వెయ్యి రూపాయలకే గ్యాస్ స్టవ్, సిలిండర్ అమ్మకం
ఇంట్లో సామాన్లు అమ్మి ఆకలి తీరుస్తున్న వైనం
బిహార్లో నిరుపేద మహిళల దైన్యం
పట్నా: లాక్డౌన్తో పేద మహిళలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఉపాధి బంద్ కావడంతో తిండి గింజులు కరువయిపోవడంతో కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు మహిళలు ప్రయాస పడాల్సి వస్తోంది. బిహార్లోని చాలా ప్రాంతాల్లో పేద మహిళలు ఇంట్లోని సామాన్లను అమ్మేసి కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నారు. పట్నా జిల్లా ఫతుహా బ్లాక్ పరిధిలోని మహిళలు తిండి గింజల కోసం గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు తెగనమ్ముకుంటున్నారు.
కళ్యాణ్పూర్కు చెందిన జమిలా ఖతూన్ అనే మహిళ అనే రెండు నెలల క్రితమే రూ.2300 చెల్లించి గ్యాస్ స్టవ్, సిలిండర్ కొనుక్కుంది. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో ఆరోగ్యం క్షీణించడంతో ఆమె గ్యాస్ స్టవ్ తెచ్చుకుంది. అయితే లాక్డౌన్తో ఆమె కుటుంబం ఆకలి మంటల్లో చిక్కుకుంది. దీంతో గ్యాస్ స్టవ్, సిలిండర్ను వెయ్యి రూపాయలకు అమ్మేసి కుటుంబం ఆకలి తీర్చింది. మళ్లీ కట్టెల పొయ్యే ఆమెకు దిక్కయింది.
ఆర్వాల్ జిల్లా కుర్తా బ్లాక్లో ఓ మహిళ ఇంట్లోని మంచాన్ని అమ్మేసి కుటుంబ సభ్యులకు తిండి పెట్టింది. లాక్డౌన్తో ఉపాధి లేకపోవడంతో తిండి గింజలు దొరక్క ఆకలికి మాడుతున్నామని పేద కార్మికులు మీడియా ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. లాక్డౌన్ విధించడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న బిహార్కు చెందిన వలస కార్మికులు 1.80 లక్షల మందిపైగా సొంత ఊళ్లకు తిరిగివచ్చారు. వీరందరూ తిండి దొరక్క ఆకలితో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి.