేశ్, గుజరాత్లో కూడా వందకు పైబడి కొత్త కేసులను గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రాల్లో కేసులు వరుసగా 1,090; 871కి ఎగబాకాయి. గుజరాత్లో 12 గంటల వ్యవధిలో 105 కేసులను గుర్తించగా వాటిలో 42 అహ్మదాబాద్కు, 35 సూరత్కు చెందినవి. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న 25 ఏళ్ల గర్భిణి మృతిచెందింది. దీంతో 68 వైద్యులు, నర్సులను క్వారంటైన్లోకి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల ఆ మహిళ విదేశాలకు వెళ్లొచ్చింది. హోం క్వారంటైన్లో ఉండాలని ఆమెను అధికారులు ఆదేశించారు.
‘‘ఈ విషయాలను దాచిపెట్టి ఆమె ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె ఆరోగ్యం విషమించగా, వెంటిలేటర్ అమర్చాం. రాత్రి ఆమె మరణించింది’’ అని ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్లో కొత్తగా నమోదైన 25 కేసులతో మొత్తం 1,101కు పెరిగాయి. ఢిల్లీలో 68శాతం కరోనా వైరస్ కేసులు మర్కజ్కు సంబంధించినవేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ‘‘24 గంటల్లో కేవలం 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1,578కి చేరాయి. వీటిలో 1,080 కేసులు (68.4 శాతం) మర్కజ్వే’’ అని వివరించారు. యూపీలో పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బందిపై దాడి చేసే వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎ్సఏ), విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అండమాన్ నికోబార్లో కరోనా సోకిన 11 మందీ కోలుకొన్నారని ప్రధాన కార్యదర్శి చేతన్ సింగ్ తెలిపారు. బహిరంగ, పని ప్రదేశాల్లో జనం ఉమ్మివేయ కూడదని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
ఎంపీలో 89మంది వైద్య సిబ్బందికి కరోనా
ఐదుగురు ఐఏఎస్ అధికారులు, కొందరు వైద్యులు సహా మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖకు చెందిన 89 మంది సిబ్బందికి కరోనా సోకింది. హరియాణాలోని పంచకులలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ తొమ్మిదింటితో హరియాణాలో మొత్తం కేసులు 231కి చేరాయి. కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 315కు చేరింది. గురువారం 36 మందికి వ్యాధి నిర్ధారణైంది.
Courtesy Andhrajyothi